Fake News, Telugu
 

ఈ వైరల్ వీడియో 13 జూన్ 2025, దుబాయ్-జైపూర్ ఎయిర్ ఇండియా విమానానికి సంబంధించినది

0

12 జూన్ 2025న అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం AI 171 టేకాఫ్ అయిన కొద్ది క్షణాలకే, సమీపంలో ఉన్న బీజే మెడికల్ కాలేజీ హాస్టల్ పై కూలిపోయింది. ఈ ఘటనలో విమానంలోని 241 మందితో పాటు హాస్టల్ బిల్డింగ్‌లో ఉన్న మరికొందరు చనిపోయారు. 

ఈ నేపథ్యంలో, 12 జూన్ 2025న అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదానికి ముందు తీసిన వీడియో అంటూ ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది (ఇక్కడ, ఇక్కడ & ఇక్కడ). ఇందులో ఏసీ (AC)  పని చేయకపోవడంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నట్లు కనిపిస్తుంది. వీడియోలో ఒక మహిళ “పరిస్థితి చాలా ఘోరంగా ఉంది, సిబ్బంది ఎవరూ స్పందించట్లేదు” అని చెప్తుండడం మనం చూడవచ్చు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: 12 జూన్ 2025 జరిగిన అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదానికి ముందు, సాంకేతిక లోపం వల్ల విమానంలో AC పని చేయకపోవడంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్న దృశ్యాలు.

ఫాక్ట్(నిజం): ఈ వీడియోకు 12 జూన్ 2025న జరిగిన అహ్మదాబాద్ విమాన ప్రమాదానికి ఎటువంటి  సంబంధం లేదు. ఈ వీడియో 13 జూన్ 2025న దుబాయ్ నుంచి జైపూర్ వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా ఫ్లైట్ (IX-196) ఆలస్యం కారణంగా విమానంలో ప్రయాణికులు ఎదుర్కొన్న ఇబ్బందులను చూపిస్తుంది. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

ఈ వైరల్ వీడియోకు సంబంధించిన సమాచారం కోసం, ఈ వీడియో యొక్క కీఫ్రేములను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ఇదే వీడియో యొక్క అధిక నిడివి గల వెర్షన్‌ను డైటీషియన్, కంటెంట్ క్రియేటర్ అర్జూ సేథి 14 జూన్ 2025న తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో పోస్ట్ చేసినట్టు మేము గుర్తించాము. ఈ పోస్ట్ వివరణ ప్రకారం, దుబాయ్ నుంచి జైపూర్‌కు వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా IX-196 ఫ్లైట్‌లో ఏసీ (AC) పనిచేయకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పైగా సిబ్బంది కూడా స్పందించలేదని ఫ్లైట్‌లో ప్రయాణించిన ఆర్జూ సేథీ ఈ వీడియో తీసి తన సోషల్ మీడియా హ్యాండిల్‌లో పోస్టు చేసినట్టు మాకు తెలిసింది. 

దీని ఆధారంగా, ఈ సంఘటనకు సంబంధించిన మరింత సమాచారం కోసం తగిన కీవర్డ్స్ ఉపయోగించి వెతకగా, ఈ సంఘటనను రిపోర్ట్ చేసిన పలు వార్త కథనాలు (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ) మాకు లభించాయి. ఈ కథనాలు ప్రకారం, 13 జూన్ 2025న రాత్రి 7:25కి దుబాయ్ నుంచి జైపూర్ వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ఫ్లైట్ (నెంబర్ IX-196) టెక్నికల్ సమస్యలతో గంటల తరబడి ఆలస్యం అయింది, దాంతో ప్రయాణికులు విమానంలో దాదాపు ఐదు గంటలపాటు కూర్చుండాల్సి వచ్చింది. ఈ సమయంలో ఏసీ (AC) ఆన్ చేయలేదు, తినేందుకు ఏం ఇవ్వలేదు, కనీసం నీళ్లు కూడా అందించలేదని, దీంతో అసహనానికి గురైన ప్రయాణికులు ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌పై ఫిర్యాదు చేశారని పత్రికలు రిపోర్ట్ చేసాయి.

ఇదే సందర్భంలో, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ స్పందిస్తూ, ఈ ఆలస్యం టెక్నికల్ సమస్యల వల్ల కాదని, కొన్ని ఎయిర్ స్పేస్‌లు తాత్కాలికంగా మూసేయడంతో ఏర్పడిన ఎయిర్ ట్రాఫిక్ కంజెషన్ వల్లే ఫ్లైట్ ఆలస్యం జరిగిందని వివరణ ఇచ్చింది.

చివరిగా, ఈ వైరల్ వీడియోకు అహ్మదాబాద్ విమాన ప్రమాదంతో సంబంధం లేదు; ఇది 13 జూన్ 2025న దుబాయ్-జైపూర్ ఎయిర్ ఇండియా ఫ్లైట్ ఆలస్యం సమయంలో తీసిన వీడియో.

Share.

About Author

Comments are closed.

scroll