Fake News, Telugu
 

సంబంధంలేని పాత ఫోటోని భర్త దాడి తర్వాత ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నటి పూనమ్ పాండే అని షేర్ చేస్తున్నారు

0

హిందూ దేవతలపై, హిందుత్వంపై ఎప్పుడు అనుచిత వ్యాఖ్యలు చేసే బాలీవుడ్ నటి పూనమ్ పాండే, తన భర్త చేసిన దాడి కారణంగా ఇప్పుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న దృశ్యాలంటూ సోషల్ మీడియాలో మూడు ఫోటోలతో కూడిన ఒక పోస్టు షేర్ అవుతుంది. పూనమ్ పాండే ఇటీవల తలకు, కంటికి, మొహంపై గాయాలతో ముంబైలోని ఒక ఆసుపత్రిలో చికిత్స కోసం చేరిన నేపథ్యంలో, ఈ ఫోటో సోషల్ మీడియాలో షేర్ అవుతుంది. ఈ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఈ పోస్టు యోక్క ఆర్కైవ్డ్ వెర్షన్‌ని ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: భర్త దాడి తర్వాత నటి పూనమ్ పాండే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న దృశ్యాలు.

ఫాక్ట్ (నిజం): ఈ ఫోటోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నది ఉత్తరాఖండ్ హాల్ద్వాని నగరానికి చెందిన ఆర్ష పాండే, బాలీవుడ్ నటి పూనమ్ పాండే కాదు. 2018లో దోపిడీ దొంగలు చేసిన దాడిలో ఆర్షి పాండే తలకు, దవడకు తీవ్ర గాయలయినట్టు తెలిసింది. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

పోస్టులో షేర్ చేసిన ఫోటోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతికితే, ఈ ఫోటోలో కనిపిస్తున్న అదే అమ్మాయి, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నప్పుడు తీసిన వీడియో ఒకటి దొరికింది. ఆర్ష పాండే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నప్పుడు తీసిన వీడియో అని వివరణలో తెలిపారు. ఇదే ఫోటోని షేర్ చేస్తూ ‘Jagran’ న్యూస్ సంస్థ 15 సెప్టెంబర్ 2018 నాడు ఆర్టికల్‌ పబ్లిష్ చేసినట్టు తెలిసింది. ఈ ఫోటోలో కనిపిస్తున్నది ఉత్తరాఖండ్ హాల్ద్వాని నగరానికి చెందిన  ఆర్ష పాండే అని ఆర్టికల్‌లో తెలిపారు. హాల్ద్వాని నగరం గోరపడావ్ ప్రాంతంలో ఉన్న ఆర్ష పాండే ఇంటిపై దోపిడీ దొంగల దాడి చేసి ఆమెని తీవ్రంగా గాయపరిచినట్టు ఈ ఆర్టికల్‌లో రిపోర్ట్ చేసారు.

ఉత్తరాఖండ్ హాల్ద్వాని నగరంలో చోటుచేసుకున్న ఈ దోపిడీ దొంగల దాడి ఘటనకు సంబంధించి ‘The Times of India’ 28 ఆగష్టు 2018 నాడు ఆర్టికల్ పబ్లిష్ చేసింది. హాల్ద్వాని నగరం గోరపడావ్ ప్రాంతంలో నివసిస్తున్న లక్ష్మి దత్ పాండే అనే వ్యాపారవేత్త ఇంటిపై గుర్తుతెలియని కొందరు దోపిడీ దొంగలు దాడి చేసినట్టు ఈ ఆర్టికల్‌లో రిపోర్ట్ చేసారు. ఈ దాడిలో లక్ష్మి దత్ పాండే భార్య పూనమ్ పాండే మరణించిందని, కూతురు ఆర్ష పాండేకు తీవ్ర గాయలయినట్టు ఆర్టికల్‌లో తెలిపారు. పూనమ్ పాండే హత్య ఘటనకు సంబంధించి పబ్లిష్ అయిన మరికొన్ని న్యూస్ ఆర్టికల్స్‌ని ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు.

07 నవంబర్ 2021 నాడు బాలీవుడ్ నటి పూనమ్ పాండే తలకు, కంటికి, మొహంపై గాయాలతో ఆసుపత్రిలో చేరినట్టు పలు వార్తా సంస్థలు రిపోర్ట్ చేసాయి. భర్త సామ్ అహ్మద్ బాంబే తనపై దాడి చేసాడని పూనమ్ పాండే ఆరోపించడంతో, ముంబై పోలీసులు సామ్ బాంబేని అదే రోజు అరెస్ట్ కూడా చేసారు. కాని, పూనమ్ పాండే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఫోటోలేవి ఇప్పటి వరకు ఇంటర్నెట్‌లో షేర్ అవలేదు. ఈ వివరాల ఆధారంగా పోస్టులో షేర్ చేసిన ఫోటోలో కనిపిస్తున్న 2018లో దోపిడీ దొంగల దాడిలో గాయపడిన ఆర్షి పండే అని, బాలీవుడ్ నటి  పూనమ్ పాండే కాదని ఖచ్చితంగా చెప్పవచ్చు.

చివరగా, 2018లో దోపిడీ దొంగల దాడిలో గాయపడిన ఆర్ష పాండే ఫోటోని ఇటీవల భర్త దాడి తరువాత పూనమ్ పాండే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న దృశ్యాలని షేర్ చేస్తున్నారు.  

Share.

About Author

Comments are closed.

scroll