15 జూలై 2025 నుంచి ద్విచక్ర వాహనదారులు జాతీయ రహదారులపై ప్రయాణించినందుకు టోల్ ఫీజు చెల్లించాలని నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) మరియు రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ ప్రకటించిందని చెప్తూ ఒక పోస్టు (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ & ఇక్కడ) సోషల్ మీడియాలో బాగా ప్రచారంలో ఉంది. దీంట్లో ఎంత నిజముందో ఇప్పుడు చూద్దాం.

క్లెయిమ్: 15 జూలై 2025 నుంచి ద్విచక్ర వాహనదారులు జాతీయ రహదారులపై ప్రయాణించినందుకు టోల్ ఫీజు చెల్లించాలి.
ఫాక్ట్: ద్విచక్ర వాహనాలకు టోల్ ఛార్జీల మినహాయింపు ఎప్పటిలాగే పూర్తిగా కొనసాగుతుందని, ద్విచక్ర వాహనాలకు టోల్ చార్జీలు ప్రవేశపెట్టే ప్రణాళికలు లేవని NHAI మరియు రోడ్డు రవాణా & రహదారుల మంత్రి నితిన్ గడ్కరి స్పష్టం చేశారు. కావున, పోస్టులో చేయబడ్డ క్లెయిమ్ తప్పు.
ముందుగా, ఈ విషయం గురించి రోడ్డు రవాణా& రహదారుల మంత్రిత్వ శాఖ మరియు NHAI వెబ్సైట్లను పరిశీలించగా దీనికి ద్విచక్ర వాహనాలకు టోల్ ఫీజుని అములు చేస్తున్నట్లుగా ఎటువంటి అధికారిక ప్రకటన విడుదల చెయ్యలేదు.
ఇక మీడియా, సోషల్ మీడియాలో దీనిపై పుకార్లు వ్యాపించడంతో NHAI ఈ విషయంపై స్పందిస్తూ (ఆర్కైవ్) ద్విచక్ర వాహనాలకు టోల్ చార్జీలు ప్రవేశపెట్టే ప్రణాళికలు లేవని, కొన్ని మీడియా సంస్థలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని స్పష్టం చేసింది.
అలాగే, ద్విచక్ర వాహనాలకు టోల్ చార్జీలు విధించాలని ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని, ద్విచక్ర వాహనాలకు టోల్ ఛార్జీల మినహాయింపు ఎప్పటిలాగే పూర్తిగా కొనసాగుతుందని రోడ్డు రవాణా & రహదారుల మంత్రి నితిన్ గడ్కరి స్పష్టం చేశారు.
THE NATIONAL HIGHWAYS FEE (DETERMINATION OF RATES AND COLLECTION) RULES, 2008 ప్రకారం, ద్విచక్ర వాహనాలకు టోల్ ఛార్జీల నుంచి మినహాయింపు ఇవ్వబడింది.

చివరిగా, 15 జూలై 2025 నుంచి ద్విచక్ర వాహనదారులు జాతీయ రహదారులపై ప్రయాణించినందుకు టోల్ ఫీజు చెల్లించాలని ప్రభుత్వం ప్రకటించలేదు.