Fake News, Telugu
 

వైసీపీ నాయకుడు అంబటి రాంబాబు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మోసగాడు అని విమర్శించినట్లుగా ఎడిట్ చేసిన వీడియోను షేర్ చేస్తున్నారు

0

ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ పై విమర్శలు చేశాడంటూ ఒక వీడియో సోషల్ మీడియాలో షేర్ అవుతోంది. వీడియోలో ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖ మంత్రి “ఇచ్చిన ప్రతి మాటను తుంగలోకి తొక్కి ప్రజలను మోసం చేసిన మోసగాడు జగన్మోహన్ రెడ్డి గారు” అని  మాట్లాడుతుండడం చూడొచ్చు. ఈ కథనం ద్వారా ఆ వీడియోకు సంబంధించి నిజేమెంటో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖా మంత్రి అంబటి రాంబాబు ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ ప్రజలను మోసం చేసిన మోసగాడు జగన్మోహన్ రెడ్డి అని విమర్శించిన దృశ్యాలు.

ఫాక్ట్(నిజం): ఈ వైరల్ వీడియో ఎడిట్ చేసినది. 10 మార్చి 2024న బాపట్ల జిల్లా, మేదరమెట్ల వద్ద జరిగిన వైసీపీ బహిరంగ సభలో ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖా మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ “ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకున్నా మొనగాడు జగన్మోహన్ రెడ్డి గారు, 14 సంవత్సరాలు ఇచ్చిన ప్రతి మాటను తుంగలోకి తొక్కి ప్రజలను మోసం చేసిన మోసగాడు చంద్రబాబు నాయుడు, మొనగాడు కావాలా, మోసగాడు కావాలా” అని అన్నారు. ఐతే ఈ వీడియోను డిజిటల్‌గా ఎడిట్ చేసి రాంబాబు జగన్మోహన్ రెడ్డిని మోసగాడు అన్నట్లు చిత్రీకరించారు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

ఈ వైరల్ వీడియోకి సంబంధించిన  మరింత సమాచారం కోసం పోస్టులో షేర్ చేసిన వీడియో యొక్క స్క్రీన్ షాట్లని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతికితే, ఇవే దృశ్యాలు కలిగిన పూర్తి నిడివి గల వీడియోని 10 మార్చి 2024న సాక్షి టీవీ (Sakshi TV live) తమ యూట్యూబ్ ఛానల్ లో “AP CM YS Jagan Public Meeting at Medarametla | Siddham Sabha | Bapatla District” అనే శీర్షికతో పబ్లిష్ చేసినట్టు తెలిసింది.

ఈ వీడియోని పూర్తిగా పరిశీలిస్తే, వైరల్ వీడియో క్లిప్పింగ్ లోని దృశ్యాలు  టైంస్టాంప్ 49.30 వద్ద మొదలై, టైంస్టాంప్ 50.26 వద్ద ముగుస్తుంది అని తెలిసింది. వాస్తవంగా, అంబటి రాంబాబు ఈ బహిరంగ సభలో మాట్లాడుతూ “ఇవాళ రాష్ట్రంలో తెల్చుకోవలిసింది ఒకే ఒక అంశం. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు  కావాలా? లేక 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి ఈ ఆంధ్ర ప్రజానీకాన్ని మోసం చేసిన చంద్రబాబు నాయుడు కావాలా అని తెల్చుకోవలిసిన సమయం ఆసన్నం అయిందని మనవి చేస్తున్న, ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకున్న మొనగాడు జగన్మోహన్ రెడ్డి గారు, 14 సంవత్సరాలు ఇచ్చిన ప్రతి మాటను తుంగలోకి తొక్కి ప్రజలను మోసం చేసిన మోసగాడు చంద్రబాబు నాయుడు, మొనగాడు కావాలా, మోసగాడు కావాలా, తేల్చుకోవలిసిన అటువంటి పరిస్థితి ఇవాళ ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి వచ్చింది త్వరలో అని నేను మనవి చేస్తున్న” అని అన్నారు. దీన్ని బట్టి అసలైన వీడియోను ఎడిట్ చేస్తూ అంబటి రాంబాబు ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మోసగాడని అన్నారు అని అర్ధం వచ్చేలా వైరల్ వీడియోని రూపొందించారు అని నిర్ధారించవచ్చు. వాస్తవంగా, అంబటి రాంబాబు చంద్రబాబు నాయుడుని మోసగాడు అని విమర్శించారు.

చివరగా, అంబటి రాంబాబు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మోసగాడు అని విమర్శించాడు అంటూ ఎడిట్ చేసిన వీడియోను షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll