Fake News, Telugu
 

ఆంధ్రప్రదేశ్ మంత్రి జోగి రమేష్ జగన్/వైసీపీను ఉద్దేశించి విమర్శలు చేశాడంటూ షేర్ చేస్తున్న ఈ వీడియో డిజిటల్‌గా ఎడిట్ చేసింది

0

త్వరలో ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌, వైసీపీ పార్టీపై రాష్ట్ర మంత్రి జోగి రమేష్ విమర్శలు చేశాడంటూ ఒక వీడియో సోషల్ మీడియాలో షేర్ అవుతోంది. వీడియోలలో ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ మాట్లాడుతూ “జగన్ మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక మాట మీద నిలబడలేడు అని చెప్పేసి డే వన్ (మొదటి రోజు) నుండి చెప్తా ఉన్నాం. జగన్ మోహన్ రెడ్డి రాజకీయాలకు పనికిరాడు. వైఎసార్సీపి పార్టీ ఒక విలువలు లేని, సిద్ధాంతాలు లేని విశ్వసనీయత లేని పార్టీ” మాట్లాడుతుండడం చూడొచ్చు. ఈ కథనం ద్వారా ఆ వీడియోకు సంబంధించి నిజేమెంటో చూద్దాం.

క్లెయిమ్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌ మరియు వైసీపీ పార్టీపై రాష్ట్ర మంత్రి జోగి రమేష్ విమర్శలు చేస్తున్న దృశ్యాలు.

ఫాక్ట్(నిజం): మంత్రి జోగి రమేష్ సాక్షి టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్‌ మరియు జనసేన పార్టీను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేసాడు. ఐతే ఈ వీడియోను డిజిటల్‌గా ఎడిట్ చేసి రమేష్ ఈ వ్యాఖ్యలు జగన్/వైసీపీను ఉద్దేశించి చేసినట్టు చిత్రీకరించారు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

వీడియోలలో ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ సాక్షి టీవీతో మాట్లాడుతుండడం గమనించొచ్చు. దీని ఆధారంగా యూట్యూబ్‌లో వెతకగా జోగి రమేష్ సాక్షి టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూ యొక్క పూర్తి వీడియో మాకు కనిపించింది.

ఈ ఇంటర్వ్యూలో రాబోయే ఎన్నికలలో తెలుగుదేశం మరియు జనసేన పార్టీల పొత్తు గురించి, వారు విడుదల చేసిన అభ్యర్థుల మొదటి జాబితా గురించి రమేష్ మాట్లాడాడు. ఐతే ఈ ఇంటర్వ్యూలో పలు సందర్భాలలో పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి “పవన్ కళ్యాణ్ మొదటి రోజు నుంచి ఒక్క మాట మీద కుడా నిలబడలేదని”, “పవన్ కళ్యాణ్ రాజకీయాలకు పనికిరాడు”, “పవన్ కళ్యాణ్ ఒక విలువలు, నిజాయితీ మరియు సిద్ధాంతాలు లేని వ్యక్తి అని, అలాంటిదే జనసేన పార్టీ” అని వ్యాఖ్యానించాడు.

ఐతే ఈ ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ మరియు జనసేన గురించి చేసిన వ్యాఖ్యలను డిజిటల్‌గా ఎడిట్ చేసి రమేష్ ఈ వ్యాఖ్యలు జగన్ మరియు వైసీపీను ఉద్దేశించి చేసినట్టు చిత్రీకరించారు. ఈ ఇంటర్వ్యూలో ఎక్కడ కూడా జగన్/వైసీపీను ఉద్దేశించి విమర్శలు చేయలేదు. కాబట్టి పోస్టులో చేస్తున్న వాదన కరెక్ట్ కాదని స్పష్టమవుతుంది.

చివరగా, ఆంధ్రప్రదేశ్ మంత్రి జోగి రమేష్ జగన్/వైసీపీను ఉద్దేశించి విమర్శలు చేశాడంటూ షేర్ చేస్తున్న ఈ వీడియో డిజిటల్‌గా ఎడిట్ చేసింది.

Share.

About Author

Comments are closed.

scroll