Fake News, Telugu
 

ఢిల్లీ విమానాశ్రయంలో ఒకరు నమాజ్ చేస్తుంటే నటుడు మాధవన్ గాయత్రీ మంత్రాన్ని పఠిస్తున్న ఈ సన్నివేశం ఒక వెబ్ సిరీస్‌లోది

0

ఢిల్లీ విమానాశ్రయంలో ఒకరు నమాజ్ చేయడం చూసి, అక్కడే కూర్చున్న సినీ నటుడు మాధవన్ గాయత్రీ మంత్రాన్ని పఠించడం ప్రారంభించాడని ఒక పోస్ట్ ద్వారా సోషల్ మీడియాలో బాగా షేర్ చేస్తున్నారు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: ఢిల్లీ విమానాశ్రయంలో ఒకరు నమాజ్ చేయడం చూసి, అక్కడే కూర్చున్న సినీ నటుడు మాధవన్ గాయత్రీ మంత్రాన్ని పఠించడం ప్రారంభించాడు.

ఫాక్ట్: ఢిల్లీ విమానాశ్రయంలో ఒకరు నమాజ్ చేయడం చూసి, అక్కడే కూర్చున్న సినీ నటుడు మాధవన్ గాయత్రీ మంత్రాన్ని పఠించడం ప్రారంభించాడని ఎటువంటి ఆధారాలు దొరకలేదు. ఇటీవల మాధవన్ నటించిన ‘డికపుల్డ్’ అనే నెట్‌ఫ్లిక్స్ వెబ్ సిరీస్ లోని ఒక సన్నివేశంలో, ఢిల్లీ విమానాశ్రయంలో గాయత్రి మంత్రాన్ని పఠించడం జరిగిందని సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. కావున, పోస్ట్ ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.    

పోస్టులో చెప్పిన విషయం గురించి ఇంటర్నెట్‌లో వెతకగా, సినీ నటుడు మాధవన్ అలా నిజంగా చేసాడని ఎక్కడా కూడా ఎటువంటి సమాచారం లేదు. ఒకవేళ నిజంగానే అలా జరిగుంటే కొన్ని వార్తాపత్రికలైనా దాని గురించి ప్రచురించేవి. సినీ నటుడు మాధవన్ అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్ – ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ – లో కూడా అది నిజంగా జరిగినట్టు ఎటువంటి సమాచారం లేదు.

ఇటీవల మాధవన్ నటించిన డికపుల్డ్ అనే నెట్‌ఫ్లిక్స్ వెబ్ సిరీస్ లో ఒక వీడియో క్లిప్పింగ్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది.

ఆర్య అయ్యర్ (మాధవన్ పోషించిన పాత్ర పేరు) వెన్ను నొప్పితో బాధపడుతున్నందున కొన్ని వ్యాయామాలు చేయడానికి ఢిల్లీ విమానాశ్రయంలోని ‘ప్రార్థనా గదిలోకి’ వెళ్తాడు. మరొక వ్యక్తి గది లోపల నమాజ్ చేయడం కనిపిస్తుంది. మాధవన్ తన వ్యాయామాన్ని ప్రారంభించినప్పుడు, ఆ వ్యక్తి చిరాకు పడి, అతను తన నమాజ్ ను సగంలో ఆపి, అది ప్రార్థనా గది అని, వ్యాయామ గది కాదని ఆర్యకు చెబుతాడు. మాధవన్ తన వెన్ను నొప్పిగా ఉందని మరియు విమానం ఎక్కే ముందు కొన్ని వ్యాయామాలు చేయాల్సిన అవసరం ఉందని వివరిస్తాడు.

ఆ వ్యక్తి విమానాశ్రయంలోని సిబ్బందికి ఫిర్యాదు చేస్తాడు, వారు మాధవన్ వ్యాయామాలు చేయడానికి అనుమతించమని, ఆ గది ప్రార్థనల కోసం మాత్రమేనని చెబుతారు. మాధవన్, ఈ సమయంలో, గాయత్రి మంత్రాన్ని జపిస్తూ వ్యాయామం చేయడం ప్రారంభిస్తాడు.

చివరగా, డికపుల్డ్ అనే నెట్‌ఫ్లిక్స్ వెబ్ సిరీస్ లోని ఒక సన్నివేశాన్ని పట్టుకొని ఢిల్లీ విమానాశ్రయంలో ఒకరు నమాజ్ చేయడం చూసి సినీ నటుడు మాధవన్ గాయత్రీ మంత్రాన్ని పఠించడం ప్రారంభించాడని అంటున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll