Fake News, Telugu
 

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా ఇటీవల పవన్ కళ్యాణ్‌ను కలిసేందుకు ఆంధ్రప్రదేశ్‌కు వెళ్ళలేదు

0

అప్డేట్ (08 November 2022): జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ హత్యకు కుట్ర జరుగుతోందని, హైదరాబాద్ లోని పవన్ ఇంటి వద్ద రెక్కీ జరిగిందని జనసేన నేతలు వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో, ఈ విషయం తెలుసుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పవన్‌ కల్యాణ్‌ ఇంటికి చేరుకున్నారని సోషల్ మీడియాలో ఒక వీడియో షేర్ చేస్తున్నారు. అయితే అసలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పవన్‌ కల్యాణ్‌ ఇంటికి వాచినట్టు ఎక్కడా రిపోర్ట్ అవ్వలేదు. అలాగే పోస్టులో షేర్ చేసిన వీడియో ప్రధానమంత్రి మోదీ బెర్లిన్ వెళ్ళినప్పటిదని తెలిసింది. అలాగే జూబ్లీహిల్స్‌ పోలీసులు పవన్‌ కల్యాణ్‌పై దాడికి కుట్ర ఏమి జరగలేదని తెలిపారు.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల చేపట్టిన విశాఖ పర్యటన తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసిన నేపథ్యంలో, బీజేపీ ముఖ్య నాయకులు నరేంద్ర మోదీ, అమిత్ షా పవన్ కళ్యాణ్‌ను కలిసేందుకు మంగళగిరి, విజయవాడకు వచ్చారని సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు షేర్ అవుతున్నాయి. అవి ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు. అంతేకాదు, వైసీపీ నాయకురాలు రోజా ఇటీవల పవన్ కళ్యాణ్‌పై చేసిన విమర్శలకు పవన్ మాజీ భార్య రేణు దేశాయి ఘాటుగా స్పందించారని సోషల్ మీడియాలో ఒక పోస్ట్ షేర్ అవుతుంది. ఆ పోస్టులలో ఎంతవరకు నిజముందో చూద్దాం.

క్లెయిమ్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా ఇటీవల జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను కలిసేందుకు ఆంధ్రప్రదేశ్‌కు వచ్చారు. పవన్ కళ్యాణ్‌పై రోజా చేసిన విమర్శలకు రేణు దేశాయి ఘాటుగా స్పందించారు. 

ఫాక్ట్ (నిజం): నరేంద్ర మోదీ మరియు అమిత్ షా ఇటీవల జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను కలుసుకొనేందుకు ఆంధ్రప్రదేశ్‌కు వెళ్ళలేదు. పవన్ కళ్యాణ్, నరేంద్ర మోదీ మరియు అమిత్ షాలను కలుసుకొన్న పాత చిత్రాలని ఈ వీడియోలలో షేర్ చేశారు. అలాగే, వైసీపీ నాయకురాలు రోజా ఇటీవల పవన్ కళ్యాణ్‌పై చేసిన విమర్శలకు పవన్ మాజీ భార్య రేణు దేశాయి స్పంధించలేదు. కేవలం వీక్షకులను ఆకర్షించాలనే ఉద్దేశంతో ఈ సంచలనాత్మకమైన టైటిల్స్ తో ఉన్న వీడియోలు రూపొందించారు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.  

వీడియో 1:

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పవన్ కళ్యాణ్‌ను కలిసేందుకు ఇటీవల మంగళగిరి వచ్చిన దృశ్యాలంటూ ఈ వీడియోని షేర్ చేశారు. కానీ, ఈ వీడియోలో ప్రధాని నరేంద్ర మోదీ పవన్ కళ్యాణ్‌ను కలుసుకున్నట్టుగా చూపిస్తున్న చిత్రం చాలా పాతదని తెలిసింది. 2014లో పవన్ కళ్యాణ్ నరేంద్ర మోదీని అహ్మదాబాద్లో కలుసుకున్న చిత్రాన్ని ఈ వీడియోలో చూపించారు. ఈ విషయాన్ని రిపోర్ట్ చేస్తూ పలు వార్తా సంస్థలు ఆర్టికల్స్ కూడా పబ్లిష్ చేశాయి. నరేంద్ర మోదీ  ఇటీవల పవన్ కళ్యాణ్‌ను కలిసేందుకు మంగళగిరికి వచ్చినట్టు ఎక్కడా ఆధారాలు లేవు. కేవలం వీక్షకులను ఆకర్షించాలనే ఉద్దేశంతో ఈ సంచలనాత్మకమైన టైటిల్స్ తో ఉన్న వీడియోలు రూపొందించారు.  

వీడియో 2:

పవన్ కళ్యాణ్ కోసం విజయవాడ నోవోటెల్ చేరుకున్న అమిత్ షా అంటూ మరొక విడియోని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. కానీ, ఈ వీడియోలో అమిత్ షా పవన్ కళ్యాణ్‌ను కలుసుకొన్న చిత్రంగా షేర్ చేసినది పాత ఫోటో అని తెలిసింది. 2021 ఫిబ్రవరి నెలలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌, అమిత్ షాను పార్లమెంటులో కలుసకొన్నప్పుడు తీసిన చిత్రమిది. ఈ వీడియోలో కనిపిస్తున్న దృశ్యాలు 2019 నుండి సోషల్ మీడియాలో షేర్ అవుతున్నాయి. విశాఖ పర్యటనలో చోటుచేసుకున్న ఉద్రికత్తుతులకు సంబంధించి పవన్ కళ్యాణ్‌ను కలిసేందుకు ఇటీవల అమిత్ షా విజయవాడకు రాలేదు.

వీడియో 3:

పవన్ కళ్యాణ్ మూడు పెళ్ళిళ్ళు మరియు విడాకులకు సంబంధించి రోజా చేసిన వ్యాఖ్యలకు పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయి మీడియా ముందు ఘాటుగా స్పందించారని ఈ వీడియోలో క్లెయిమ్ చేస్తున్నారు. ఈ విషయానికి సంబంధించిన సమాచారం కోసం వెతికితే, రోజా విమర్శలకు రేణు దేశాయి ఇటీవల మీడియా ముందు స్పంధించినట్టు ఎటువంటి ఆధారాలు దొరకలేదు. దీనికి సంబంధించి రేణు దేశాయి తన అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో ఎటువంటి వీడియోలు గాని మరే ఇతర పోస్టులు గాని పెట్టలేదని తెలిసింది. 2022 మే నెలలో నిర్వహించిన ‘డిజిటల్ హిందూ కాన్క్లేవ్’ కార్యక్రమంలో రేణు దేశాయి ప్రసంగిస్తున్నప్పుడు తీసిన చిత్రాలని ఈ వీడియోలో షేర్ చేశారు. కేవలం వీక్షకులను ఆకర్షించాలనే ఉద్దేశంతో ఈ సంచలనాత్మకమైన టైటిల్స్ తో ఉన్న వీడియోలు రూపొందించారని పై వివరాల ఆధారంగా ఖచ్చితంగా చెప్పవచ్చు.

చివరగా, పాత ఫోటోలని షేర్ చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీ మరియు అమిత్ షా ఇటీవల పవన్ కళ్యాణ్‌ను కలుసుకొనేందుకు ఆంధ్రప్రదేశ్‌కు వచ్చినట్టు షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll