తెలంగాణ ప్రభుత్వం లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళని నిర్మించి ఇస్తామని చెప్పి ఒక్కటి కూడా ఇవ్వలేదని చెపుతున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.
క్లెయిమ్: తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ లో లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళని నిర్మించి ఇస్తామని చెప్పి ఒక్కటి కూడా ఇవ్వలేదు.
ఫాక్ట్(నిజం): 26 అక్టోబర్ 2020న హైదరాబాద్ లోని గోషామహల్ నియోజికవర్గం పరిధిలోని ‘గోడే కి కబర్’ లో 192 మరియు ‘కట్టల మండి’ లో 120 డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళను మంత్రి KTR ప్రారంభించి ఈ ఇళ్ళని లబ్ధిదారులకు అందించారు. 2019లో హైదరాబాద్ లోని చిత్తరమ్మ నగర్ లో నిర్మించిన డబల్ బెడ్ రూమ్ ఇళ్ళని KTR ప్రారంభించి ఈ ఇళ్ళని లబ్ధిదారులకు అందించారు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.
తెలంగాణ లోని డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ పధకం గురించి మరింత సమాచారం కోసం గూగుల్ లో వెతకగా హైదరాబాద్ లో ఈ ఇళ్ళ ప్రారంభోత్సవానికి సంబంధించి 26 అక్టోబర్ 2020న మంత్రి KTR కొన్ని ఫోటోలు షేర్ చేసిన ట్వీట్ మాకు కనిపించింది. ఈ ట్వీట్ ప్రకారం హైదరాబాద్ లోని గోషామహల్ నియోజికవర్గం పరిధిలోని ‘గోడే కి కబర్’ లో 192 మరియు ‘కట్టల మండి’ లో 120 డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళను KTR ప్రారంభించి ఈ ఇళ్ళని లబ్ధిదారులకు అందించారు.
గూగుల్ సెర్చ్ ద్వారా హైదరాబాద్ లోని చిత్తరమ్మ నగర్ లో నిర్మించిన డబల్ బెడ్ రూమ్ ఇళ్ళకి సంబంధించి 2019లో జరిగిన ప్రారంభోత్సవానికి సంబంధించిన న్యూస్ వీడియో కూడా లభించింది. ఈ రిపోర్ట్ ప్రకారం ఈ ఇళ్ళలో కి లబ్దిదారులు గృహప్రవేశం కూడా చేసారు. హైదరాబాద్ లో ఎంత మంది లబ్దిదారులకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు అందించారో కచ్చితమైన సమాచారం తెలియనప్పటికీ పైన వివరించిన ఆధారాల ప్రకారం కొందరికి మాత్రం డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు అందించారని కచ్చితంగా చెప్పొచ్చు. ఐతే ఈ ఏడాది డిసెంబర్ కల్లా 85,000 డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు లబ్దిదారులకు అందిస్తామని KTR మీడియాతో తెలిపిన వార్తా కథనం ఇక్కడ చూడొచ్చు.
డిసెంబర్ 1న జరగనున్న GHMC ఎన్నికల నేపధ్యంలో ఇలాంటి తప్పుదోవ పట్టించే పోస్టులు సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ చేస్తున్నారు.
చివరగా, హైదరాబాద్ లో అసలు ఒక్క డబల్ బెడ్ రూమ్ ఇంటిని కూడా కట్టించి ఇవ్వలేదన్న వాదనలో నిజం లేదు.