ముహమ్మద్ ప్రవక్తపై బీజేపీ అధికార ప్రతినిధి చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో ఇటీవల నిరసనల్లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్న నేపథ్యంలో, ఈ హింసలో పదిహేను మంది హిందూ పిల్లలు ఒక 150 హిందూ కుటుంబాలను ముస్లింల దాడి నుండి కాపాడారని చెప్తున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.
క్లెయిమ్: కాన్పూర్లో పదిహేను మంది హిందూ పిల్లలు ఒక 150 హిందూ కుటుంబాలను ముస్లింల దాడి నుండి కాపాడారు.
ఫాక్ట్ (నిజం): ముహమ్మద్ ప్రవక్తపై చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా కాన్పూర్లో జరిగిన హింసలో పదిహేను మంది చిన్న పిల్లలు 150 హిందూ కుటుంబాలను ముస్లింల దాడి నుండి రక్షించారని ఏ వార్తా సంస్థ రిపోర్ట్ చేయలేదు. ఏఎన్ఐ కూడా ఇలాంటి కథనాలేవి ప్రసారం చేయలేదు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.
బీజేపీ అధికార ప్రతినిధి ముహమ్మద్ ప్రవక్తపై చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా కాన్పూర్లోని బేకన్గంజ్ ప్రాంతంలో 03 జూన్ 2022న నిరసనలు జరిగాయి. ఐతే నిరసనలలో భాగంగా బేకన్గంజ్ ప్రాంతంలోని మార్కెట్ బంద్కు సంబంధించి రెండు వర్గాల మధ్య గొడవ జరిగింది.
ఈ గొడవలో రెండు వర్గాలు రాళ్ళ దాడి చేసుకున్నారు. పోలీసులపై కూడా రాళ్ళు విసిరారు. ఈ గొడవలకు సంబంధించి ప్రధాన నిందితుడిగా భావిస్తున్న జాఫర్ హయత్తో ఇప్పటివరకు 50 మందికిపైగా అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు. అలాగే ఒక నలబై మంది అనుమానితుల ఫోటోలను కూడా పోలీసులు విడుదల చేసారు.
ఐతే ఈ ఘటనల్లో పదిహేను మంది చిన్న పిల్లలు 150 హిందూ కుటుంబాలను ముస్లింల దాడి నుండి రక్షించారని చెప్పే ఎటువంటి వార్తా కథనాలుగాని లేక ఇతర సమాచారంగాని లేదు. ఒకవేళ నిజంగానే ఇలా జరిగి ఉంటే మీడియా ఈ వార్తను రిపోర్ట్ చేసి ఉండేది, కాని మాకు అలాటి మీడియా కథనాలేవి లభించలేదు.
పైగా పోస్టులో వీరు ఏఎన్ఐతో మాట్లాడినట్టు చెప్తున్నారు, కాని కాన్పూర్ హింసకు సంబంధించి ఈ విషయాన్నీ పేర్కొంటూ ఏఎన్ఐ ప్రసారం చేసిన కథనాలేవి మాకు లభించలేదు. దీన్నిబట్టి, పోస్టులో చెప్తున్నది పూర్తిగా కల్పితమని, దీనికి ఎటువంటి ఆధారాలు లేవని స్పష్టమవుతుంది.
చివరగా, కాన్పూర్ హింసలో పదిహేను మంది చిన్న పిల్లలు 150 హిందూ కుటుంబాలను రక్షించాయన్నది కల్పితం.