Fake News, Telugu
 

ముఖమంత్రి జగన్ మోహన్ రెడ్డి జైలుకి వెళ్లే రోజులు దగ్గరపడ్డాయి అని మంత్రి రోజా అనలేదు, ఈ వీడియో ఎడిట్ చేసినది.

0

“జగన్ మోహన్ రెడ్డి పాపాలు పండాయి, తను జైలుకి వెళ్లి చిప్పకూడు తినే రోజు దగ్గర పడింది”, అని మంత్రి రోజా అంటున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఈ వీడియో వెనుక నిజానిజాలు ఏంటో ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం.

క్లెయిమ్: ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి జైలుకి వెళ్లే రోజు దగ్గరపడింది అని వ్యాఖ్యానించిన మంత్రి రోజా. 

ఫాక్ట్(నిజం): ఈ వీడియో డిజిటల్‌గా ఎడిట్ చెయ్యబడింది. అసలు వీడియోలో మంత్రి రోజా విలేఖరులతో మాట్లాడుతూ “చంద్రబాబు నాయుడు పాపాలు పండాయి, జైలుకి వెళ్లే రోజులు దగ్గరపడ్డాయి అనే దానికి ఇంతకన్నా నిదర్శనం ఏమి కావలి..” అని అన్నారు. అసలు వీడియోలో చంద్రబాబు నాయుడు అని మంత్రి రోజా అన్న చోట జగన్ మోహన్ రెడ్డి అనే ఆడియోను ఎడిట్ చేసి వైరల్ వీడియోను తయారు చేసారు. కావున పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

ముందుగా ఈ వీడియోను నిశితంగా గమనిస్తే, మంత్రి రోజా, జగన్ మోహన్ రెడ్డి పేరు పలికినప్పుడు వస్తున్న శబ్దానికీ, మిగిలిన పదాలు పలుకుతున్నపుడు వస్తున్న శబ్దానికి వ్యత్యాసం ఉంది. ఇది ఈ వీడియో ఎడిట్ చేయబడినది ఏమో అనే అనుమానాన్ని మాకు కలిగించింది. అంతే కాక, ఈ వీడియో ఎడిట్ చేసిందిలా ఉందని కొందరు కామెంట్ చేసారు. 

వీడియోలో మైకుల పైన సాక్షి మరియు NTV లోగోలు చూసి, మంత్రి రోజా ఈ చానళ్లకు ఇచ్చిన అసలు ఇంటర్వ్యూ కోసం యుట్యుబ్‌లో కీ వర్డ్ సెర్చ్ చేసి వెతికాము. మే 3వ తారీఖున సాక్షి TV ఛానెల్లో ‘ Minister Roja Reaction On Supreme Court Verdict On Amaravati Irregularities Case @SakshiTVLIVE..’ అనే టైటిల్ ఉన్న వీడియో అప్లోడ్ చేసింది, ఇది వైరల్ వీడియో యొక్క అసలు వెర్షన్.

ఇందులో మంత్రి రోజా, చంద్ర బాబు నాయుడు గురించి మరియు కొందరు నాయకుల గురించి మాట్లాడారు. వీడియో మొదట్లోనే తను ‘ చంద్రబాబు నాయుడు పాపాలు పండాయి, జైలుకి వెళ్లే రోజులు దగ్గరపడ్డాయి ’ అని అంటారు. అదేవిధంగా, వైరల్ వీడియోలో ఉన్న మరో వాక్యం  0:55 టైం స్టాంపు దగ్గర నుండి మొదలవుతుంది, తను మాట్లాడుతూ ‘ప్రజల(ను) నష్టపరిచే విధంగా, రాష్ట్రం నష్టపోయే విధంగా చంద్రబాబు నాయుడు ఎలా చేసాడో అన్నిటికి సాక్షాధారాలు ఉన్నాయి కాబట్టి 100 పర్సెంటు చంద్రబాబు నాయుడు చిప్పకూడు తినే రోజు దగ్గరపడింది.’  ఈ వీడియో ఆధారంగా తను మాట్లాడింది, తెలుగు దేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు  నాయుడు గురించి అని, ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గురించి కాదు అని స్పష్టంగా తెలుస్తుంది. వైరల్ వీడియోను అసలు వీడియోలో చంద్రబాబు నాయుడు అని మంత్రి రోజా అన్న చోట జగన్ మోహన్ రెడ్డి అనే ఆడియోను ఎడిట్ చేసి తయారు చేసారు. చంద్రబాబు నాయుడుపై తను ఇదే విధమైన వ్యాఖలు చేసినట్లు ‘ది హిందూ’ పత్రిక కూడ మే 5వ తారీఖున రిపోర్టు చేసింది.

చివరిగా, ముఖమంత్రి జగన్ మోహన్ రెడ్డి జైలుకి వెళ్లే రోజులు దగ్గరపడ్డాయి అని మంత్రి రోజా అనలేదు, ఈ వీడియో ఎడిట్ చేయబడినది. 

Share.

About Author

Comments are closed.

scroll