Fake News, Telugu
 

సంబంధం లేని పాత వీడియోని ఒడిశా రైలు ప్రమాదంలో చనిపోయిన వ్యక్తుల శవాలను ట్రక్కులలో కుప్పలుగా వేసి ఒకే దగ్గర ఖననం చేస్తున్న దృశ్యాలంటూ షేర్ చేస్తున్నారు

0

భారత దేశంలో ట్రక్కులలో శవాలను కుప్పలు తెప్పలుగా వేసి సామూహిక ఖననం చేస్తున్న దయనియమైన దృశ్యాలంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో బాగా షేర్ అవుతోంది. ఒడిశా బాలాసోర్ రైలు ప్రమాదం దృశ్యాన్ని చూపిస్తున్న చిత్రాన్ని అలాగే, ఆ ప్రమాదంలో చనిపోయిన వ్యక్తుల శవాల ఫోటోని ఈ వీడియోపై చూపిస్తున్నారు. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

క్లెయిమ్: ఒడిశా రైలు ప్రమాదంలో చనిపోయిన వ్యక్తుల శవాలను ట్రక్కులలో కుప్పలగా వేసి స్మశానవాటికలో ఖననం చేస్తున్న దృశ్యాలు.

ఫాక్ట్ (నిజం): పోస్టులో షేర్ చేసిన వీడియో 2021 నుండి సోషల్ మీడియాలో షేర్ అవుతోంది. కోవిడ్-19 బారిన పడి చనిపోయిన వ్యక్తులను ఖననం చేస్తున్న దృశ్యాలంటూ పలు వెబ్సైట్లు, సోషల్ మీడియా యూసర్లు ఈ వీడియోని షేర్ చేస్తూ తెలిపారు. ఈ వీడియో కొందరు ఆఫ్రికాకు సంబంధించినదని, మరికొందరు వియత్నాం దేశానికి సంబంధించినదని షేర్ చేశారు. పోస్టులో షేర్ చేసిన వీడియో పాతది మరియు ఒడిశా రైలు ప్రమాదానికి సంబంధించినది కాదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు

పోస్టులో షేర్ చేసిన వీడియో యొక్క స్క్రీన్ షాట్లని రివర్స్ ఇమేజ్ సర్చ్ చేసి వెతికితే, ఇవే దృశ్యాలు కలిగిన వీడియోని పలు యూసర్లు 2021 నుండి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నట్టు తెలిసింది. ఆ వీడియోలని ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.

ఆఫ్రికా దేశంలో కోవిడ్-19 బారిన పడి చనిపోయిన వ్యక్తులను సామూహిక ఖననం చేస్తున్న దృశ్యాలని కొన్ని వెబ్సైట్లలో తెలిపారు. అయితే, కొందరు ఈ వీడియో వియత్నాం దేశానికి సంబంధించినదని, మరికొందరు ఈ వీడియో ఇండోనేషియా దేశానికి సంబంధించినదని షేర్ చేశారు. ఈ వీడియో ఎక్కడిదో తెలుసుకోలేనప్పటికి, పోస్టులో షేర్ చేసిన వీడియో పాతది మరియు ఒడిశా రైలు ప్రమాదానికి సంబంధించినది కాదని ఖచ్చితంగా చెప్పవచ్చు.

చివరగా, సంబంధం లేని పాత వీడియోని ఒడిశా రైలు ప్రమాదంలో చనిపోయిన వ్యక్తులను కుప్పలుగా ట్రక్కులలో వేసి స్మశానవాటికలో సామూహిక ఖననం చేస్తున్న దృశ్యాలంటూ షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll