Fake News, Telugu
 

‘65 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్‌లను ప్రభుత్వం పట్టించుకోనందున వారిని చంపండి’ అని జయా బచ్చన్ రాజ్యసభలో అనలేదు

0

రాజ్యసభ ఎంపీ జయా బచ్చన్ సీనియర్ సిటిజన్‌ల గురించి ప్రసంగిస్తూ, ‘65 ఏళ్లు పైబడిన  సీనియర్ సిటిజన్‌లను ప్రభుత్వం పట్టించుకోనందున వారిని చంపండి’ అని పేర్కొన్నట్లు రాస్తూ ఒక పోస్టును సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఇంకా, ఈ ప్రసంగంలో సీనియర్ సిటిజన్ల సంక్షేమం కోసం కొన్ని ప్రత్యేకాధికారాలను ఆమె డిమాండ్ చేశారు. దీని వెనుక ఉన్న నిజమెంటో ఈ కథనం ద్వారా తెలుసుకుందాం.

ఇదే పోస్టును ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: రాజ్యసభ ఎంపీ జయా బచ్చన్ సీనియర్ సిటిజన్‌ల గురించి ప్రసంగిస్తూ, ‘65 ఏళ్ల తర్వాత సీనియర్ సిటిజన్‌లను ప్రభుత్వం పట్టించుకోనందున వారిని చంపండి’ అని పేర్కొన్నారు.

ఫాక్ట్(నిజం): జయా బచ్చన్ 8 ఫిబ్రవరి 2023న రాజ్యసభలో సీనియర్ సిటిజన్ల గురించి  ప్రసంగిస్తూ, భారతదేశంలో 60 ఏళ్లు పైబడిన వారు 2031 నాటికి 41%కి చేరుకుంటారు అని తెలిపారు. సీనియర్ సిటిజన్‌లకు గౌరవప్రదమైన జీవితం కోసం నిబంధనలు, కార్యాచరణ ప్రణాళిక గురించి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అంతేకాకుండా, ఇతర దేశాలు వృద్ధులకు మరియు వికలాంగులకు సామాజిక భద్రతను అందిస్తాయి, అయితే భారతదేశంలో అలాంటి సదుపాయం లేదు అని తెలిపారు. ‘65 ఏళ్లు పైబడిన  సీనియర్ సిటిజన్‌లను ప్రభుత్వం పట్టించుకోనందున వారిని చంపండి’ అని జయా బచ్చన్ అన్నట్టు ఎక్కడా ఆధారాలు లేవు. కావున, పోస్టులో చేసిన క్లెయిమ్ తప్పు.

ఈ క్లెయిమ్ గురించి తగిన కీ వర్డ్స్ ఉపయోగిస్తూ ఇంటర్నెట్లో వెతికితే, మేము వార్తా నివేదికలు, జయా బచ్చన్ అసలు ప్రసంగాన్ని (ఇక్కడ మరియు ఇక్కడ) కనుగొన్నాము. 8 ఫిబ్రవరి 2023న రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం సందర్భంగా జయా బచ్చన్ తన ప్రసంగంలో సీనియర్ సిటిజన్ల సమస్యలను లేవనెత్తారు. ఆమె పార్లమెంటులో మాట్లాడిన నాలుగు అంశాలలో సీనియర్ సిటిజన్ల సమస్య ఒకటి. అయితే, ఎంపీ తన ప్రసంగంలో, వైరల్ పోస్ట్‌లో చేసిన ప్రకటనలు మాకు కనిపించలేదు.

జయా బచ్చన్ మాట్లాడుతూ, భారతదేశంలో 60 ఏళ్లు పైబడిన వారు 2031 నాటికి 41%కి చేరుకుంటారు అని తెలిపింది. సీనియర్ సిటిజన్‌లకు గౌరవప్రదమైన జీవితం కోసం నిబంధనలు, కార్యాచరణ ప్రణాళిక గురించి ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అంతేకాకుండా, ఇతర దేశాలు వృద్ధులకు, వికలాంగులకు సామాజిక భద్రతను అందిస్తాయని, అయితే భారతదేశంలో అలాంటి సదుపాయం లేదు అని తెలిపారు.

ఆమె మహిళల సంక్షేమం, సమాజంలో వారి గౌరవం గురించి మరియు రాష్ట్రపతి ప్రసంగంలో నిర్భయ ఫండ్ గురించి ప్రస్తావించకపోవడం గురించి కూడా మాట్లాడారు. ఇంకా, ఆమె పారిశుధ్య కార్మికుల దుస్థితి గురించి, కళాత్మక సంఘం పట్ల ప్రభుత్వం చూపుతున్న నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపింది. కుల ఆధారిత జనాభా గణనను నిర్వహించాలనే డిమాండ్‌తో తన ప్రసంగాన్ని ముగించింది.

చివరిగా, ‘65 ఏళ్లు పైబడిన  సీనియర్ సిటిజన్‌లను ప్రభుత్వం పట్టించుకోనందున వారిని చంపండి’ అని జయా బచ్చన్ అనలేదు.

Share.

About Author

Comments are closed.

scroll