దళిత అధ్యయనాలకు నిధులు కట్ చేసిన కేంద్ర ప్రభుత్వం అంటూ ఒక న్యూస్ పేపర్ క్లిప్ సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది (ఇక్కడ & ఇక్కడ). యూనివర్సిటీల్లోని దళిత స్థితిగతులపై అధ్యయనం కోసం ఏర్పాటైన కేంద్రాలకు నిధుల పంపిణీని నిలిపివేయనున్నట్టు MHRD ఆదేశాల మేరకు పలు యూనివర్సిటీలకు UGC లేఖ పంపిందని ఈ వార్త సారాంశం. ఈ కథనం ద్వారా ఆ వార్తకు సంబంధించి నిజమేంటో చూద్దాం.

క్లెయిమ్: యూనివర్సిటీల్లోని దళిత స్థితిగతులపై అధ్యయనం కోసం ఏర్పాటైన కేంద్రాలకు నిధుల పంపిణీని నిలిపివేయనున్నట్టు UGC తెలిపింది.
ఫాక్ట్(నిజం): 2017లో మొదటిసారి ఈ వార్త వైరల్ అయినప్పుడు తాము ఇలాంటి నిర్ణయం ఏది తీసుకోలేదని, సాంఘిక అసమానతలు, వివక్షపై అధ్యయనాలకు నిధుల కేటాయింపు యదావిధిగా కొనసాగుతుందని స్పష్టం చేసింది. UGC వార్షిక నివేదికల ప్రకారం ప్రతీ సంవత్సరం వీటికి కేటాయింపులు జరుగుతున్నాయని స్పష్టంగా తెలుస్తుంది. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.
ముందుగా ఇది 2017కు సంబంధించిన వార్త. ప్రస్తుతం షేర్ అవుతున్న క్లిప్లో అయిదు రాష్ట్రాల ఎన్నికల గురించి ప్రస్తావించారు, దీన్నిబట్టి ఈ వార్త ఇప్పటిది కాదని తెలుస్తుంది. 2017లో ఇదే క్లిప్ను షేర్ చేసిన పలు సోషల్ మీడియా పోస్టులు ఇక్కడ మరియు ఇక్కడ చూడొచ్చు.
సాంఘిక అసమానతలు, వివక్షపై అధ్యయనం జరిపే కేంద్రాలకు నిధుల విడుదలను నిలిపివేయాలని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ నిర్ణయించిందని, ఈ నిర్ణయానికి అనుగుణంగా జవహర్లాల్ నెహ్రూ యూనివర్శిటీకి UGC లేఖ రాసిందంటూ అప్పట్లో ఒక లెటర్ షేర్ అయ్యింది. ఐతే ఈ వార్త హెడ్లైన్లోకి ఎక్కడంతో UGC దీనిపై స్పందిస్తూ తాము అలాంటి నిర్ణయం ఏది తీసుకోలేదని, ప్రస్తుతం షేర్ అవుతున్న లేఖ ఎవరో ఫోర్జరీ చేశారని స్పష్టం చేసింది. సాంఘిక అసమానతలు, వివక్షపై జరిగే అధ్యయనాలకు నిధులు యధావిధంగా కొనసాగుతాయని తెలిపింది.

ఆ తరవాతి సంవత్సరాలలో UGC ఈ అధ్యయనాలకు యధాతదంగా నిధులను కేటాయించింది. UGC వార్షిక నివేదికలు పరిశిలిస్తే కూడా ఈ విషయం స్పష్టమవుతుంది (ఇక్కడ). 2017లో మొదటిసారి UGC ఇలా నిధుల ఆపేసిందని వార్త మొదలైనప్పట్టి నుండి 2022-23 మధ్య ఈ అధ్యయనాల కోసం విడుదల చేసిన నిధులకు సంబంధించిన వివరాలు కింది టేబుల్లో చూడొచ్చు.

సంవత్సరం | నిధుల కేటాయింపు |
2017-18 | 12.46 కోట్లు |
2018-19 | 7.25 కోట్లు |
2019-20 | 9.82 కోట్లు |
2020-21 | 4.52 కోట్లు |
2021-22 | 23.53 కోట్లు |
2022-23 | 1.20 కోట్లు |
చివరగా, దళిత అధ్యయనాలకు నిధులు కట్ అంటూ షేర్ చేస్తున్న ఈ వార్తలో నిజం లేదు; కేంద్ర ప్రభుత్వం దళిత అధ్యయనాలకు ఇంకా నిధులు కేటాయిస్తూ ఉంది.