Fake News, Telugu
 

భారత ప్రభుత్వం మతాల వారీగా నేర గణాంకాలు, పన్ను సంబంధిత డేటాను విడుదల చేయదు

0

భారతదేశ జనాభాలో 18% ఉన్న ముస్లింలు సాంఘిక దురాచారాలకు ఎక్కువగా దోహదపడుతున్నారని సోషల్ మీడియాలో ఒక పోస్ట్ విస్తృతంగా షేర్ చేయబడుతోంది. ఈ పోస్టులో కొన్ని గణాంకాలను షేర్ చేస్తూ, 98% అత్యాచారాలు, 95% దోపిడీలు, 100% ఉగ్రవాదం, 300% జనాభా పెరుగుదల, 800% ప్రభుత్వ సేవల్లో- వాటా పంచుకొంటున్న ముస్లింలు, కేవలం 0.1% పన్ను మాత్రమే చెల్లిస్తున్నారని క్లెయిమ్ చేస్తున్నారు. ఈ పోస్ట్‌లో చేసిన క్లెయిమ్‌ యొక్క వాస్తవికతను ఈ ఆర్టికల్ ద్వారా పరిశీలిద్దాం.

క్లెయిమ్: భారతదేశంలో ముస్లింలు 98% అత్యాచారాలు, 95% దోపిడీలు, 100% తీవ్రవాదం, 300% జనాభా పెరుగుదల, 800% ప్రభుత్వ సేవల వినియోగంలో వాటా దారులైతే, కేవలం 0.1% పన్ను మాత్రమే వీళ్ళు కడుతున్నారు.

ఫాక్ట్(నిజం): భారతదేశంలో ముస్లింలు 98% అత్యాచారాలు, 95% దోపిడీలు, 100% తీవ్రవాదం, 300% జనాభా విస్ఫోటనం మరియు 800% ప్రభుత్వ సౌకర్యాలను ఉపయోగిస్తున్నారని కానీ, ప్రభుత్వానికి కేవలం 0.1% పన్ను మాత్రమే కడుతున్నారని కానీ నిరూపించటానికి ఎటువంటి ఆధారాలు లేవు. భారత ప్రభుత్వం నేర గణాంకాలు, పన్ను సంబంధిత డేటాను మతం ఆధారంగా విడుదల చేయదు. కావున, పోస్ట్‌లో చేసిన క్లెయిమ్ తప్పు.

పోస్టులో చేస్తున్న క్లెయిమ్ వెనుక ఎంత నిజం ఉందో తెలుసుకోవటానికి, అందులో చెప్తున్న ఆయా గణాంకాల గురించి ఇంటర్నెట్లో వెతుకగా, మాకు దొరికిన సమాచారం ఇది:

నేరాల్లో ముస్లింల వాటా:

నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) భారతదేశంలో నేర గణాంకాలని సేకరించే నోడల్ ఏజెన్సీ. ఈ గణాంకాలను మతాల వారీగా NCRB విడుదల చెయ్యదు. NCRB తన వెబ్‌సైట్‌లో ‘క్రైమ్ ఇన్ ఇండియా 2021’(ఇక్కడ) నివేదికను విడుదల చేసింది. ఈ నివేదికలో, నేరాన్ని నమోదు చేయడానికి మతాన్ని ఒక ప్రామాణంగా వారు ఉపయోగిస్తున్నట్లు పేర్కొనలేదు. చాప్టర్ 3- ‘మహిళలపై నేరం’లో కూడా ఏ మతానికి సంబంధించిన ప్రస్తావన లేదు.

అంతకుముందు, 2016-18లో 84,374 రేప్‌లలో 81000 ముస్లింలు పాల్పడ్డారని 2019లో ఒక క్లెయిమ్ ఇంటర్నెట్లో వైరల్ అవ్వగా ఆ సమాచారం తప్పు అని ఫ్యాక్ట్లీ ఒక ఫాక్ట్ చెక్ ఆర్టికల్ ప్రచురించింది.  

NCRB సేకరించిన డేటా (16 మార్చ్ 2022 వరకు ఇది అప్డేట్ చెయ్యబడింది) ప్రకారం, అండర్ ట్రయల్ ఖైదీలలో 67.01% పైగా హిందువులు ఉండగా దాదాపు 19.57% మంది ముస్లింలు ఉన్నారు.

ముస్లింలు చెల్లిస్తున్న పన్ను యొక్క వాటా:

భారత దేశంలో రెండు రకాల పన్నులు ఉన్నాయి; ఒకటి ప్రత్యక్ష పన్ను, మరొకటి పరోక్ష పన్ను. భారత ప్రభుత్వం మతం ఆధారంగా ప్రత్యక్ష లేదా పరోక్ష పన్ను డేటాను విడుదల చేయదు. ఆదాయపు పన్ను శాఖ(Income Tax Department) ప్రత్యక్ష పన్ను (Direct Tax) వసూళ్ల గణాంకాలను విడుదల చేస్తుంది, అయితే ఇవి కూడా మతం ఆధారంగా ఉండవు. ఆదాయపు పన్ను రిటర్న్ గణాంకాలలో (Income Tax Return statistics) అనుసరించే పద్దతిలో కూడా ఏ మత పరమైన డేటా విడుదల చేయరు. వస్తువులు మరియు సేవల పన్ను (Goods and Services Tax (GST))కి సంబంధించిన డేటా కూడా మత ఆధారంగా ఉండదు.

గతంలో, భారతదేశంలో సిక్కులు 33% ఆదాయపు పన్నును చెల్లిస్తున్నారు అని ఒక క్లెయిమ్ 2019లో వైరల్ అయినప్పుడు అని నిజం కాదు అని ఫ్యాక్ట్లీ ఒక కథనం ప్రచురిరొంచింది. దాన్ని మీరు ఇక్కడ చదవచ్చు. 

చివరిగా, భారత ప్రభుత్వం మతం ఆధారంగా నేర గణాంకాలు మరియు పన్ను సంబంధిత డేటాను విడుదల చేయదు.

Share.

About Author

Comments are closed.

scroll