Fake News, Telugu
 

అంబేడ్కర్, నారాయణన్‌లతో పాటు చాలా మంది భారతీయులు డాక్టర్ ఆఫ్ సైన్స్ డిగ్రీని పొందారు

0

బి.ఆర్. అంబేడ్కర్ ఫోటో కలిగి ఉన్న పోస్ట్ పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీని ప్రకారం,  అంబేద్కర్ మరియు భారత మాజీ రాష్ట్రపతి కె.ఆర్. నారాయణన్, డాక్టర్ ఆఫ్ సైన్స్ అని పిలువబడే ప్రపంచంలోనే అత్యంత కఠినమైన చదువులో ఉత్తీర్ణులయ్యారని, భారతదేశానికి చెందిన వారిలో, ఈ ఇద్దరు వ్యక్తులు మాత్రమే ఇది సాధించారని ఈ పోస్టులో చెప్తున్నారు. పోస్ట్‌లో చేసిన క్లైయిమ్‌ని ఈ ఆర్టికల్ ద్వారా వెరిఫై చేద్దాం.

క్లెయిమ్: బి.ఆర్.అంబేడ్కర్, కె.ఆర్.నారాయణన్‌ డాక్టర్ ఆఫ్ సైన్స్ అని పిలువబడే ప్రపంచంలోని అత్యంత కఠినమైన చదువులో విజయవంతంగా ఉత్తీర్ణత సాధించారు. ఇలా చేసిన భారతదేశానికి చెందిన వ్యక్తులు వీరు మాత్రమే.

ఫాక్ట్(నిజం): బి.ఆర్. అంబేడ్కర్ 1923లో లండన్ యూనివర్శిటీకి సమర్పించిన థీసిస్‌కు డాక్టర్ ఆఫ్ సైన్స్ అందుకున్నారు, కె.ఆర్. నారాయణన్ 1987లో యూనివర్శిటీ ఆఫ్ టోలెడో నుండి గౌరవ డాక్టర్ ఆఫ్ సైన్స్‌ని అందుకున్నారు. వీరే కాక, అనేకమంది భారతీయ శాస్త్రవేత్తలు, విద్యావేత్తలు మరియు ఇతరులు కూడా ఈ డిగ్రీని పొందారు.  కావున,  పోస్ట్‌లో చేసిన క్లెయిమ్ తప్పుదోవ పట్టించేదిలాగ ఉంది.

డాక్టర్ ఆఫ్ సైన్స్ (D.Sc. లేదా Sc.D.) అనేది ఉన్నతమైన డాక్టరేట్ డిగ్రీ. దీనిని పోస్ట్‌డాక్టోరల్ డిగ్రీ ప్రోగ్రామ్ అని కూడా పిలుస్తారు, పరిశోధన మరియు విజ్ఞాన రంగంలో గణనీయమైన కృషి చేసిన వ్యక్తులకు దీన్ని ఇస్తారు.

ప్రసిద్ధ సైన్స్ జర్నల్స్‌లో ప్రచురించబడిన పరిశోధనల ఆధారంగా ఈ డిగ్రీని అనేక విశ్వవిద్యాలయాలు అందిస్తాయి. PhD పూర్తి చేసిన తర్వాత, ఉన్నత విద్యాసంస్థలు, పరిశోధనలలో అపారమైన అనుభవాన్ని పొందిన అభ్యర్థులకు, నిర్దిష్ట రంగాలలో విద్యావేత్తలుగా లేదా పరిశోధకులుగా శ్రేష్ఠతను సాధించిన అభ్యర్థులకు D.Sc.ని అంద చేయవచ్చు.

డాక్టర్ ఆఫ్ సైన్స్ సాధించడానికి అయ్యే సమయం చదివే విశ్వవిద్యాలయం, అధ్యయన చేసే రంగం, దేశం వంటి అనేక అంశాలపై ఆధారపడి మారవచ్చు, సాధారణంగా 6-8 సంవత్సరాలు పడుతుంది. అదనంగా, D.Sc. డిగ్రీ సాధించడానికి అవసరమైన వాటిని నెరవేర్చకుండానే, కాండిడేట్ యొక్క సంబంధిత రంగాలలో విశేషమైన విజయాలు మరియు కాంట్రిబ్యూషన్  ప్రదర్శించిన వ్యక్తులకు గౌరవ గుర్తింపుగా కూడా ఒక గౌరవనీయ డాక్టరేట్ డిగ్రీని అందించవచ్చు.

అంబేడ్కర్ జీవితం మరియు రచనలపై నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (NCERT) ప్రచురించిన ఒక నివేదిక ప్రకారం, అంబేడ్కర్ యొక్క  ‘ది ప్రాబ్లమ్ ఆఫ్ రూపీ’ అనే థీసిస్‌కు 1923లో యూనివర్సిటీ అఫ్ లండన్ ద్వారా డాక్టర్ ఆఫ్ సైన్స్ అవార్డును పొందారు.

అలాగే 1987లో కె.ఆర్. నారాయణన్‌కు USAలోని యూనివర్శిటీ ఆఫ్ టోలెడో గౌరవ డాక్టరేట్ ఆఫ్ సైన్స్ డిగ్రీని ప్రదానం చేసింది. ముందుగా చెప్పినట్లుగా, డిగ్రీ కోసం ప్రామాణిక అవసరాలను నెరవేర్చకపోయినా, వారి సంబంధిత రంగాలలో అసాధారణమైన విజయాలు మరియు గణనీయమైన కృషిని ప్రదర్శించిన వ్యక్తులకు గౌరవ డాక్టరేట్‌లు ఇవ్వబడతాయి.

మరో గమనించదగ్గ విషయం ఏమిటంటే బి.ఆర్. అంబేడ్కర్, కె.ఆర్. నారాయణన్, మాత్రమే కాకుండా, మాజీ రాష్ట్రపతి APJ అబ్దుల్ కలాం, ప్రఖ్యాత రసాయన శాస్త్రవేత్త మరియు భారతరత్న గ్రహీత C.N.R. రావు, వ్యవసాయ శాస్త్రవేత్త ఎం.ఎస్. స్వామినాథన్, మరియు వారి వారి రంగాలలో రాణించి, సమాజానికి విశేష కృషి చేసిన అనేకమందికి కూడా డాక్టర్ ఆఫ్ సైన్స్ డిగ్రీని ప్రదానం చేశారు.

ఇంకా, డాక్టర్ ఆఫ్ సైన్స్ డిగ్రీ అనేది వ్యక్తులకు వారి రీసెర్చ్ వర్క్ మరియు సంబంధిత రంగాలలో వారు చేసిన సహకారం ఆధారంగా అందించబడుతుంది, దీనికి ఉదాహరణ బి.ఆర్. అంబేడ్కర్. అయితే, ఈ డిగ్రీని గౌరవ ప్రాతిపదికన కూడా ఇస్తారు, కె.ఆర్. నారాయణన్ దీనికి ఉదాహరణ. 

ఫలానా పరీక్షా ఎంత కష్టమో అని చెప్తూ, పరీక్షల యొక్క  క్లిష్టతను ర్యాంక్ చేసే authority లేదా సంస్థ ఏది కూడా లేదని మీరు ఇక్కడ గమనించడం ముఖ్యం. డాక్టర్ ఆఫ్ సైన్స్ విషయానికి వస్తే, ఈ డిగ్రీకి సంబంధించి నిర్దిష్ట పరీక్ష ఏదీ లేనందున అటువంటి ర్యాంకింగ్‌లు వర్తించవు.

చివరిగా, బి.ఆర్. అంబేడ్కర్, కె.ఆర్. నారాయణన్, వీరిద్దరే కాక, అనేక మంది భారతీయులు డాక్టర్ ఆఫ్ సైన్స్ డిగ్రీని పొందారు.

Share.

About Author

Comments are closed.

scroll