Fake News, Telugu
 

ఈ ఫోటో 2019 మాండ్య ఎన్నికలలో సుమలతకు మద్దతుగా దర్శన్ మరియు యష్ ప్రచారంలో పాల్గొన్నప్పటిది

0

మాండ్యాలో బీజేపీ ఎన్నికల ప్రచారంలో సుమలతకు మద్దతుగా కన్నడ నటులు యష్ మరియు దర్శన్ పాల్గొన్నారని చెప్తూ వీళ్ళు ముగ్గురు కలిసి ఉన్న ఫోటో ఒకటి షేర్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో షేర్ అవుతోంది. ఈ కథనం ద్వారా ఆ ఫోటోకు సంబంధించిన నిజమేంటో చూద్దాం.

క్లెయిమ్: మాండ్యాలో బీజేపీ ఎన్నికల ప్రచారంలో సుమలతతో పాటు కన్నడ నటులు యష్ మరియు దర్శన్ పాల్గొన్న ఫోటో.

ఫాక్ట్(నిజం): ఈ ఫోటో 2019 మాండ్య ఎన్నికలలో దర్శన్ మరియు యష్ సుమలత తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నప్పటిది. వచ్చే నెలలో జరగబోయే 2023 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలలో సుమలత మరియు దర్శన్ బీజేపీకి తమ మద్దతును ప్రకటించి, ప్రచారంలో కూడా పాల్గొన్నారు. కాగా యష్ మాత్రం ఏ పార్టీకి తన మద్దతు ప్రకటించినట్టు గాని లేదా ప్రచారంలో పాల్గొన్నట్టు గానీ రిపోర్ట్స్ లేవు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

కర్ణాటక రాష్ట్రంలో 13 మే 2023న అసెంబ్లీ జనరల్ ఎన్నికలు జరుగనున్నాయి. అన్నీ పార్టీలు ప్రచారం నిర్వహిస్తున్నాయి. కిచ్చా సుదీప్ వంటి నటులు బీజేపీకి తమ మద్దతును ప్రకటించారు.

2019లో మాండ్య పార్లమెంట్ నియోజిక వర్గం నుండి పోటీ చేసి గెలిచిన సుమలత, ప్రస్తుత ఎన్నికల్లో బీజేపీకి తన మద్దతును ప్రకటించింది. బీజేపీ తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొంది.

ఇదే క్రమంలో కన్నడ నటుడు దర్శన్ కూడా బీజేపీకి తన మద్దతు తెలపి, ప్రచారంలో కూడా పాల్గొన్నాడు. మాండ్యలో జరిగిన ఎన్నికల ప్రచారంలో దర్శన్ సుమలతతో కలిసి పాల్గొన్నాడు. దీనికి సంబంధించిన వార్తా కథనం ఇక్కడ చూడొచ్చు.

ఐతే పోస్టులో చెప్తున్నట్టు మరో కన్నడ నటుడు యష్ బీజేపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నట్టు ఎటువంటి కథనాలు లేవు. యష్ ఈ ఎన్నికల్లో బీజేపీకి మద్దతు ప్రకటించినట్టు కూడా ఎటువంటి కథనాలు లేవు. పైగా వార్తా కథనాల ప్రకారం వివిధ ప్రధాన పార్టీలకు చెందిన నేతలు ప్రచారం కోసం యష్‌ని సంప్రదించగా, యష్ ఈ అభ్యర్ధనలను తిరస్కరించినట్టు తెలుస్తుంది.

వైరల్ అవుతున్నది పాత ఫోటో:

2019లో మాండ్య పార్లమెంట్ ఎన్నికల్లో మాజీ కాంగ్రెస్ ఎంపీ అంబరీష్ భార్య సుమలత ఇండిపెండెంట్‌గా పోటీ చేసి గెలిచింది. ఐతే ఈ ఎన్నికలో బీజేపీ సుమలతుకు మద్దతు ప్రకటించింది.

అలాగే నటులు దర్శన్ మరియు యష్ కూడా సుమలతకు మద్దతు ప్రకటించడమే కాకుండా ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొన్నారు. వైరల్ ఫోటోను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా ఇదే ఫోటోను ఏప్రిల్ 2019లో ప్రచురించిన పలు వార్తా కథనాలు మాకు కనిపించాయి.

కథనాల ప్రకారం 2019లో జరిగిన మాండ్య ఎన్నికలో సుమలతకు మద్దతుగా దర్శన్ మరియు యష్ ప్రచారం పాల్గొన్నప్పుడు తీసింది. ఇదే విషయాన్ని ధృవీకరిస్తున్న మరొక వార్తా కథనం ఇక్కడ చూడొచ్చు.

చివరగా, ఈ ఫోటో 2019 మాండ్య ఎన్నికలో సుమలతకు మద్దతుగా దర్శన్ మరియు యష్ ప్రచారంలో పాల్గొన్నప్పటిది.

Share.

About Author

Comments are closed.

scroll