ఒక జింకను కొన్ని చిరుత పులులు వేటాడుతున్న ఫోటో (ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ) ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఫొటోను షేర్ చేస్తూ, తన రెండు జింక పిల్లలను రక్షించుకోవడానికి తల్లి జింక తనను తాను ఇలా త్యాగం చేసిందని క్లెయిమ్ చేస్తున్నారు. ఈ ఫోటో వివాదానికి కారణమైంది అని, దీనికి దశాబ్దపు ఉత్తమ ఫోటో అవార్డు కూడా దక్కింది అని ఈ పోస్టులలో చెప్తున్నారు. ఈ క్లెయిమ్ వెనుక ఉన్న నిజానిజాలను ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం.

క్లెయిమ్: తన పిల్లలను రక్షించుకోవడానికి చిరుతలకు తనను తాను త్యాగం చేస్తున్న జింక యొక్క ఫోటో.
ఫ్యాక్ట్(నిజం): ఈ ఫోటోను తీసిన ఫోటోగ్రాఫర్, వైరల్ అవుతున్న ఈ కథనం ఫేక్ అని 2017లో స్పష్టం చేశారు. కావున, పోస్ట్లో చేస్తున్న క్లయమ్ తప్పు.
ముందుగా, ఈ ఫోటో వెనుక ఉన్న అసలు నిజాలను తెలుసుకోవడానికి ఇంటర్నెట్లో తగిన కీ వర్డ్స్ ఉపయోగించి సెర్చ్ చేశాము. ఈ సెర్చ్ ద్వారా, ఈ ఫోటోను తీసిన అసలు ఫోటోగ్రాఫర్ యొక్క ఫేస్బుక్ పోస్ట్ ఒకటి మాకు లభించింది. అలిసన్ బుట్టిగేగ్ అనే ఫోటోగ్రాఫర్, ఈ ఫోటోను పోస్ట్ చేస్తూ, తన ఈ ఫోటో ఒక తప్పుడు కథనంతో వైరల్ అవుతుంది అని వాపోయారు. ఇదే పోస్టులో తను ఈ ఫోటో వెనుక ఉన్న అసలు కథనం ఉన్న ఆమె వెబ్సైట్ లింక్ ఇచ్చారు.

ఆమె వెబ్సైట్లో ఉన్న వివరాల ప్రకారం ఈ ఫొటోలో జింకను చంపుతున్నది నరాషా అనే ఒక ‘తల్లి’ చిరుతపులి. సెప్టెంబర్ 2013లో కెన్యాలోని మసై మారాలో ఈ సంఘటన జరిగింది.

ఎర జంతువులని ఎలా చంపాలో తన పిల్లలకు నరాషా నేర్పుతున్నప్పుడు ఈ ఫోటోను తీశారు అని అలిసన్ తన కథనంలో చెప్పారు. అంతే కానీ వైరల్ పోస్టులో చెప్తున్నట్లుగా ఈ జింక తన పిల్లలను కాపాడటానికి తనను తాను చిరుతలకి అర్పించుకుంది అని ఎక్కడా చెప్పలేదు. అలాగే, వైరల్ పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు అని అలిసన్ తన ఇన్స్టాగ్రామ్లో కూడా ఒక వివరణ ఇచ్చారు.
అదనంగా, ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి యూట్యూబ్లో మాకు లభించింది. అసలు ఈ వేట జరుగుతున్నప్పుడు చుట్టుపక్కల పిల్ల జింకలు లేవు అని మనం ఈ వీడియోలో స్పష్టంగా చూడవచ్చు.
ఈ ఫోటో తీసినందుకు గాను అలిసన్ ‘Siena International Photography Awards’లో ఒక అవార్డు గెలుచుకున్నారు(ఇక్కడ మరియు ఇక్కడ).

చివరిగా, చిరుతలు ఒక జింకను వేటాడుతున్న ఒక ఫొటోని ఒక తప్పుడు కథనంతో సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.