Fake News, Telugu
 

ప్రస్తుత కరోనా కేసుల నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలు విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించినట్టు 2020 వీడియోని షేర్ చేస్తున్నారు

0

ప్రస్తుతం మన దేశంలో కొత్త కరోనా వేరియంట్ కేసులు నమోదు అవుతున్న నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించాయి అని చెప్తున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో షేర్ అవుతోంది. దీనికి మద్దతుగా కరోనా నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించాయి అని చెప్తున్న TV9 వార్తా కథనం జత చేస్తున్నారు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: కరోనా కేసుల నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించాయి.

ఫాక్ట్ (నిజం): ప్రస్తుతం కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించలేదు. ఇప్పుడు షేర్ అవుతున్న వీడియో 2020లో అప్పటి కరోనా ప్రభావం దృష్ట్యా విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారని TV9 రిపోర్ట్ చేసినప్పటిది. కావున పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

వైరల్ పోస్టులో షేర్ చేసిన TV9 వార్తా కథనం గురించి కీవర్డ్స్ సహాయంతో వెతకగా, ఇదే వార్తను 18 మార్చి 2020లో TV9 “ఏపీ కీలక నిర్ణయం.. విద్యాసంస్థలు బంద్” అనే శీర్షికతో వార్తా కథనం ప్రసారం చేసినట్టు తెలిసింది. ఈ కథనం ప్రకారం 2020 మొదటి కరోనా వేవ్ సమయంలో వివిధ రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు తెలంగాణ మరియు ఏపీ ప్రభుత్వాలు కూడా విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించాయి.

అలాగే ప్రస్తుతం మన దేశంలో కొత్త కరోనా JN.1 వేరియంట్ కేసులు నమోదు అవుతున్న నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించాయి అన్న ప్రచారం నిజమా అని వెతకగా అలాంటి వివరాలేవీ లభించలేదు. ఇదే విషయంపై తెలంగాణ విద్యాశాఖ వెబ్ సైట్ మరియు ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ వెబ్ సైట్ లో వెతకగా విద్యాసంస్థలకు సెలవు ప్రకటిచడం గురించి ఎలాంటి వార్త లభించలేదు.

ఇటీవల దేశంలో కోవిడ్-19 కేసులలో పెరుగుదల మరియు JN.1 వేరియంట్ యొక్క మొదటి కేసును గుర్తించిన నేపథ్యంలో కేంద్రం రాష్ట్రాలకు పలు సలహాలు, సూచనలు చేస్తూ, కోవిడ్ పరిస్థితిపై నిరంతరం అప్రమత్తంగా ఉండాలని రాష్ట్రాలని కోరింది. దీనికి సంబంధించిన రిపోర్ట్ ఇక్కడ చూడవచ్చు. తెలంగాణ ప్రభుత్వం కూడా కోవిడ్-19 కేసులలో పెరుగుదల దృష్ట్యా ఆసుపత్రులను అలర్ట్ చేస్తూ, పలు సూచనలు  జారీ చేసింది (ఇక్కడ, ఇక్కడ).

చివరగా, ప్రస్తుత కరోనా కేసుల నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించినట్టు 2020 వీడియోని షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll