Fake News, Telugu
 

2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తూర్పు గోదావరి జిల్లాలోని అన్ని నియోజికవర్గాల్లో వైసీపీ గెలుస్తుందని భారీగా బెట్టింగ్‌లు జరుగుతున్నాయని చెప్తూ ‘Way2News’ కథనం ప్రచురించలేదు

0

“2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తూర్పు గోదావరి జిల్లాలోని అన్ని నియోజికవర్గాల్లో వైసీపీ గెలుస్తుందని భారీగా బెట్టింగ్‌లు సాగుతున్నాయి, టీడీపీ గెలిచే అవకాశం లేదని, అందుకే ఎవరు టీడీపీపై బెట్టింగ్ వేయడం లేదని స్థానికులు చెప్పారు” అని ‘Way2News’ పబ్లిష్ చేసిన కథనమంటూ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది (ఇక్కడ, ఇక్కడ & ఇక్కడ). ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: “2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తూర్పు గోదావరి జిల్లాలోని అన్ని నియోజికవర్గాల్లో వైసీపీ గెలుస్తుందని భారీగా బెట్టింగ్‌లు సాగుతున్నాయి” -‘Way2News’ పబ్లిష్ చేసిన వార్త కథనం.

ఫాక్ట్(నిజం): ఈ వార్తను ‘Way2News’ ప్రచురించలేదు. ఇది వారి లోగోను వాడి తప్పుడు కథనంతో ఎడిట్ చేస్తూ షేర్ చేసిన ఫోటో. ఇదే విషయాన్ని‘Way2News’ సంస్థ X పోస్టు ద్వారా స్పష్టం చేసింది. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలపై భారీగా బెట్టింగ్‌లు జరుగుతున్నట్లు పలు రిపోర్ట్స్ ఉన్నాయి.(ఇక్కడ, ఇక్కడ & ఇక్కడ)

అయితే, ఈ వార్తను ‘Way2News’ ప్రచురించలేదని తెలిసింది. ఈ వార్త కథనం పైన ఉన్న ఆర్టికల్ లింక్ (https://way2.co/g5gze2) ద్వారా ‘Way2News’లో వెతికితే ఈ సంస్థ 29 ఏప్రిల్ 2024న “పుస్తకాలపై జగన్ ఫొటో ఎందుకు?: పవన్ కళ్యాణ్” అనే టైటిల్‌తో ప్రచురించిన అసలైన వార్త దొరికింది. దీన్ని బట్టి అసలైన ‘Way2News’ కథనాన్ని ఎడిట్ చేస్తూ పోస్టులో షేర్ చేసిన ఫోటోను రూపొందించారు అని నిర్థారించవచ్చు.

అంతేకాకుండా, ఈ వార్త వైరల్ అవడంతో, 03 మే 2024న Way2News సంస్థ X(ట్విట్టర్) పోస్ట్ ద్వారా స్పందిస్తూ “మా లోగోను ఉపయోగించి కొందరు తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్నారని మా దృష్టికి వచ్చింది మరియు ‘అటాచ్ చేసిన పోస్ట్’ వైరల్‌గా మారింది” అంటూ ఈ వార్త కథనం ఫేక్ అని స్పష్టత ఇచ్చారు.

చివరగా, 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తూర్పు గోదావరి జిల్లాలోని అన్ని నియోజికవర్గాల్లో వైసీపీ గెలుస్తుందని భారీగా బెట్టింగ్‌లు జరుగుతున్నాయని చెప్తూ ‘Way2News’ కథనం ప్రచురించలేదు.

Share.

About Author

Comments are closed.

scroll