Fake News, Telugu
 

2018లో అంబేడ్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ హార్ధిక్ పాండ్య పేరుతో ట్వీట్ చేసింది ఒక ఫేక్ అకౌంట్

0

అంబేద్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు భారత క్రికెట్ ఆటగాడు హార్ధిక్ పాండ్యపై కేసు నమోదు చేయాలని జోధ్‌పుర్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది అంటూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ షేర్ అవుతోంది. “ఏ అంబేద్కర్ అస్పష్ట రాజ్యాంగాన్ని రాసినతడా..? రిజర్వేషన్ అనే వ్యాధిని వ్యాప్తి చేసినతడా?”, అని హార్ధిక్ పాండ్య ట్వీట్ చేసినందుకు జోధ్‌పుర్ కోర్టు ఈ ఆదేశాలు జారీ చేసినట్టు ఈ ట్వీట్లో తెలిపారు. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.  

క్లెయిమ్: అంబేడ్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు భారతీయ క్రికెట్ ఆటగాడు హార్ధిక్ పాండ్యపై కేసు నమోదు చేయాలని జోధ్‌పుర్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

ఫాక్ట్ (నిజం): 2018లో హార్ధిక్ పాండ్య పేరుతో ఉన్న ఒక ఫేక్ ట్విట్టర్ హ్యాండిల్, అంబేడ్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ట్వీట్ పెడితే, ఆ ట్వీట్ హార్ధిక్ పాండ్యనే పెట్టినట్టుగా భావించి జోధ్‌పుర్ హైకోర్టు హార్ధిక్ పాండ్యపై కేసు నమోదు చేయాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. అంబేడ్కర్‌పై తాను ఎటువంటి అనుచిత వ్యాఖ్యలు చేయలేదని, మీడియాలో షేర్ చేస్తున్న ట్వీట్‌ తన పేరుతో రూపొందించిన ఒక ఫేక్ ట్విట్టర్ అకౌంటు పెట్టిందని హర్ధిక్ పాండ్య తన అధికార ట్విట్టర్ హ్యాండిల్‌లో ట్వీట్ ద్వారా స్పష్టం కూడా చేశారు. ఈ కేసులో హర్ధిక్ పాండ్యని నిర్ధోషిగా తేలుస్తూ జోధ్‌పుర్ హైకోర్టు 01 ఆగస్టు 2022 నాడు తీర్పు ఇచ్చింది. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పుదోవ పట్టించే విధంగా ఉంది. 

పోస్టులో చేస్తున్న క్లెయింలకు సంబంధించిన వివరాల కోసం ఇంటర్నెట్లో వెతికితే, హార్ధిక్ పాండ్య అంబేడ్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ట్వీట్ చేసాడని ఆరోపిస్తూ, అతనిపై SC/ST ఆక్ట్ ప్రకారం కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని డా. మెగ్వాల్ అనే వ్యక్తి జోధ్‌పుర్ హైకోర్టులో 2018 మార్చి నెలలో పిటిషన్ ధాఖలు చేసినట్టు తెలిసింది. ఈ కేసు విచారణలో భాగంగా హార్ధిక్ పాండ్యపై కేసు నమోదు చేయాలని జోధ్‌పుర్ హైకోర్టు పోలీసులను ఆదేశించినట్టు పలు వార్తా సంస్థలు 2018లో ఆర్టికల్స్ పబ్లిష్ చేశాయి. అవి ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు.

అయితే, అంబేడ్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఈ ట్వీట్‌ని ‘@sirhardik3777’ అనే హర్ధిక్ పాండ్య పేరుతో ఉన్న ఒక ఫేక్ ట్విట్టర్ అకౌంట్ పెట్టినట్టు పలు వార్తా సంస్థలు రిపోర్ట్ చేశాయి.

తనపై వస్తున్న ఈ ఆరోపణలకు సంబంధించి హర్ధిక్ పాండ్య తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్‌లో 22 మార్చి 2022 నాడు ఒక ట్వీట్ పెట్టారు. అంబేడ్కర్‌పై తాను ఎటువంటి అనుచిత వ్యాఖ్యలు చేయలేదని, మీడియాలో షేర్ చేస్తున్న ట్వీట్‌ను తన పేరుతో రూపొందించిన ఒక ఫేక్ ట్విట్టర్ అకౌంటు పెట్టిందని హర్ధిక్ పాండ్య తన ట్వీట్లో స్పష్టం చేశారు.

2018లో నమోదయిన ఈ కేసులో హర్ధిక్ పాండ్యని నిర్ధోషిగా తేలుస్తూ కోర్టు ఇటీవల తీర్పు ప్రకటించింది. ఈ విషయాన్ని రిపోర్ట్ చేస్తూ పలు వార్తా సంస్థలు ఆర్టికల్స్ కూడా పబ్లిష్ చేశాయి. అవి ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు.

చివరగా, హార్ధిక్ పాండ్య అంబేడ్కర్‌పై ఎటువంటి అనుచిత వ్యాఖ్యలు చేయలేదు; హార్ధిక్ పాండ్య పేరుతో ఒక ఫేక్ పేజీ పెట్టిన ట్వీట్‌కు 2018లో జోధ్‌పుర్ కోర్టు హార్ధిక్ పాండ్యపై కేసు నమోదు చేయాలని ఆదేశాలిచ్చింది.  

Share.

About Author

Comments are closed.

scroll