“2025 నూతన సంవత్సరం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రతి ఒక్కరికీ 3 నెలల రీఛార్జ్ ₹749 పూర్తిగా ఉచితంగా ఇస్తున్నారు” అని చెప్తూ ఉన్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: 2025 నూతన సంవత్సరం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు ప్రతి ఒక్కరికీ 3 నెలల మొబైల్ రీఛార్జ్ ₹749 పూర్తిగా ఉచితంగా అందిస్తున్నారు.
ఫాక్ట్(నిజం): 2025 నూతన సంవత్సరం సందర్భంగా, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అందరికీ 3 నెలల మొబైల్ రీఛార్జ్ను పూర్తిగా ఉచితంగా అందిస్తున్నారు అని చెప్తున్న ఈ వైరల్ మెసేజ్ ఫేక్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లేదా ఏపీ ప్రభుత్వం ఎటువంటి ఉచిత మొబైల్ రీఛార్జ్ను అందించడం లేదు. ఇటువంటి ఫేక్ లింకులు క్లిక్ చేస్తే సైబర్ మోసాల బారిన పడతారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఫ్యాక్ట్ చెకింగ్ విభాగం 12 జనవరి 2025న వారి అధికారిక X(ట్విట్టర్)లో ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.
ఈ వైరల్ మెసేజ్/పోస్ట్ని జాగ్రత్తగా గమనిస్తే, ఇది ఫేక్ అని అర్థమవుతుంది. వైరల్ అవుతున్న పోస్ట్లో ఇవ్వబడిన యూఆర్ఎల్ లింక్ (URL) అనేది ఓ బ్లాగ్స్పాట్కు సంబంధించినది. ఈ యూఆర్ఎల్కు, టెలీకాం ఆపరేటర్లకు ఎలాంటి సంబంధం లేదు. అలాగే, ఈ వైరల్ పోస్టులో ఉన్న యూఆర్ఎల్ లింక్ (URL) మీద క్లిక్ చేయగా, ఈ బ్లాగ్ తొలగించబడిందని ఓ మెసేజ్ కనిపిస్తోంది. వైరల్ అవుతున్న మెసేజ్లో, రూ.749 విలువైన 3 నెలల రీఛార్జ్ పూర్తిగా ఉచితంగా ఇవ్వబడుతుందని పేర్కొనబడింది, కానీ ఈ మెసేజ్లో ఏ నెట్వర్క్ వినియోగదారులకు అని పేర్కొనబడలేదు. మూడు నెలలకు రూ.749 ప్లాన్ అనేది అన్ని నెట్వర్క్లలో ఉండదు.
వైరల్ పోస్ట్లో చెప్పినట్లుగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అందరికీ 3 నెలల ఉచిత మొబైల్ రీఛార్జ్ ఇస్తున్నారా లేదా ఇటీవల దీని కోసం ఏదైనా పథకాన్ని ప్రారంభించారా? అని తగిన కీవర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్లో వెతకగా, ఇలాంటి ఒక పథకం ఉందని తెలిపే వార్తా కథనం గాని లేక ప్రభుత్వ సమాచారం గాని మాకు లభించలేదు.
తదుపరి, మేము నారా చంద్రబాబు నాయుడు మరియు తెలుగుదేశం పార్టీ (TDP) అధికారిక సోషల్ మీడియా ఖాతాలను (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ) కూడా తనిఖీ చేసాము. అక్కడ కూడా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అందరికీ ఉచితంగా 3 నెలల మొబైల్ రీఛార్జ్ ఇస్తున్నట్లు మాకు ఎటువంటి సమాచారం దొరకలేదు.
ఈ క్రమంలోనే, వైరల్ అవుతున్న మెసేజ్/పోస్టు ఫేక్ అని చెప్తూ ఉన్న పలు వార్తాకథనాలు మాకు లభించాయి (ఇక్కడ, ఇక్కడ). సీఎం చంద్రబాబు ఉచిత రీఛార్జ్ ఇస్తున్నారంటూ పలు వాట్సాప్ గ్రూపులలో ఓ మెసేజ్ బాగా సర్క్యులేట్ అవుతుంది. వాటిని క్లిక్ చేస్తే బ్యాంక్ అకౌంట్లో నగదు కోల్పోయే ప్రమాదం ఉందని పోలీసులు హెచ్చరించారు అని ఈ కథనాలు పేర్కొన్నాయి.

ఈ వైరల్ మెసేజ్/పోస్టుపై 12 జనవరి 2025న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఫ్యాక్ట్ చెక్ విభాగం వారి అధికారిక X(ట్విట్టర్)లో స్పందిస్తూ (ఆర్కైవ్డ్ లింక్), ఈ మెసేజ్ ఫేక్ అని స్పష్టం చేసింది. “ఇటువంటి మోసపూరిత ఆఫర్ల గురించి ప్రభుత్వం ఎప్పుడూ ప్రకటన చేయదు. విష ప్రచారం నమ్మొద్దు. ఇటువంటి ఫేక్ లింకులు క్లిక్ చేస్తే సైబర్ మోసాల బారిన పడతారు” అని పోస్ట్లో పేర్కొన్నారు.
గతంలో కూడా, ఇటువంటి ఉచిత రీఛార్జ్ స్కీములకు సంబంధించిన పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ కాగా, వాటిని ఫాక్ట్ – చెక్ చేస్తూ FACTLY రాసిన కథనాలను ఇక్కడ, ఇక్కడ, మరియు ఇక్కడ చూడవచ్చు.
చివరగా, 2025 నూతన సంవత్సరం సందర్భంగా, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అందరికీ 3 నెలల మొబైల్ రీఛార్జ్ను ఉచితంగా అందిస్తున్నారు అని చెప్తున్న ఈ వైరల్ మెసేజ్ ఫేక్.