జూన్ 2025లో ఇరాన్- ఇజ్రాయెల్ మధ్య జరిగిన ఘర్షణలో భాగంగా ఇరాన్ ఇజ్రాయెల్ పై మిస్సైల్ దాడి చేసి ఒక భవనాన్ని కూల్చేసిందని చెప్తూ ఒక వీడియో (ఇక్కడ, ఇక్కడ & ఇక్కడ) సోషల్ మీడియాలో బాగా ప్రచారంలో ఉంది. దీంట్లో ఎంత నిజముందో ఇప్పుడు చూద్దాం.

క్లెయిమ్: జూన్ 2025లో ఇజ్రాయెల్ లోని భవనంపై ఇరాన్ మిస్సైల్ దాడి చేసినప్పటి దృశ్యాలు.
ఫాక్ట్: ఈ వీడియో మే 2021లో గాజాలోని ‘అల్ షోరూక్’ భవనంపై ఇజ్రాయెల్ దాడి చేసినప్పటి దృశ్యాలను చూపుతుంది. జూన్ 2025లో ఇరాన్- ఇజ్రాయెల్ మధ్య జరిగిన ఘర్షణలకు సంబంధించినది కాదు. కావున పోస్టులో చేయబడ్డ క్లెయిమ్ తప్పు.
ముందుగా, వైరల్ వీడియోలోని దృశ్యాలను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా ఇదే వీడియోని 12 మే 2021న “omaralsersawi” అనే ఇన్స్టాగ్రామ్ పేజీలో అప్లోడ్ చేసినట్లు గుర్తించాం. ఈ వీడియో గాజా నగరంపై ఇజ్రాయెల్ దాడిని చూపుతుందని అందులో పేర్కొన్నారు.
దీని గురించి మరింత వెతకగా, ఈ ఘటనకి సంబంధించిన వార్తా కథనాలు (ఇక్కడ, ఇక్కడ & ఇక్కడ) లభించాయి. ఈ కథనాల ప్రకారం, వైరల్ వీడియోలో ధ్వంసం చేయబడ్డ భవనం పేరు ‘అల్ షోరూక్’. గాజా నగరంలో ఉండే ఈ 16 అంతస్తుల భవనంలో వివిధ మీడియా సంస్థల కార్యాలయాలు, వాణిజ్య సముదాయాలు, గృహాలు ఉంటాయి.

వైరల్ వీడియోలోని దృశ్యాలను, వివిధ మీడియా సంస్థలు ప్రసారం చేసిన దృశ్యాలతో పోల్చగా ధ్వంసం అయిన భవనం పాలస్తీనాలోని గాజా నగరంలో ఉన్న అల్ షోరూక్ అనే భవనం అని స్పష్టమవుతుంది.

చివరిగా, ఇజ్రాయెల్పై ఇరాన్ దాడి దృశ్యాలంటూ 2021లో గాజాపై ఇజ్రాయెల్ దాడి చేసినప్పటి దృశ్యాలను షేర్ చేస్తున్నారు.