సైన్యంపై రాళ్లు రువ్విన వారిని కాల్చి చంపినా సైనికులపై కేసు(ఎఫ్ఐఆర్) నమోదు చేయకూడదని సుప్రీం కోర్టు చెప్పిందంటూ ఒక పోస్టు (ఇక్కడ, ఇక్కడ & ఇక్కడ) సోషల్ మీడియాలో బాగా ప్రచారంలో ఉంది. దీంట్లో ఎంత నిజముందో ఇప్పుడు చూద్దాం.

క్లెయిమ్: సైన్యంపై రాళ్లు రువ్విన వారిని కాల్చి చంపిన సైనికులపై కేసు నమోదు చేయకూడదని సుప్రీం కోర్టు చెప్పింది.
ఫాక్ట్: సుప్రీం కోర్టు ఇటువంటి తీర్పు ఇచ్చినట్లు ఎటువంటి ఆధారాలు లేవు. అయితే, Armed Forces (Special Powers) Act (AFSPA), సెక్షన్ 06 ప్రకారం ఈ చట్టం ఇచ్చే అధికారాలతో పని చేసే సైనికుడుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటే కేంద్ర ప్రభుత్వ ఆమోదం తప్పనిసరి. కావున పోస్టులో చేయబడ్డ క్లెయిమ్ తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.
ముందుగా సుప్రీం కోర్టు ఇటువంటి తీర్పు లేదా ఆర్డర్ ఏమైనా జారీ చేసిందా అని సుప్రీం కోర్టు అధికారిక వెబ్సైట్లో వెతకగా మాకు ఎటువంటి సమాచారం లభించలేదు. అలాగే, మీడియాలో కూడా దీనిపై ఎటువంటి కథనాలు లభించలేదు.
ఇక ఈ విషయానికి సంబంధించిన మరిన్ని వివరాలను వెతకగా, దీనికి సంబంధించిన ఒక కేసు లభించింది. జమ్మూ కాశ్మీర్ లోని షోపియన్ ప్రాంతంలో ఇద్దరు పౌరులను కాల్చి చంపారనే కారణంతో మేజర్ ఆదిత్య కుమార్, 10 గర్వాల్ రైఫిల్స్ కు చెందిన సైనికులపై జమ్మూ కాశ్మీర్ పోలీసులు జమ్మూ కాశ్మీర్లో అమలులో ఉండే రణ్బీర్ పీనల్ కోడ్ కింద సెక్షన్ 302 (హత్య), 307 (హత్యాయత్నం) కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ ఎఫ్ఐఆర్ ని కొట్టివేయాలని సవాల్ చేస్తూ మేజర్ ఆదిత్య కుమార్ తండ్రి కరంవీర్ సింగ్ ఫిబ్రవరి 2018లో సుప్రీం కోర్టుని ఆశ్రయించారు. మేజర్ ఆదిత్య కుమార్ ఘటన జరిగిన ప్రదేశంలో లేరని, ఆర్మీ జవాన్లు తమ విధిలో భాగంగా, చట్టానికి లోబడి, ఆత్మరక్షణలో భాగంగా మాత్రమే కాల్పులు జరిపారని పిటిషన్లో పేర్కొన్నారు.

ఈ కేసులో వాదనలను విన్న సుప్రీం కోర్టు రాష్ట్ర ప్రభుత్వ వివరణను కోరుతూ ఎఫ్ఐఆర్ పై స్టే విధించింది. ఎఫ్ఐఆర్ ఆధారంగా ఎటువంటి దర్యాప్తు చేయరాదని తీర్పు ఇచ్చింది. దీనిలో ఎక్కడా కూడా రాళ్లు రువ్విన వారిని కాల్చి చంపిన సైనికులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడం చట్టవిరుద్ధం అని సుప్రీం కోర్టు పేర్కొనలేదు. 03 ఏప్రిల్ 2025 నాటికి ఈ కేసు పెండింగ్లో ఉంది.

అయితే, Armed Forces (Special Powers) Act (AFSPA), సెక్షన్ 06 ప్రకారం, ఈ చట్టం ఇచ్చే అధికారాలతో పని చేసే సైనికుడు, లేదా అధికారిపై ఎటువంటి చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నా కేంద్ర ప్రభత్వ ఆమోదం తప్పనిసరి.

అలాగే, నవంబర్ 2018లో తమపై నమోదు చేయబడ్డ ఎఫ్ఐఆర్ లకు వ్యతిరేకంగా AFSPA పరిధిలో ఉన్న మణిపూర్, జమ్మూ కాశ్మీర్లోని సైనికులు సుప్రీం కోర్టుని ఆశ్రయించగా, ఇది కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న నిర్ణయం అని, దీనిపై తగిన కార్యాచారణ వారి రూపొందించాలని పేర్కొంటూ కేసుని కొట్టి వేసింది. AFSPA చట్టం అమల్లో ఉన్న ప్రాంతాల్లో కూడా, తమ వల్ల అన్యాయంగా పౌరులు ప్రాణాలు కోల్పోతే సైనికులకు సంపూర్ణ రక్షణ ఉండదని 2016లో సుప్రీం కోర్టు పేర్కొంది.

చివరిగా, సైన్యంపై రాళ్లు రువ్విన వారిని కాల్చి చంపినా సైనికులపై కేసు(ఎఫ్ఐఆర్) నమోదు చేయకూడదని సుప్రీం కోర్టు చెప్పినట్లు ఎక్కడా ఆధారాలు లేవు.