Fake News, Telugu
 

వీడియోలోని వ్యక్తి పాకిస్థాన్‌కు చెందిన హిందూ ఎంపీ కాదు; ఆయనొక క్రిస్టియన్ & పాకిస్థాన్ పంజాబ్ ప్రావిన్షియల్ అసెంబ్లీ సభ్యుడు

0

పాకిస్తాన్‌లో హిందూ బాలికలను బలవంతంగా ఇస్లాంలోకి మార్చడంపై అనేక కథనాలు వచ్చిన సందర్భంలో, పాకిస్తాన్‌ పార్లమెంటులో ఒక హిందూ ఎంపీ అక్కడి హిందువులపై దయ చూపాలంటూ వేడుకుంటున్నారని ఒక వీడియో (ఇక్కడ, ఇక్కడ & ఇక్కడ) సోషల్ మీడియాలో బాగా ప్రచారంలో ఉంది. ఈ వీడియోలో ఎంత నిజముందో నిర్థారించాలని కోరుతూ మా వాట్సాప్‌ టిప్‌లైన్‌కు (+91 9247052470) కూడా పలు అభ్యర్ధనలు వచ్చాయి. దీంట్లో ఎంత నిజముందో ఇప్పుడు చూద్దాం.

ఆర్కైవ్ పోస్టుని ఇక్కడ చూడవచ్చు

క్లెయిమ్: పాకిస్తాన్ హిందువులపై కనికరం చూపాలని పాకిస్థాన్ పార్లమెంటులో హిందూ ఎంపీ ఇచ్చిన ప్రసంగం.

ఫాక్ట్: వైరల్ వీడియోలోని వ్యక్తి పేరు ‘తారిక్ మసిహ్ గిల్’. ఆయన క్రిస్టియన్ మరియు పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్స్ నుండి ఎన్నికైన ప్రావిన్షియల్ అసెంబ్లీ సభ్యుడు (భారతదేశంలో ఒక ఎమ్మెల్యేకు సమానం). 11 ఆగస్టు 2022న నేషనల్ అసెంబ్లీ హాల్‌లో జరిగిన జాతీయ మైనారిటీ కన్వెన్షన్ సందర్భంగా, ఒక క్రైస్తవ యువతిని బలవంతంగా ఇస్లాంలోకి మార్చిన సంఘటన గురించి మరియు పాకిస్తాన్‌లోని మైనారిటీల దుస్థితి గురించి ఆయన మాట్లాడారు. కావున పోస్టులో చేయబడ్డ క్లెయిమ్ తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

వైరల్ వీడియో గురించిన మరింత సమాచారం ఇంటర్నెట్లో వెతకగా, దీనికి సంబంధించిన పూర్తి వీడియో 11 ఆగస్టు 2022 నాడు ‘PTV Parliament’ యూట్యూబ్ ఛానెల్లో ప్రత్యక్షప్రసారం చేసినట్లు మేం గుర్తించాం. ఇది పాకిస్తాన్ నేషనల్ అసెంబ్లీలో జరిగిన సమావేశంగా వీడియోలో పేర్కొన్నారు. ఈ వీడియోలో స్పీకర్ వైరల్ క్లిప్‌లోని వ్యక్తిని ‘తారిక్ మసిహ్ గిల్’ అని సంబోధించారు.

దీనికి సంబంధించిన మరిన్ని వివరాలకోసం పాకిస్తాన్ ప్రభుత్వ అధికారిక వెబ్సైట్లను పరిశీలించాం. ‘ప్రోవిన్షియల్ అసెంబ్లీ ఆఫ్ పంజాబ్’ వెబ్‌సైట్ (ఆర్కైవ్) ప్రకారం, ‘తారిక్ మాసిహ్ గిల్’ పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌కు చెందిన ప్రావిన్షియల్ అసెంబ్లీ సభ్యుడు (భారతదేశంలో ఎమ్మెల్యేకు సమానం). ఆయనొక క్రైస్తవుడు. ముస్లిమేతరులకు రిజర్వ్ చేయబడిన ఎనిమిది స్థానాల్లోని ఒకదానిలో 2018 సాధారణ ఎన్నికలలో ఆయన వరుసగా రెండవసారి పంజాబ్ ప్రావిన్షియల్ అసెంబ్లీ నుంచి గెలిచి సభ్యునిగా ఎన్నికయ్యారు.

మీడియా కథనాల ప్రకారం, 11 ఆగస్టు 1947న అప్పటి రాజ్యాంగ సభలో మైనారిటీల స్వేచ్ఛ మరియు సమానత్వంపై ముహమ్మద్ అలీ జిన్నా చేసిన ప్రసంగాన్ని గుర్తుచేసుకుంటూ 11 ఆగస్టు 2022న నేషనల్ అసెంబ్లీ హాల్‌లో జాతీయ మైనారిటీ సదస్సు జరిగింది. మైనారిటీ కమ్యూనిటీలకు చెందిన పలువురు ప్రస్తుత మరియు మాజీ జాతీయ మరియు ప్రాంతీయ సభ్యులు ఈ సదస్సులో ప్రసంగించారు. గిల్ తన ప్రసంగంలో, ఒక క్రైస్తవ యువతిని బలవంతంగా ఇస్లాంలోకి మార్చిన సంఘటన గురించి మరియు పాకిస్తాన్‌లోని మైనారిటీల పరిస్థితి గురించి మాట్లాడాడు.

చివరిగా, వైరల్ వీడియోలోని వ్యక్తి ఒక క్రైస్తవుడు మరియు పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్షియల్ అసెంబ్లీ సభ్యుడు, ఆయన పాకిస్తాన్‌లోని మైనారిటీల దుస్థితి గురించి మాట్లాడారు.

Share.

About Author

Comments are closed.

scroll