“కలదన్ ప్రాజెక్ట్ మోదీ గవర్నమెంటు రూపకల్పన చేసింది. మనం ఈశాన్య రాష్ట్రాలకు వెళ్ళాలంటే బంగ్లాదేశ్ చుట్టూరా తిరిగి ఒక చిన్న మార్గం గుండా వెళ్ళాలి. ఒక వేళ ఈశాన్య రాష్ట్రాలకు వెళ్లే దారిని ఆక్రమించుకుంటే ఆ మార్గం నుంచి వెళ్లలేము, అందుకే బంగాళాఖాతం మీదుగా మయన్మార్ నుండి మరో ఈ హైవేను నిర్మించారు” అంటూ ఒక పోస్టు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఈ క్లెయిమ్ వెనుక ఎంత నిజముందో ఇప్పుడు చూద్దాం.
క్లెయిమ్: కలదన్ ప్రాజెక్ట్ మోదీ ప్రభుత్వం రూపకల్పన చేసింది.ఇది ఈశాన్య రాష్ట్రాలను కలుపుతూ బంగాళాఖాతం మీదుగా నిర్మించిన మెగా హైవే.
ఫాక్ట్(నిజం): కలదన్ మల్టీ-మోడల్ ట్రాన్సిట్ ట్రాన్స్పోర్ట్ ప్రాజెక్ట్ 2008 లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వ హయాంలో ప్రారంభించబడింది. ఈ ప్రాజెక్టు అంతర్గత జలమార్గాల వినియోగంతో పాటు భూమి మరియు సముద్ర మార్గాలను రెండింటినీ అందిస్తుంది. పొరుగు దేశాలతో కనెక్టివిటీని పెంపొందించడానికి, ఆర్థిక సంబంధాలను పెంపొందించడానికి భారతదేశం చేస్తున్న ప్రయత్నాలలో ఈ ప్రాజెక్టు ఒక భాగం. కావున, ఈ పోస్టులో చేసిన క్లెయిమ్ తప్పుదోవ పట్టించే విదంగా ఉంది.
ఈ క్లెయిమ్ గురించి తెలుసుకోవటానికి కీ వర్డ్ సెర్చ్ ద్వారా ఇంటర్నెట్లో వెతకగా, కలదన్ మల్టీ-మోడల్ ట్రాన్సిట్ ట్రాన్స్పోర్ట్ ప్రాజెక్ట్ 2008 లో కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ (UPA) ప్రభుత్వ హయాంలో ప్రారంభించబడింది అని తెలిసింది (ఇక్కడ , ఇక్కడ మరియు ఇక్కడ). ఈ ప్రాజెక్టును 2010 డిసెంబర్లో ప్రారంభించారు.
ఈ ప్రాజెక్టు సప్లిమెంటరీ అగ్రిమెంట్ 2016లో సైన్ చెయ్యబడింది. కలదన్ మల్టీ-మోడల్ ట్రాన్సిట్ ట్రాన్స్పోర్ట్ ప్రాజెక్ట్ (KMTTP)లో భాగంగా అభివృద్ధి చేయబడ్డ సిట్వే ఓడరేవును భారత్, మయన్మార్లు 9 మే 2023న రఖైన్ రాష్ట్రంలో ప్రారంభించారు. 2023 నవంబర్ నాటికి ప్రాజెక్టు పూర్తవుతుందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఇటీవల ప్రకటించారు(ఇక్కడ మరియు ఇక్కడ).
ఈ ప్రాజెక్టు గురించి మరింత వెతకగా, పొరుగు దేశాలతో కనెక్టివిటీని పెంపొందించడానికి మరియు ఆర్థిక సంబంధాలను పెంపొందించడానికి భారతదేశం చేస్తున్న ప్రయత్నాలలో భాగం అని తెలిసింది (ఇక్కడ మరియు ఇక్కడ).
కలదాన్ ప్రాజెక్ట్, మల్టీమోడల్ రవాణా కారిడార్ను రూపొందించడానికి అంతర్గత జలమార్గాల వినియోగంతో పాటు భూమి మరియు సముద్ర మార్గాలను రెండింటినీ అందిస్తుంది. భారతదేశం యొక్క తూర్పు నౌకాశ్రయంలోని ఓడరేవుల నుండి మయన్మార్ యొక్క సిట్వే ఓడరేవు వరకు సముద్రం, నది మరియు మయాన్మార్ లోపల రహదారి రవాణా పద్ధతులను ఉపయోగించి మయన్మార్ ద్వారా ఈశాన్య భారతదేశానికి కనెక్టివిటీని అందించడం ఈ ప్రాజెక్ట్ లక్ష్యం. ఈ మార్గం మయన్మార్ ద్వారా ఈశాన్య భారతదేశానికి వస్తువుల రవాణాకు ఆల్టర్నేట్ మార్గాన్ని అందిస్తుంది.
చివరిగా, కలదన్ ఒక మల్టీ మోడల్ ట్రాన్సిట్ ట్రాన్స్పోర్ట్ ప్రాజెక్ట్. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం (యూపీఏ) హయాంలో ప్రారంభించబడింది.