Fake News, Telugu
 

ఢిల్లీలో కొందరు యువకుల్ని జనాలు కొడుతున్న వీడియోని ఘజియాబాద్ లో జరిగిన ఘటనకి ముడిపెడుతూ షేర్ చేస్తున్నారు

0

కొందరు యువకులపై ఒక గుంపు దాడి చేస్తున్న వీడియోని ఇటీవల ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ లో ఒక ముస్లిం ముసలాయనని కొంత మంది యువకులు కొట్టిన సంఘటనకి ముడిపెడ్తున్నారు. ఆ సంఘటనలో ముసలాయన గడ్డం కట్ చేసిన నిందుతుల ఇళ్ళల్లోకి చొరబడి వారిని చితక బాదిన హిందూ, ముస్లిం సోదరులంటూ అని చెప్తున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతుంది. ఈ కథనం ద్వారా ఆ వార్తలో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: ఘజియాబాద్ సంఘటన నిందుతులపై హిందువులు, ముస్లిములు దాడి చేసిన వీడియో.

ఫాక్ట్ (నిజం): ఈ వీడియో ఢిల్లీలోని జహంగీర్పురిలో కూరగాయలు అమ్ముకునే ఒక వ్యక్తి ఇంట్లో దోపిడీకి (మామూళ్లు వసూలుకి) వచ్చిన ముగ్గురు యువకుల్ని అక్కడి ప్రజలు పట్టుకొని కొట్టిన ఘటనకు సంబంధించింది, ఇదే విషయాన్ని చాలా వార్తా సంస్థలు కూడా రిపోర్ట్ చేసాయి. ఈ వీడియోకి ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ లో జరిగిన సంఘటనకి ఎటువంటి సంబంధంలేదు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

ఈ వీడియో ఢిల్లీలోని జహంగీర్పురిలో జరిగిన సంఘటనకు సంబంధించింది. ఈ వీడియోకి సంబంధించి మరింత సమాచారం కోసం గూగుల్ లో కీవర్డ్ సెర్చ్ చేయగా ఈ వీడియోని రిపోర్ట్ చేసిన చాలా వార్తా కథనాలు మాకు కనిపించాయి. NDTV ప్రచురించిన కథనం ప్రకారం ఢిల్లీ లోని జహంగీర్పురిలో కూరగాయలు అమ్ముకునే ఒక వ్యక్తి ఇంట్లో దోపిడీకి (మామూళ్ల వసూలు) వచ్చిన ముగ్గురు యువకుల్ని అక్కడి ప్రజలు పట్టుకొని కొట్టారు, ఈ వీడియో ఆ ఘటనకు సంబంధించింది.

ఆ ముగ్గురు యువకుల్ని పోలీసులు అరెస్ట్ చేసి వారిపై FIR కూడా నమోదు చేసారు. TV9 భారత్ వర్ష్, రిపబ్లిక్ భారత్ కూడా ఈ వీడియోకి సంబంధించిన ప్రచురించిన కథనాలలో ఈ ఘటన ఢిల్లీలోని జహంగీర్పురిలో జరిగిందంటూ పైన తెలిపిన విషయాన్నే పేర్కొంది. వీటన్నిటి బట్టి, ఈ వీడియోకి ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ లో జరిగిన ఘటనకి ఎటువంటి సంబంధంలేదని కచ్చితంగా చెప్పొచ్చు.

చివరగా, ఢిల్లీలో కొందరు యువకుల్ని జనాలు కొడుతున్న వీడియోని ఘజియాబాద్ లో జరిగిన ఘటనకి ముడిపెడుతూ షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll