Fake News, Telugu
 

యోగి అదిత్యనాథ్ ముఖ్యమంత్రి కాక ముందు నుంచే యూపీ రెవెన్యూ మిగులు రాష్ట్రంగా ఉంది

0

యోగి ఆదిత్యనాథ్ పాలనలో కొత్త పన్నులు విధించకుండానే దేశంలో మిగులు నిధులున్న ఒకే ఒక రాష్ట్రంగా ఉత్తర ప్రదేశ్ అవతరించిందని చెప్తూ ఒక పోస్టు సోషల్ మీడియాలో బాగా ప్రచారంలో ఉంది. దీంట్లో ఎంత నిజముందో ఇప్పుడు చూద్దాం.

క్లెయిమ్: యోగి ఆదిత్యనాథ్ పాలనలో దేశంలో మిగులు నిధులున్న ఒకే ఒక రాష్ట్రంగా ఉత్తర ప్రదేశ్ అవతరించింది.

ఫాక్ట్: కాగ్ నివేదికల ప్రకారం, 2006-07 నుంచే ఉత్తర ప్రదేశ్ రెవెన్యూ మిగులుని నమోదు చేసే రాష్ట్రంగా ఉంది.పైగా, RBI తాజా గణాంకాల ప్రకారం 2020-21లో ఉత్తరప్రదేశ్ రెవెన్యూ లోటు ₹2,367 కోట్లు కాగా ఒడిశా, ఢిల్లీ, మణిపూర్, అస్సాం వంటి రాష్ట్రాలు రెవెన్యూ మిగులుని నమోదు చేశాయి. కావున పోస్టులో చేయబడ్డ క్లెయిమ్ తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

భారత రిజర్వ్ బ్యాంక్ (RBI) & CAG ప్రతిఏటా విడుదల చేసే వివిధ రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి నివేదికల ప్రకారం, ఉత్తర ప్రదేశ్ 2006-07 నుంచి రెవెన్యూ మిగులు రాష్ట్రంగా ఉంది. 2006 నుంచి ఉత్తరప్రదేశ్‌కి చెందిన రెవెన్యూ మిగులు గణాంకాలను ఈ క్రింద పట్టికలో చూడవచ్చు.

ఆర్థిక సంవత్సరంరెవెన్యూ మిగులు(+)/ లోటు(-)  (కోట్లలో
2006-07+4,901
2007-08+3,499
2008-09+1,862
2009-10+7,047
2010-11+3,510
2011-12+6,980
2012-13+5,180
2013-14+10,070
2014-15+22,390
2015-16+14,340
2016-17+20,283
2017-18+12,552
2018-19+28,520
2019-20+67,560
2020-21-2,367
2021-22+22,107(సవరించిన అంచనా)
2022-23+43,127(బడ్జెట్ అంచనా)

పై గణాంకాలను బట్టి, యోగి ఆదిత్యనాథ్ 2017లో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి కాకముందు నుంచే ఉత్తరప్రదేశ్ రెవెన్యూ మిగులు కలిగిన రాష్ట్రంగా ఉందని నిర్ధారించవచ్చు. పైగా RBI తాజా గణాంకాల ప్రకారం, 2020-21 సంవత్సరానికి గాను ఉత్తరప్రదేశ్ రెవెన్యూ లోటుని నమోదు చేయగా ఒడిశా, ఢిల్లీ, మణిపూర్, అస్సాం రాష్ట్రాలు రెవెన్యూ మిగులుని నమోదు చేశాయి.

చివరిగా, యోగి అదిత్యనాథ్ ముఖ్యమంత్రి కాక ముందు నుంచి రెవెన్యూ మిగులు నమోదు చేసే రాష్ట్రంగా ఉంది.

Share.

About Author

Comments are closed.

scroll