ఇటీవల, 24 మే 2025న ముంబై, విశాఖపట్నం మధ్య నడిచే ఎల్టీటీ ఎక్స్ప్రెస్ (18620)లో బాంబు ఉన్నట్టు ఓ అజ్ఞాత వ్యక్తి నుంచి ఫోన్ కాల్ రాగా, రైలు విశాఖపట్నం చేరిన వెంటనే, పోలీసులు క్షుణ్ణంగా తనిఖీ చేసి బాంబు లేదని నిర్థారించారు (ఇక్కడ & ఇక్కడ). ఈ నేపథ్యంలో “విశాఖపట్నం నగర పరిధిలో అనుమానాస్పద వ్యక్తులు సంచరిస్తున్నందున అత్యవసర పరిస్థితుల్లో తప్ప 3-4 రోజులు ఇళ్ల నుండి బయటకు రావద్దని విశాఖపట్నం నగర పోలీసులు ప్రజలకు నోటీసు జారీ చేశారు. అలాగే, సినిమా థియేటర్లు, రైతు బజార్లు, ఆర్.కె. బీచ్, ఉడా చిల్డ్రన్స్ థియేటర్, షాపింగ్ మాల్స్, జగదాంబ, కోట వీధి, పూర్ణ మార్కెట్ మరియు రైల్వే స్టేషన్ వంటి రద్దీ ప్రదేశాలలో సాధారణ పౌరుల సంచారాన్ని నిషేధించారు” అని చెప్తూ ఉన్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: విశాఖపట్నం నగర పరిధిలో అనుమానాస్పద వ్యక్తులు సంచరిస్తున్నందున అత్యవసర పరిస్థితుల్లో తప్ప 3-4 రోజులు ప్రజలు తమ ఇళ్ల నుండి బయటకు రావొద్దని విశాఖపట్నం నగర పోలీసులు నోటీసు జారీ చేశారు మరియు రద్దీగా ఉండే ప్రదేశాలలో సాధారణ పౌరుల సంచారాన్ని నిషేధించారు.
ఫాక్ట్(నిజం): ఈ వైరల్ వార్తలో ఎటువంటి నిజం లేదు. విశాఖపట్నం నగర పోలీసులు మా (Factly)తో మాట్లాడుతూ, వారు ఇలాంటి హెచ్చరికలు ఏమీ జారీ చేయలేదని, ఈ పోస్టులు ఫేక్ అని వారు స్పష్టం చేశారు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.
ముందుగా ఈ వైరల్ పోస్టులో పేర్కొన్నట్లుగా ఇటీవల మే 2025లో విశాఖపట్నం నగర పోలీసులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొంటూ ఏదైనా హెచ్చరిక నోటీసు జారీ చేశారా? అని తగిన కీవర్డ్స్ ఉపయోగిస్తూ ఇంటర్నెట్లో వెతికగా, ఇలాంటి నోటీసును విశాఖపట్నం పోలీసులు జారీ చేసినట్లు ఎటువంటి విశ్వసనీయ రిపోర్ట్స్ లభించలేదు. ఒకవేళ ఇలాంటి హెచ్చరిక నోటీసును విశాఖపట్నం పోలీసులు జారీ చేసి ఉంటే, ఖచ్చితంగా పలు మీడియా సంస్థలు రిపోర్ట్ చేసి ఉండేవి.
అలాగే, మేము విశాఖపట్నం నగర పోలీసు శాఖ అధికారిక వెబ్సైట్ను, వారి అధికారిక సోషల్ మీడియా ఖాతాలను (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ) కూడా పరిశీలించాము. అయితే, అక్కడ వైరల్ క్లెయిమ్ను సమర్థించే ఎటువంటి సమాచారం నాకు లభించలేదు.
తదుపరి, మేము ఇదే విషయమై విశాఖపట్నం నగర పోలీసు శాఖ వర్గాలను సంప్రదించగా, వారు ఇలాంటి హెచ్చరికలు ఏమీ జారీ చేయలేదని ఈ పోస్టులు ఫేక్ అని స్పష్టం చేశారు.

చివరగా, విశాఖపట్నం నగర పోలీసులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎటువంటి హెచ్చరిక నోటీసు జారీ చేయలేదు.