Fake News, Telugu
 

ఉగ్రదాడిలో మరణించిన వారి స్మారకార్ధం దావూదీ బోహ్రా ముస్లింలు నిర్వహించిన సభకు సంబంధించిన పాత ఫోటోను సందర్భరహితంగా షేర్ చేస్తున్నారు

0

భారీ సంఖ్యలో ముస్లింలు కవాతు చేస్తున్న ఫోటో  ఒకటి సోషల్ మీడియాలో షేర్ అవుతోంది. ముస్లింల జనాభా పెరిగిపోతుందని చెప్పే ఉద్దేశంలో ఈ ఫోటోను ‘ఇది ముస్లిం దేశం కాదు, లండన్ పరిస్తితి’ అనే కాప్షన్‌తో షేర్ చేస్తున్నారు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: లండన్‌లో భారీ సంఖ్యలో ముస్లింలు కవాతు చేస్తున్న ఫోటో.

ఫాక్ట్(నిజం): జూన్ 2017లో లండన్‌లో జరిగిన ఉగ్రదాడిలో చనిపోయిన వారి స్మారకార్ధం అక్కడి దావూదీ బోహ్రా ముస్లిం కమ్యూనిటీ సభ్యులు ఒక స్మారక సభ నిర్వహించారు. ఈ ఫోటో ఆ సందర్భానికి సంబంధించిందే. ఐతే ఈ ఫోటోను తప్పుగా అర్ధం చేసుకొని, ముస్లింల జనాభా పెరిగిపోతుందనే ఉద్దేశంలో షేర్ చేస్తున్నారు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

పోస్టులో చెప్తున్నట్టు భారీ సంఖ్యలో ముస్లింలు కవాతు చేస్తున్న ఫోటో లండన్‌కు సంబంధించిందే అయినప్పటికి ఈ ఫోటోను సందర్భరహితంగా షేర్ చేస్తున్నారు.

ఈ ఫోటోను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ఈ ఫోటోను జూన్ 2017లో రిపోర్ట్ చేసిన వార్తా కథనాలు మాకు కనిపించాయి. ఈ కథనాల ప్రకారం ఈ ఫోటో లండన్‌లోని దావూదీ బోహ్రా ముస్లిం కమ్యూనిటీ సభ్యులు లండన్ బ్రిడ్జి & బోరో మార్కెట్‌లో జరిగిన ఉగ్రదాడి బాధితుల స్మారకార్థం లండన్‌లోని పాటర్స్ ఫీల్డ్స్ పార్క్‌లో జరిగిన స్మారక సభలో పాల్గొన్నప్పుడు తీసింది.

అంతకు ముందు 03 జూన్ 2017లో లండన్ బ్రిడ్జి & బోరో మార్కెట్‌ ప్రాంతాలలో ఉగ్రదాడి జరిగింది. ఈ దాడిలో ఏడుగురు చనిపోయినట్టు వార్తా కథనాలు రిపోర్ట్ చేసాయి.

ఈ దాడిలో చనిపోయిన వారి స్మారకార్ధమే ముస్లింలు ఒక స్మారక సభ నిర్వహించారు. ఇదే విషయాన్ని ధృవీకరిస్తున్న మరొక వార్తా కథనం ఇక్కడ చూడొచ్చు. పైగా ఈ దాడులు చేసిన నిందితుల అంత్యక్రియల ఇస్లామిక్ పద్దతిలో నిర్వహించబోమని ఇమామ్‌లు తీర్మానించారు.

చివరగా, లండన్‌లో ఉగ్రదాడిలో మరణించిన వారి స్మారకార్ధం దావూదీ బోహ్రా ముస్లింలు నిర్వహించిన సభకు సంబంధించిన ఫోటోను సందర్భరహితంగా షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll