వీధుల్లో దుకాణాలను ధ్వంసం చేస్తూ, వాహనదారులకు ఇబ్బంది కలిగిస్తున్న ఇద్దరు వ్యక్తులలో ఒకర్ని పోలీసులు కొడుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో బాగా ప్రచారంలో ఉంది. అయితే, ఈ వీడియో ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందినదిగా కొందరు తమ పోస్టుల్లో (ఇక్కడ, ఇక్కడ & ఇక్కడ) పేర్కొనగా, ఆ ఇద్దరు వ్యక్తులు ముస్లింలని మరికొందరు ప్రచారం చేస్తున్నారు. దీంట్లో ఎంత నిజముందో ఇప్పుడు చూద్దాం.

క్లెయిమ్: ఉత్తర ప్రదేశ్లో దుకాణాలను ధ్వంసం చేస్తున్న ముస్లిం వ్యక్తిని కొడుతున్న ఆ రాష్ట్ర పోలీసులు.
ఫాక్ట్: ఈ ఘటన 28 డిసెంబర్ 2022లో మహారాష్ట్రలోని పుణేలో జరిగింది. అరెస్టయిన ఇద్దరు వ్యక్తులు మైనర్లని, ముస్లిం మతస్థులు కారని భారతి విద్యాపీఠ్ పోలీసులు పేర్కొన్నారు. కావున పోస్టులో చేయబడ్డ క్లెయిమ్ తప్పు.
ముందుగా వైరల్ వీడియోలోని దృశ్యాలను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ఈ ఘటనకు సంబంధించిన పలు వార్తా కథనాలు (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ & ఇక్కడ) లభించాయి. వీటి ప్రకారం, ఈ ఘటన 28 డిసెంబర్ 2022న మహారాష్ట్రలోని పూణే నగరంలో జరిగింది. 28 డిసెంబర్ 2022న పూణేలోని సిన్హఘడ్ లా కాలేజ్ వద్ద ఇద్దరు యువకులు కొడవలి వంటి పదునైన ఆయుధాలతో దుకాణాల అద్దాలను ధ్వంసం చేస్తూ, వాహనదారులను బెదిరించడం చేస్తున్నారు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు వారిలో ఒకరిని పట్టుకొని కొట్టారు. తప్పించుకొని పారిపోయిన మరో వ్యక్తిని జనవరి 2023లో అరెస్టు చేశారు. భారతి విద్యాపీఠ్ పోలీస్ స్టేషన్లో వీరి పై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

ఇక వైరల్ వీడియోలోని దృశ్యాలను ఘటన జరిగిన పుణెలోని గూగుల్ స్ట్రీట్ వ్యూ దృశ్యాలతో పోల్చగా, ఈ ఘటన పూణెలో జరిగిందని నిర్ధారించవచ్చు.

అలాగే, స్థానిక మీడియా కథనంలో ఈ ఘటనలో అరెస్టయిన ఇద్దరు యువకుల పేర్లు ఇవ్వబడ్డాయి. దీని ప్రకారం, వీళ్లు ముస్లింలు కారు. ఇదే విషయాన్ని భారతి విద్యాపీఠ్ పోలీసులు ఆజ్ తక్కు స్పష్టం చేశారు. అరెస్టయిన ఇద్దరు యువకులు మైనర్లు అని, ఇద్దరూ ముస్లింలు కారని, ఇందులో మతపరమైన కోణం లేదని పోలీసులు పేర్కొన్నారు. (ముద్దాయిలు మైనర్లు కావడం వల్ల వారి పేర్లను చూపించట్లేదు)

చివరిగా, మహారాష్ట్రలో జరిగిన ఘటనను ఉత్తర్ ప్రదేశ్లో జరిగినట్లుగా తప్పుడు మతపరమైన కోణంలో షేర్ చేస్తున్నారు.