Fake News, Telugu
 

ఈ ఫోటోలో ఉన్న వ్యక్తికి ఉత్తరప్రదేశ్ లో జరిగిన అత్యాచారానికి సంబంధం లేదు

0

ఇటీవల ఉత్తరప్రదేశ్ దళిత మహిళ అత్యాచార కేసులో పోలీసులు సమీర్ ఖాన్ అనే కాంగ్రెస్ లీడర్ ని అరెస్ట్ చేసారని చెప్తూ ఉన్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: ఉత్తరప్రదేశ్ దళిత మహిళ అత్యాచార కేసులో పోలీసులు సమీర్ ఖాన్ అనే కాంగ్రెస్ లీడర్ ని అరెస్ట్ చేసారు.

ఫాక్ట్(నిజం): పోస్టులో ఉన్న ఫోటో మధ్య ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తి ఫోటో. ఒక అమ్మాయిని లైంగికంగా వేధించిన కేసులో అరెస్ట్ అయ్యాడు. ఇతనికి  ఉత్తర్ ప్రదేశ్ లో జరిగిన అత్యాచారానికి సంబంధం లేదు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించేలా ఉంది.

పోస్టులో ఉన్న ఫోటో యొక్క స్క్రీన్ షాట్స్ ని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా ఇదే  ఫోటోని ప్రచురించిన ఒక వార్తా కథనం మాకు కనిపించింది. ఈ  వార్తా కథనం ప్రకారం ఫొటోలో ఉన్న వ్యక్తి మధ్య ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సమీర్ ఖాన్ అలియాస్ సికందర్. ఇతనిని 14 సెప్టెంబర్ 2020న ఒక అమ్మాయి అశ్లీల వీడియోలను చిత్రీకరించి లైంగికంగా వేధించాడనే ఆరోపణలపై పోలీసులు అరెస్ట్ చేసారు. దీనికి సంబంధించిన న్యూస్ వీడియోస్ ఇక్కడ ఇంకా ఇక్కడ చూడొచ్చు. దీన్నిబట్టి ఇతనికి  ఉత్తర్ ప్రదేశ్ లో జరిగిన  అత్యాచారానికి సంబంధం లేదని చెప్పొచ్చు.

ఇటీవలే ఉత్తరప్రదేశ్ లోని హత్రాస్ లో జరిగిన 19 ఏళ్ళ యువతి అత్యాచారం నేపథ్యంలో పోస్టులో ఉన్న వార్త లాంటి తప్పుదోవ పట్టించే వార్తలు సోషల్ మీడియాలో విస్తృతంగా  షేర్ చేస్తున్నారు.

చివరగా, పోస్టులో ఉన్న ఫోటోలోని వ్యక్తి మధ్య ప్రదేశ్ లో ఒక అమ్మాయిని లైంగికంగా వేధించిన కేసులో అరెస్ట్ అయ్యాడు, ఉత్తర్ ప్రదేశ్ హత్రాస్ అత్యాచార కేసుకి సంబంధం లేదు.

Share.

About Author

Comments are closed.

scroll