“30 సెప్టెంబర్ 2025 తర్వాత ఏటీఎంల (ATM) ద్వారా ₹500 నోట్లను పంపిణీ చేయడాన్ని నిలిపివేయాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) అన్ని బ్యాంకులను ఆదేశించింది” అని చెప్తూ ఉన్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: 30 సెప్టెంబర్ 2025 నాటికి ATMల నుండి ₹500 నోట్లను పంపిణీ చేయడాన్ని నిలిపివేయాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) అన్ని బ్యాంకులను ఆదేశించింది.
ఫాక్ట్(నిజం): 30 సెప్టెంబర్ 2025 నాటికి ATMల నుండి ₹500 నోట్లను పంపిణీ చేయడాన్ని నిలిపివేయాలని RBI బ్యాంకులను ఆదేశించలేదు. 30 సెప్టెంబర్ 2025 నాటికి దేశంలోని 75% ATMలలో ₹100, ₹200 నోట్లను కూడా అందుబాటులో ఉంచాలని RBI బ్యాంకులను, వైట్ లేబుల్ ఏటీఎం ఆపరేటర్లను(WLAOs) ఆదేశించింది. అలాగే 31 మార్చి2026 నాటికి దీన్ని 90 శాతం ATMలకు పెంచాలని ఆదేశించింది. ₹100, ₹200 వంటి చిన్న డినామినేషన్ నోట్లను ఏటీఎంల నుండి ప్రజలు సులభంగా పొందేలా RBI ఈ కొత్త నిబంధనలను 28 ఏప్రిల్ 2025న జారీ చేసింది. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.
వైరల్ పోస్టులో పేర్కొన్నట్లుగా 30 సెప్టెంబర్ 2025 నాటికి ATMల నుండి ₹500 నోట్లను పంపిణీ చేయడాన్ని నిలిపివేయాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) అన్ని బ్యాంకులను ఆదేశించిందా? అని తెలుసుకోవడానికి, ముందుగా మేము RBI యొక్క అధికారిక వెబ్సైట్ను పరిశీలించాము. అయితే, వైరల్ క్లెయిమ్ను సమర్థించే ఎటువంటి సమచారం RBI వెబ్సైట్లో లభించలేదు. అలాగే, తగిన కీవర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్లో వెతకగా, బ్యాంకులకు RBI ఇలాంటి ఆదేశాలు జారీ చేసినట్లు ఎటువంటి విశ్వసనీయ రిపోర్ట్స్ కూడా లభించలేదు.
ఈ క్రమంలోనే ఏప్రిల్ 2025లో ప్రచురించబడిన పలు వార్తా కథనాలు లభించాయి (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఈ కథనాల ప్రకారం, ATMల నుండి రూ.100, రూ.200 వంటి చిన్న విలువ కలిగిన నోట్లను ప్రజలు సులభంగా పొందేలా RBI బ్యాంకులు, ATM ఆపరేటర్లకు 28 ఏప్రిల్ 2025న కొత్త సూచనలు చేసింది.

తదుపరి ఈ సమాచారం ఆధారంగా, 28 ఏప్రిల్ 2025న RBI జారీ చేసిన నోటిఫికేషను RBI వెబ్సైట్లో కన్నుగొన్నాము. ఈ నోటిఫికేషన్ ప్రకారం, ATMల ద్వారా ₹100, ₹200 రూపాయల నోట్లను కూడా పంపిణీ చేయాలని RBI బ్యాంకులు, వైట్ లేబుల్ ATM ఆపరేటర్లను (WLAOలు) ఆదేశించింది. 30 సెప్టెంబర్ 2025 నాటికి దేశంలోని 75% ATMలలో కనీసం ఒక క్యాసెట్ నుండి ₹100 లేదా ₹200 డినామినేషన్ నోట్లను పంపిణీ చేసేలా కాన్ఫిగర్ చేయాలని RBI బ్యాంకులను, వైట్ లేబుల్ ఏటీఎం ఆపరేటర్లను (WLAOs) ఆదేశించింది. అలాగే 31 మార్చి 2026 నాటికి దీన్ని 90 శాతం ATMలకు పెంచాలని ఆదేశించింది. రోజువారీ లావాదేవీలలో ప్రజలు అధికంగా ఉపయోగించే ₹100, ₹200 డినామినేషన్లను ప్రజలకు అందించడమే ఈ చర్య లక్ష్యం అని RBI తెలిపింది. అంతేకాకుండా, ఈ సర్క్యులర్లో ఎక్కడా ₹ 500 రూపాయల నోటు గురించి ప్రస్తావనే లేదు. (ATMలలో, క్యాసెట్ అనేది ఒక నిర్దిష్ట విలువ కలిగిన కరెన్సీ నోట్లను మాత్రమే కలిగి ఉండే సురక్షితమైన, తొలగించగల కంటైనర్)

03 జూన్ 2025న, భారత ప్రభుత్వ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) ఫాక్ట్-చెక్ విభాగం X (ట్విట్టర్)లో, 2026 నాటికి RBI ₹500 నోట్లను నిలిపివేస్తుందనే వాదనల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేసింది.అలాగే, PIB ఈ పోస్ట్లో, RBI ₹500 నోట్ల చెలామణి నిలిపివేయలేదని, ₹500 నోట్ల చట్టబద్ధంగా చెల్లుబాటులో ఉన్నాయని పేర్కొంది (ఇక్కడ).
వైట్ లేబుల్ ఏటీఎం ఆపరేటర్లు (WLAOs):
భారతదేశంలో బ్యాంకు పేరుతో కాకుండా వారి స్వంత బ్రాండ్ పేరుతో ATMలను ఏర్పాటు చేసి నిర్వహించడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ద్వారా అధికారం పొందిన బ్యాంకింగేతర సంస్థలను వైట్ లేబుల్ ఏటీఎం ఆపరేటర్లు (WLAOs) అని అంటారు (ఇక్కడ, ఇక్కడ). వైట్ లేబుల్ ATMలు కూడా బ్యాంక్ ATMల మాదిరిగానే పనిచేస్తాయి. డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్తో వీటి నుంచి క్యాష్ విత్డ్రా చేసుకోవచ్చు, బ్యాలెన్స్ చెక్ చేయవచ్చు, ఇతర అన్ని రకాల సర్వీసులు పొందవచ్చు. ఆర్బీఐ కొత్త నియమాలు ఈ ATMలకు కూడా వర్తిస్తాయి. ఇండికాష్ పేరుతో టాటా కమ్యూనికేషన్స్ పేమెంట్ సొల్యూషన్స్ లిమిటెడ్ వారు నిర్వహించే ATMలు, ఇండియా1 బ్రాండ్ పేరుతో ఇండియా1 పేమెంట్స్ లిమిటెడ్ నిర్వహించే ATMలు భారతదేశంలోని వైట్ లేబుల్ ఏటీఎంలకు ఉదాహరణలు.
చివరగా, 30 సెప్టెంబర్ 2025 నాటికి ATMల నుండి ₹500 నోట్లను పంపిణీ చేయడాన్ని నిలిపివేయాలని RBI బ్యాంకులను ఆదేశించలేదు. 30 సెప్టెంబర్ 2025 నాటికి దేశంలోని 75% ATM లలో రూ.100, రూ.200 నోట్లను కూడా అందుబాటులో ఉంచాలని RBI బ్యాంకులను మరియు వైట్ లేబుల్ ఏటీఎం ఆపరేటర్లను (WLAOs) ఆదేశించింది.