శ్రీలంక ప్రభుత్వం వారి దేశంలో ఇస్లాం ని నిషేధించాలని నిర్ణయించిందంటూ చాలా మంది ఫేస్బుక్ వినియోగదారులు పోస్ట్ చేస్తున్నారు. ఇందులో ఎంతవరకు నిజముందో ఓసారి విశ్లేషిద్దాం.

క్లెయిమ్ (దావా): శ్రీలంక ప్రభుత్వం వారి దేశంలో ఇస్లాం మతాన్ని నిషేధించాలని నిర్ణయించింది.
ఫాక్ట్ (నిజం): ఈస్టర్ రోజు జరిగిన బాంబు పేలుళ్ల తరువాత శ్రీలంక ప్రభుత్వం అక్కడి ప్రజలపై కొన్ని ఆంక్షలు విధించింది కానీ ఇస్లాంను నిషేధించాలని నిర్ణయించలేదు. కావున, పేర్కొన్న విషయాలు అవాస్తవాలు.
శ్రీలంక ప్రభుత్వం ఈస్టర్ రోజు దాడుల నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అక్కడి ప్రజల మీద కొన్ని ఆంక్షలు విధించింది. దాడులు జరిగిన అనంతరం, శ్రీలంక ప్రభుత్వం ఆ దేశ భద్రతా దళాలాలూ గుర్తించడానికి ఆటంకం కలగకుండా తమ ప్రజలు ఎవరు కూడా ముఖాలను వస్త్రాలతో కప్పుకోకూడదు అంటూ ఒక నిబంధన విధించింది. ఈ ఆంక్ష ఏ ఒక్క మతాన్ని లక్ష్యంగా చేసుకుని విధించింది కాదు.

అలానే శ్రీలంక ప్రభుత్వం ఇటీవలే మరో చర్య చేపట్టింది. అది ఏమిటంటే, చట్టబద్ధంగా దేశంలోకి ప్రవేశించి వీసా గడువు ముగిసినా అక్రమంగా ఉంటున్న 600 మంది విదేశీయులను తిరిగి పంపించింది. ఇందులో 200 మంది ఇస్లామిక్ మత బోధకులు కూడా ఉన్నారు. అంతే కానీ, ఇస్లాం మొత్తాన్ని శ్రీలంక ప్రభుత్వం నిషేదించలేదు.

చివరగా, ఈస్టర్ రోజు బాంబు పేలుళ్ల తరువాత శ్రీలంక ప్రభుత్వం వాళ్ళ పౌరులపై కొన్ని ఆంక్షలు విధించింది. కానీ ఇస్లాంను నిషేధించాలని నిర్ణయించలేదు.