Fake News, Telugu
 

పాఠశాలల్లో భగవద్గీత బోధించాలంటూ తెచ్చిన ప్రైవేటు మెంబర్‌ బిల్లును కేంద్ర ప్రభుత్వ నిర్ణయం అని షేర్ చేస్తున్నారు

0

దేశవ్యాప్తంగా పాఠశాలల్లో భగవద్గీతను చదవడం తప్పనిసరి  చేయాలంటూ కేంద్రం నిర్ణయించిందని, దాని కోసం రూపొందించిన ప్రైవేటు మెంబర్‌ బిల్లును వచ్చే పార్లమెంట్‌ సమావేశాల్లో ప్రవేశ పెట్టనున్నారంటూ క్లెయిమ్ చేస్తున్న పోస్టు ఒక సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. బీజేపీ ఎంపీ రమేశ్‌ బిధూరీ ఈ బిల్లును సభ ముందుంచనున్నారని, దీనికి ఎంత మంది మద్దతిస్తారని వైరల్ పోస్టులో పేర్కొన్నారు. ఐతే ఈ కథనం ద్వారా విషయానికి సంబంధించిన  నిజమేంటో చూద్దాం.

క్లెయిమ్: దేశవ్యాప్తంగా పాఠశాలల్లో భగవద్గీతను చదవడం తప్పనిసరి  చేయాలంటూ కేంద్రం నిర్ణయించింది. దాని కోసం ప్రైవేట్ మెంబర్‌ బిల్ ప్రవేశ పెట్టనున్నారు.

ఫాక్ట్ (నిజం): ఇది పాత వార్త. దేశవ్యాప్తంగా పాఠశాలల్లో భగవద్గీతను చదవడం తప్పనిసరి చేయాలంటూ 2017లో బీజేపీ ఎంపీ రమేశ్‌ బిధూరీ పార్లమెంట్‌లో ఒక ప్రైవేటు మెంబర్‌ బిల్లును ప్రవేశపెట్టారు, ఐతే ఆ బిల్లు తర్వాత లాప్స్ అయ్యింది. రమేశ్‌ బిధూరీ తిరిగి ఆ బిల్లుని 2019లో ప్రవేశపెట్టగా, ప్రస్తుతానికి ఆ బిల్లు పెండింగ్‌లో ఉంది. ప్రైవేట్ మెంబర్‌ బిల్లుకి ప్రభుత్వానికి ఏ సంబంధం ఉండదు. అయినా, కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని షేర్ చేస్తూ తప్పుదోవ పట్టిస్తున్నారు.

ఈ బిల్లుతో కేంద్ర ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదు:

పాఠశాలల్లో భగవద్గీతను బోధించడం తప్పనిసరి చేయాలంటూ 2017లో బీజేపీ ఎంపీ రమేశ్‌ బిధూరీ లోక్‌సభలో ఒక ప్రైవేటు మెంబర్‌ బిల్లును ప్రవేశపెట్టారు. ప్రైవేటు బిల్లుతో ప్రభుత్వానికి సంబంధం ఉండదు. కాబట్టి, ఈ బిల్లుతో బీజేపీ ప్రభుత్వానికి ఎటువంటి సంబంధంలేదు, ఇది ప్రభుత్వ నిర్ణయం కాదు.

ఐతే 2017లో బీజేపీ ఎంపీ రమేశ్‌ బిధూరీ మొదటిసారి బిల్లు ప్రవేశపెట్టినా, 2019లో 16వ లోక్ సభ రద్దు కావడంతో ఆ బిల్లు లాప్స్ అయ్యింది. అయితే ఎంపీ రమేశ్‌ బిధూరీ ఇదే విషయానికి సంబంధించి 2019లో తిరిగి మళ్ళీ కొత్త బిల్లును ప్రవేశపెట్టారు, ఐతే ఈ బిల్లు ప్రస్తుతం లోక్‌సభలో పెండింగ్‌లో ఉంది. ఇదిలా ఉంటే రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో ఈ అంశంపై బిల్లు ప్రవేశ పెట్టబోతునట్టు ఎటువంటి సమాచారం లేదు. పైగా, ఈ అంశం రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్నట్టు కూడా ఎటువంటి సమాచారం లేదు. పోస్టులో షేర్ చేసింది ఒక పాత వార్త. 2017లో ఈ వార్తను ప్రచురించిన కథనాన్ని ఇక్కడ చూడొచ్చు.

ప్రైవేట్ మెంబర్ బిల్:

ప్రభుత్వ నిర్ణయాలకు సంబంధించిన బిల్లులను మంత్రులు ప్రవేశపెడుతుంటారు. మంత్రి కాకుండా సాధారణ ఎంపీలు పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన బిల్లులను ప్రైవేట్ మెంబర్ బిల్ అని అంటారు. చట్టపరంగా జోక్యం అవసరమైన పలు అంశాలను ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చేందుకు ఎంపీలు ఇలా ప్రైవేటు బిల్లులను ప్రవేశ పెడుతుంటారు. ప్రతీ శుక్రవారం పార్లమెంట్ సమావేశాల్లోని రెండో భాగంలో మాత్రమే ఈ ప్రైవేటు బిల్లులకు సంబంధించిన వ్యవహారాలను చూస్తుంటారు.

సాధారణంగా మంత్రులు ప్రవేశపెట్టే బిల్లులకు ప్రభుత్వ మద్దతు ఉంటుంది, కానీ ఈ ప్రైవేటు బిల్లులకు ప్రభుత్వ మద్దతు ఉండదు, అందుకని ఈ బిల్లులు పాస్ అవడం చాలా అరుదు. అసలు ప్రైవేటు బిల్లులపై చర్చ జరిగే సందర్భాలు కూడా చాలా తక్కువ. ఒక కథనం ప్రకారం 1952లో మొదటి లోక్ సభ ఏర్పడ్డప్పటి నుండి ఇప్పటి వరకు కేవలం 14 ప్రైవేట్ మెంబర్ బిల్లులు మాత్రమే చట్టాలుగా మారాయి. చివరిసారిగా ఒక ప్రైవేటు బిల్లు చట్టంగా మారింది 1970లో.

చివరగా, పాఠశాలల్లో భగవద్గీత బోధించాలంటూ తెచ్చిన ప్రైవేటు మెంబర్‌ బిల్లును కేంద్ర ప్రభుత్వ నిర్ణయం అని షేర్ చేస్తున్నారు

Share.

About Author

Comments are closed.

scroll