Fake News, Telugu
 

ముస్లింల ఇళ్ళను కూల్చినప్పుడు ప్రాచీన దేవాలయాలు కనుగొనబడ్డాయి అన్న పాత ఫేక్ న్యూస్ మళ్ళీ షేర్ చేస్తున్నారు

0

‘ఇది కాశీ విశ్వనాథ్ మందిర్ నుండి గంగా నది వరకు నిర్మించిన దావ. మందిరము పక్కన ఉన్న 78 ముస్లిం కుటుంబాలకు వారి ఇళ్లను ఖాళీ చేయటానికి ప్రభుత్వం భారీగా పరిహారం ఇచ్చింది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే వారి ఇళ్లను కూల్చివేసే సమయంలో అక్కడ 40 చిన్న దేవాలయాలు కనుగొనబడ్డాయి.’ అని చెప్తూ ఒక వీడియోతో కూడిన పోస్ట్ ని సోషల్ మీడియా ద్వారా బాగా షేర్ చేస్తున్నారు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

.ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు

క్లెయిమ్: కాశీ విశ్వనాథ్ మందిర్ నుండి గంగా నది వరకు నిర్మించిన దావ కొరకు 78 మంది ముస్లిం ఇళ్ళను కూల్చినప్పుడు 40 దేవాలయాలు కనుగొనబడ్డాయి.

ఫాక్ట్: కాశీ విశ్వనాథ్ దేవాలయం కారిడార్ ప్రాజెక్ట్ కొరకు అసలు ముస్లింల ఇళ్ళు కూల్చలేదు. ఆ ప్రదేశంలో కేవలం హిందువుల ఇళ్లే ఉన్నాయి. వారి ఇళ్ళు కూల్చినప్పుడు ప్రాచీన దేవాలయాలు కనుగొనబడ్డాయి. కాశీ విశ్వనాథ్ దేవాలయం కారిడార్ ప్రాజెక్ట్ కరోనా సెకండ్ వేవ్ మూలాన ఆలస్యం అయ్యింది; ఇంకా పూర్తి నిర్మాణం అవలేదు. నవంబర్ లోగా పూర్తి కావచ్చు అని వార్త పత్రికలూ రిపోర్ట్ చేసాయి. కావున, పోస్ట్ ద్వారా చెప్పేది తప్పు.

పోస్ట్ లోని విషయం గురించి గూగుల్ లో వెతకగా, ‘టైమ్స్ అఫ్ ఇండియా’ వారి ఆర్టికల్ ఒకటి సెర్చ్ రిజల్ట్స్ లో వస్తుంది. కాశీ విశ్వనాథ్ దేవాలయం కారిడార్ ప్రాజెక్ట్ కొరకు భవనాలను కూల్చగా, ప్రాచీన దేవాలయాలు కనుగొన్నట్లు ఆ ఆర్టికల్ లో చదవొచ్చు. అయితే పోస్టులో చెప్పినట్టు కూల్చినవి ముస్లింల ఇళ్ళు అని ఎక్కడా కూడా లేదు. పోస్ట్ లో పెట్టిన ఒక వీడియోలో కూడా 38 సెకండ్ల దగ్గర కూల్చినవి హిందూ ఇళ్ళు అని అన్నట్టు వినొచ్చు.

2019 సంవత్సరం మే నెలలో ‘సండే గార్డియన్ లైవ్’ వారితో ఆ కారిడార్ నిర్మాణ బాధ్యతలు వహిస్తున్న విశాల్ సింగ్ (సీఈఓ – శ్రీ కాశీ విశ్వనాథ్ ఆలయ ట్రస్ట్) మాట్లాడుతూ, అక్కడ ఆ కారిడార్ ప్రదేశంలో ఉన్నవారు అందరు హిందువులే అని తెలిపాడు.

2019 సంవత్సరంలో కూడా ఇదే క్లెయిమ్ తో వీడియోలు వైరల్ అయినప్పుడు, ‘ఆల్ట్ న్యూస్’ వారితో విశాల్ సింగ్ మాట్లాడుతూ కూడా ఒక ముస్లిం ఇల్లు కూడా వారు కారిడార్ కోసం కూల్చలేదని తెలిపినట్టు వారి ఆర్టికల్ లో చదవొచ్చు. అంతేకాదు, కారిడార్ కొరకు తీసుకున్న ఇళ్ల వివరాలను ‘Shri Kashi Vishwanath Special Area Development Board’ వారి వెబ్సైటులో చూడవొచ్చు. అందులో కూడా ఎవరూ ముస్లింలు లేనట్టు చూడవొచ్చు.

ప్రస్తుతం కాశీ విశ్వనాథ్ కారిడార్ ప్రాజెక్ట్ కరోనా సెకండ్ వేవ్ మూలాన ఆలస్యం కావొచ్చు అని, అసలైతే ప్రాజెక్ట్ ఆగష్టులోగా పూర్తి అవాల్సి ఉందని, కానీ నవంబర్ దాకా టైం పడుతుంది అని, కొత్తగా ఫీచర్స్ ఆడ్ చేసిన గంగా వ్యూ పాయింట్ ప్రాజెక్ట్ కు రాష్ట్ర ప్రభుత్వ ఆమోదం ఇంకా రానందున మరింత ఆలస్యం అవుతుంది అని ఈ ఆర్టికల్ ద్వారా తెలుస్తుంది. ఈ ప్రాజెక్ట్ గురించి మరింత సమాచారం కొరకు ఈ ఆర్టికల్ చదవొచ్చు.

గత సంవత్సరం కూడా ఇదే క్లెయిమ్ తో వీడియో వైరల్ అయినప్పుడు FACTLY ప్రచురించిన ఫాక్ట్-చెక్ ఆర్టికల్ ఇక్కడ చూడొచ్చు.

చివరగా, కాశీ విశ్వనాథ్ దేవాలయం కారిడార్ ప్రాజెక్ట్ కొరకు ముస్లింల ఇళ్ళు కూల్చినప్పుడు ప్రాచీన దేవాలయాలు కనుగొనబడ్డాయన్న పాత ఫేక్ న్యూస్ ఇప్పుడు మళ్ళీ షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll