Fake News, Telugu
 

భారతదేశంలో నివసిస్తున్న ముస్లింలు ‘చట్టబద్ధంగా’భారత పౌరులు కాదు అనే వాదనలో నిజం లేదు

0

“భారతదేశంలో నివసిస్తున్న ముస్లింలు “చట్టబద్ధంగా” భారత పౌరులు కాదు, 1947 ఆగస్టు 15న అర్ధరాత్రి 12 గంటలకు దేశ స్వాతంత్ర్యం మరియు విభజన ప్రకటించబడిన వెంటనే, భారతదేశంలో నివసిస్తున్న ముస్లింలందరూ పాకిస్తాన్ పౌరులుగా మారారు, భారతదేశంలో నివసిస్తున్న ముస్లింలకు భారత పౌరసత్వం ఇచ్చేలా నెహ్రూ 08 ఏప్రిల్ 1950 న పాక్ ప్రధాని లియాఖత్ అలీతో “నెహ్రూ లియాఖత్ అలీ ఖాన్ ఒప్పందం” చేసుకున్నారు , అంటే 08-04-1950 వరకు ముస్లింలు భారత పౌరులు కాదని స్పష్టమవుతుంది, అలాగే ఈ ఒప్పందం తర్వాత ముస్లింలకు భారత ప్రభుత్వం అధికారికంగా పౌరసత్వం మంజూరు చేసినట్లుగానీ లేదా ఏదైనా ఆర్డినెన్స్ ద్వారా ముస్లింలకు సామూహిక పౌరసత్వం/వ్యక్తిగతంగా పౌరసత్వం మంజూరు చేసినట్లు గానీ ఎటువంటి చారిత్రక రికార్డు లేదా రుజువు లేదు” అని చెప్తూ ఉన్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: భారతదేశంలో నివసిస్తున్న ముస్లింలు ‘చట్టబద్ధంగా’ భారత పౌరులు కాదు.

ఫాక్ట్(నిజం): భారతదేశంలో నివసిస్తున్న ముస్లింలు ‘చట్టబద్ధంగా’భారత పౌరులు కాదు అనే వాదనలో నిజం లేదు. భారత పౌరసత్వ చట్టాలు లేదా భారత రాజ్యాంగం ముస్లింలు భారత పౌరులు కాదని, కొన్ని మతాలకు మాత్రమే భారత పౌరసత్వం అర్హత ఉందని ఎక్కడా పేర్కొనలేదు. అలాగే 15 ఆగస్టు 1947న భారత దేశ స్వాతంత్ర్యం, దేశ విభజన ప్రకటించబడిన తరవాత భారతదేశంలో నివసిస్తున్న కొన్ని వర్గాల ప్రజలు మాత్రమే భారత పౌరసత్వానికి అర్హులని భారత పౌరసత్వ చట్టాలు లేదా భారత రాజ్యాంగం పేర్కొనలేదు. అలాగే 10, 11, 12 ఆగస్టు 1949 తేదీలలో భారత రాజ్యాంగ సభలో జరిగిన భారత పౌరసత్వానికి సంబంధించి చర్చలలో కూడా ఎక్కడ ముస్లింలకు భారత పౌరసత్వం ఇవ్వకూడదనే చర్చ జరగలేదు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

భారత రాజ్యాంగంలోని 2వ భాగంలో ఉన్న ఆర్టికల్ 5 నుంచి ఆర్టికల్ 11 వరకు పౌరసత్వం గురించి వివరిస్తాయి. భారత రాజ్యాంగం యొక్క తెలుగు వెర్షన్ ఇక్కడ, ఇంగ్లీష్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

ఆర్టికల్ 5 :

  • 26 జనవరి 1950 లోపు భారతదేశంలో జన్మించి, శాశ్వత స్థిర నివాసం ఏర్పరచుకున్న ప్రతి ఒక్కరికీ భారతీయ పౌరసత్వం లభిస్తుంది.
  • 26 జనవరి 1950 లోపు ఒక వ్యక్తి విదేశాల్లో జన్మించినప్పటికీ, అతడి తల్లి/తండ్రి ఆ సమయానికి భారతీయ పౌరసత్వం కలిగి ఉంటే ఆ వ్యక్తికి కూడా భారతీయ పౌరసత్వం లభిస్తుంది.
  • 26 జనవరి 1950 లోపు ఒక వ్యక్తి భారతదేశంలో 5 సంవత్సరాలు శాశ్వత స్థిరనివాసం కలిగి ఉంటే ఆ వ్యక్తికి భారతీయ పౌరసత్వం లభిస్తుంది.

ఆర్టికల్ 6 :

  • పాకిస్థాన్ నుంచి భారతదేశానికి వలస వచ్చినవారి పౌరసత్వాన్ని గురించి తెలియజేస్తుంది.
  • 19 జులై 1948 కంటే ముందు పాకిస్థాన్ నుంచి భారతదేశానికి వచ్చి స్థిర నివాసాన్ని ఏర్పరుచుకున్నవారంతా భారతీయ పౌరసత్వానికి అర్హులు.
  • 19 జూలై 1948 తర్వాత పాకిస్థాన్ నుంచి భారతదేశానికి వలస వచ్చి, వారు దరఖాస్తు చేసుకునే నాటికి కనీసం భారతదేశంలో ఆరు నెలల నివాసం ఉండటంతో సహా పలు అదనపు అర్హతలు కలిగిన వారు భారతీయ పౌరసత్వానికి అర్హులు.

ఆర్టికల్ 7 :

  • 01 మార్చి 1947 తర్వాత భారతదేశం నుంచి పాకిస్తాన్‌కు వలస వెళ్లి అక్కడ స్థిరపడలేక తిరగి 19 జులై 1948, నాటికి భారతదేశానికి వలస వచ్చినవారి పౌరసత్వానికి అర్హులు.

ఆర్టికల్ 8 :

  • విదేశాల్లో నివసించే భారత సంతతి ప్రజలకు భారత పౌరసత్వాన్ని ఇవ్వడం గురించి ప్రస్తావిస్తుంది.

ఆర్టికల్ 9 :

  • భారత పౌరులు ఎవరైనా విదేశీ పౌరసత్వాన్ని స్వీకరించినప్పుడు సహజంగానే భారత పౌరసత్వాన్ని కోల్పోతారు.

ఆర్టికల్ 10 :

  • భారతీయ పౌరసత్వం శాశ్వతత్వాన్ని కలిగి ఉంటుంది.

ఆర్టికల్ 11 :

  • భారత రాజ్యాంగంలో పౌరసత్వానికి సంబంధించిన సమగ్రమైన నియమాలు లేవు. పౌరసత్వానికి సంబంధించిన చట్టాలను రూపొందించే అత్యున్నత అధికారం పార్లమెంటుకు ఉంది.

అలాగే భారతదేశంలో పౌరసత్వ విషయాలను నియంత్రించడానికి భారత పార్లమెంటు పౌరసత్వ చట్టం, 1955ను రూపొందించింది. ఈ చట్టం అమలులోకి వచ్చినప్పటి నుండి 1986, 1992, 2003, 2005, 2015, మరియు 2019 సంవత్సరాల్లో ఆరుసార్లు సవరించబడింది.

పౌరసత్వ చట్టం, 1955 (The Citizenship Act, 1955):

భారత పార్లమెంటు పౌరసత్వానికి సంబంధించిన సమగ్రమైన నియమాలను నిర్దేశిస్తూ 1955లో భారత పౌరసత్వ చట్టాన్ని రూపొందించింది. 1955 నాటి భారత పౌరసత్వ చట్టం ప్రకారం 5 రకాల పద్ధతుల ద్వారా భారత పౌరసత్వాన్ని పొందవచ్చు (ఇక్కడ, ఇక్కడ).

Citizenship by Birth

  • 26 జనవరి 1950 నుండి 01 జూలై 1987 మధ్య భారతదేశంలో జన్మించిన వారందరూ భారత పౌరులు అవుతారు.
  •  01 జూలై 1987 నుండి 02 డిసెంబర్ 2004 మధ్య భారతదేశంలో జన్మించిన వ్యక్తులకు, వారి పుట్టిన సమయంలో కనీసం తల్లిదండ్రులలో ఒకరైన భారతీయ పౌరుడిగా ఉంటేనే పౌరుడు అవుతారు.
  • 03 డిసెంబర్ 2004న లేదా ఆ తర్వాత భారతదేశంలో జన్మించిన వ్యక్తులకు, వారి తల్లిదండ్రులలో ఒకరు భారతీయ పౌరుడై, మరొకరు పుట్టిన సమయంలో అక్రమ వలసదారుడు కాకపోతే, అట్టి వారికి భారత పౌరసత్వం లభిస్తుంది.

Citizenship by Descent

  • 26 జనవరి 1950 తర్వాత ఒక వ్యక్తి విదేశాల్లో జన్మించినప్పటికీ, ఆ వ్యక్తి తల్లి/ తండ్రి భారతీయ పౌరసత్వాన్ని కలిగి ఉంటే విదేశాల్లో జన్మించిన ఆ వ్యక్తిని కూడా భారత పౌరసత్వానికి అర్హుడు.

Citizenship by Registration

  • విదేశాల్లో నివసిస్తున్న భారత సంతతికి చెందిన వ్యక్తులు పౌరసత్వ చట్టం, 1955 లోని సెక్షన్ 5(1)(a) ప్రకారం నమోదు ద్వారా పౌరసత్వాన్ని పొందవచ్చు.
  • భారత పౌరుడిని వివాహం చేసుకున్న విదేశీ మహిళ పౌరసత్వ చట్టం, 1955లోని సెక్షన్ 5(1) (c)ద్వారా భారత పౌరసత్వాన్ని పొందగలరు.

Citizenship by Naturalisation

  • ఒక నిర్దిష్ట కాలం పాటు భారతదేశంలో నివసించిన విదేశీయులు భారత పౌరసత్వ చట్టం, 1955 లోని సెక్షన్ 6 లోని పలు నియమాలకు లోబడి భారతీయ పౌరసత్వాన్ని పొందవచ్చు. అర్హతలు

Citizenship by Incorporation of territory

ఏదైనా భూభాగం భారతదేశంలో శాశ్వతంగా విలీనం అయితే, ఆ ప్రాంతంలో నివసించే ప్రజలందరికీ భారతీయ పౌరసత్వం లభిస్తుంది.

2019లో జరిగిన పౌరసత్వ చట్టం సవరణ (The Citizenship (Amendment) Act, 2019) ప్రకారం, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, పాకిస్తాన్ నుండి వచ్చిన హిందూ, సిక్కు, బౌద్ధ, జైన, పార్సీ మరియు క్రైస్తవ వర్గాలకు చెందిన వలసదారులు (అక్రమ/సక్రమ) 31 డిసెంబర్ 2014 నాటికి భారతదేశంలో నివాసం ఏర్పరుచుకుంటే వారికి భారత పౌరసత్వం లభిస్తుంది.

భారత పౌరసత్వ చట్టాలు లేదా భారత రాజ్యాంగం ముస్లింలు భారత పౌరులు కాదని, కొన్ని మతాలకు మాత్రమే భారత పౌరసత్వం అర్హత ఉందని ఎక్కడా పేర్కొనలేదు. అలాగే 15 ఆగస్టు 1947న భారత దేశ స్వాతంత్ర్యం, దేశ విభజన ప్రకటించబడిన తరవాత భారతదేశంలో నివసిస్తున్న కొన్ని వర్గాల ప్రజలు మాత్రమే భారత పౌరసత్వానికి అర్హులని భారత పౌరసత్వ చట్టాలు లేదా భారత రాజ్యాంగం పేర్కొనలేదు.

అలాగే 10, 11, 12 ఆగస్టు 1949 తేదీలలో భారత రాజ్యాంగ సభలో జరిగిన భారత పౌరసత్వానికి సంబంధించి చర్చలలో కూడా ఎక్కడా ముస్లింలకు భారత పౌరసత్వం ఇవ్వకూడదనే చర్చ జరగలేదు. కాకపోతే, ఈ చర్చలో పాల్గొన్న పి. ఎస్. దేశ్‌ముఖ్ హిందూ, సిక్కు మతాలకు చెందిన వారందరికీ భారత పౌరసత్వం ఇవ్వాలని పేర్కొన్నారు. భారత రాజ్యాంగ సభలో పౌరసత్వానికి సంబంధించి జరిగిన చర్చల యొక్క కాపీలను ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ చూడవచ్చు.

ఇకపోతే వైరల్ పోస్టులు క్లెయిమ్ చేస్తున్న 08 ఏప్రిల్ 1950న జరిగిన నెహ్రూ లియాఖత్ అలీ ఖాన్ ఒప్పందం” భారతదేశంలో నివసిస్తున్న ముస్లింలకు భారత పౌరసత్వం ఇచ్చేలా నెహ్రూ 08 ఏప్రిల్ 1950 పాక్ ప్రధాని లియాఖత్ అలీతో “నెహ్రూ లియాఖత్ అలీ ఖాన్ ఒప్పందం” చేసుకున్నారు” అనే వాదంలో కూడా ఎలాంటి నిజం లేదు.

నెహ్రూ-లియాఖత్ ఒప్పందం :

విభజన కారణంగా తలెత్తిన శరణార్థుల, మైనారిటీల హక్కులు, వలస వెళ్లిన ప్రజలు వదిలివేసిన ఆస్తుల వంటి పలు సమస్యలను పరిష్కరించడానికి భారత ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ, పాకిస్తాన్ ప్రధాని లియాఖత్ అలీ ఖాన్ 08 ఏప్రిల్ 1950న ఒక ఒప్పదంపై న్యూఢిల్లీలో సంతకం చేశారు. నెహ్రూ-లియాఖత్ ఒప్పందాన్ని ‘ఢిల్లీ ఒప్పందం’ అని కూడా పిలుస్తారు (ఇక్కడ).

రెండు దేశాల్లో మతంతో సంబంధం లేకుండా మైనారిటీలకు పౌరసత్వంపై సమాన హక్కులు ఉంటాయని ఈ ఒప్పందం పేర్కొంది. ఈ ఒప్పదం ప్రకారం, ఇరు దేశాల్లోని మైనారిటీలకు మతాలతో సంబంధం లేకుండా సమాన హక్కులు కల్పించాలి. మైనారిటీల హక్కులను కాపాడటానికి రెండు దేశాల్లోనూ మైనారిటీ కమీషన్లు ఏర్పాటు చేయాలి. మైనారిటీలు ఆయా దేశాల జాతీయ వ్యవహారాల్లో పాలుపంచుకునేందుకు, రాజకీయ పదవులు నిర్వహించేందుకు, పౌర, సాయుధ దళాల్లో చేరి దేశానికి సేవ చేసేందుకు సమాన అవకాశాలు కల్పించాలని ఈ ఒప్పందంలో నిర్ణయించారు. ఈ ఒప్పందం ప్రకారం, రెండు ప్రభుత్వాలు తమ దేశాల్లో ఉన్న మైనారిటీ పౌరుల రక్షణకు పరస్పరం జవాబుదారీగా ఉంటాయి. ఈ ఒప్పందంలో శరణార్థుల తాము కోల్పోయిన ఆస్తులను తిరిగి తీసుకునేందుకు అనుమతులు ఇచ్చారు. అపహరించిన మహిళలను, దోచుకున్న ఆస్తులను తిరిగి ఇవ్వడానికి అంగీకరించారు. బలవంతపు మతమార్పిడికి గుర్తింపు లేకుండా చేశారు.

చివరగా, భారతదేశంలో నివసిస్తున్న ముస్లింలు ‘చట్టబద్ధంగా’ భారత పౌరులు కాదు అనే వాదనలో నిజం లేదు.

Share.

About Author

Comments are closed.

scroll