Fake News, Telugu
 

పంజాబ్‌లో డ్రగ్స్‌కు వ్యతిరేకంగా బైక్ ర్యాలీ నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ వారిపై ఈ దాడి ఘటన 2016లో జరిగింది

0

పంజాబ్‌లో బైక్ ర్యాలీ నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ వారిని కొడుతున్న అక్కడి ప్రజలు అంటూ ఒక ఫోటోతో ఉన్న పోస్టును సోషల్ మీడియాలో బాగా షేర్ చేస్తున్నారు. డ్రగ్స్‌కు వ్యతిరేకంగా ర్యాలీ చేస్తున్న వాళ్ళను, అసలు డ్రగ్స్‌ స్మగ్లింగ్‌కు కారణం మీరే అని అక్కడి వారు కాంగ్రెస్ వాళ్ళను ఉతికేసారని పోస్ట్ ద్వారా అంటున్నారు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: పంజాబ్‌లో డ్రగ్స్‌కు వ్యతిరేకంగా ర్యాలీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ వారిని అసలు డ్రగ్స్‌ స్మగ్లింగ్‌కు కారణం మీరే అని అక్కడి ప్రజలు వాళ్ళను కొడుతున్న ఫోటో.

ఫాక్ట్: 2016లో పంజాబ్‌లో డ్రగ్స్‌కు వ్యతిరేకంగా ర్యాలీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కొంతమంది యువకులు రాడ్లు, బేస్ బాల్ బ్యాట్లతో కొడుతున్నప్పుడు తీసిన ఫోటో ఇది. దాడి చేసిన వారు అధికార పార్టీకి (అప్పుడు పంజాబ్‌లో అధికారంలో ఉన్నది అకాలీ దళ్) చెందినవారని కాంగ్రెస్ పార్టీ వారు ఆరోపించారు. కాంగ్రెస్ ర్యాలీలో కొంతమంది ఒకతని కారును ఢీకొట్టడంతో మాటల యుద్ధం జరిగిందని, బాగా రెచ్చగొట్టడం వల్ల ఈ సంఘటన జరిగిందని SSP హర్కమల్ సింగ్ ఖాఖ్ అప్పట్లో తెలిపారు. పంజాబ్‌లో డ్రగ్స్‌కు వ్యతిరేకంగా ర్యాలీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ వారిని అసలు డ్రగ్స్‌ స్మగ్లింగ్‌కు కారణం మీరే అని అక్కడి ప్రజలు వాళ్ళను కొట్టారని చెప్తున్న ఇటువంటి సంఘటన ఏది ఇటీవల పంజాబ్ లో జరిగినట్టు వార్తలు లేవు. కావున, పోస్ట్ ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

ఫోటోను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసినప్పుడు, అదే ఫోటోతో ఉన్న ఒక ఆర్టికల్ లభించింది. హిందుస్తాన్ టైమ్స్ వారు 25 సెప్టెంబర్ 2016న ప్రచురించిన ఈ ఆర్టికల్ టైటిల్ (ఇంగ్లీష్లో), “3 hurt as ‘Akalis’ attack Congress workers during bike rally in Ajnala”. జిల్లా కాంగ్రెస్ కమిటీ (గ్రామీణ) అధ్యక్షుడు గుర్జిత్ సింగ్ ఔజ్లా నేతృత్వంలోని బైక్ ర్యాలీ గురు కా బాగ్ లోని కమ్యూనిటీ సెంటర్ కు చేరుకోవడంతో ఈ సంఘటన జరిగింది. అక్కడ కొంతమంది యువకులు కాంగ్రెస్ కార్యకర్తలను రాడ్లు, బేస్ బాల్ బ్యాట్లతో కొట్టడం ప్రారంభించారని ఆర్టికల్ ద్వారా తెలుస్తుంది. దాడి చేసిన వారు అధికార పార్టీకి (అప్పుడు పంజాబ్‌లో అధికారంలో ఉన్నది అకాలీ దళ్) చెందినవారని ఔజ్లా ఆరోపించారు.

ఆ సంఘటనకు సంబంధించిన విజువల్స్‌ మరియు వీడియోలు కొన్ని మీడియా సంస్థలు 2016 సెప్టెంబర్‌లోనే యూట్యూబ్‌లో అప్లోడ్ చేసారు. అవి ఇక్కడ మరియు ఇక్కడ చూడొచ్చు. డ్రగ్స్‌కు వ్యతిరేకంగా ర్యాలీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ వారిపై దాడికి సంబంధించి అజ్నాలా పోలీసులు పలువురిపై కేసు నమోదు చేశారు. కాంగ్రెస్ ర్యాలీలో కొంతమంది ఒకతని కారును ఢీకొట్టడంతో మాటల యుద్ధం జరిగిందని, బాగా రెచ్చగొట్టడం వల్ల ఈ సంఘటన జరిగిందని SSP హర్కమల్ సింగ్ ఖాఖ్ తెలిపారు. అతను సహచరులతో తిరిగి వచ్చి ర్యాలీలో ఉన్న వ్యక్తులపై దాడి చేసినప్పుడు జరిగిన ఈ సంఘటనకు రాజకీయ రంగు ఇస్తున్నట్లు ఆయన చెప్పారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై దాడికి ‘అకాలీ గూండాలు’ కారణమని కెప్టెన్ అమరీందర్ అప్పట్లో ఆరోపించారు.

పంజాబ్‌లో డ్రగ్స్‌కు వ్యతిరేకంగా ర్యాలీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ వారిని అసలు డ్రగ్స్‌ స్మగ్లింగ్‌కు కారణం మీరే అని అంటూ కొట్టారని చెప్తున్న ఇటువంటి సంఘటన ఏది ఇటీవల పంజాబ్ లో జరిగినట్టు వార్తలు లేవు.

చివరగా, 2016లో పంజాబ్‌లో డ్రగ్స్‌కు వ్యతిరేకంగా ర్యాలీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ వారిపై జరిగిన దాడిని ఇటీవల జరిగిందిగా షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll