బీహార్ రాష్ట్రంలో ఎన్నికలు జరుగబోతున్న నేపధ్యంలో, బీజేపీ నిర్వహించిన ఒక మీటింగ్ కి ప్రజలు ఎవ్వరూ హజరు కాలేదంటూ షేర్ చేస్తున్న ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఖాళీగా ఉన్న ఆ ఎలక్షన్ మీటింగ్ లో బీజేపీ నాయకులు ప్రసంగిస్తున్నప్పుడు ఒక కుక్క వారి ముందు దీనంగా నిద్రపోయి ఉండటం మనం గమనించవచ్చు. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.
క్లెయిమ్: బీహార్ రాష్ట్రంలో బీజేపీ నిర్వహించిన ఎలక్షన్ ర్యాలీ కి సంబంధించిన ఫోటో.
ఫాక్ట్ (నిజం): పోస్టులో షేర్ చేసిన ఈ ఫోటో పాతది. 2018లో తమిళనాడు రాష్ట్రంలో బీజేపీ సభ్యులు చేసిన స్ట్రీట్ ర్యాలికి సంబంధించిన ఫోటో ఇది అని విశ్లేషణలో తెలిసింది. ఈ ఫోటోకి బీహార్ లో జరుగబోతున్న ఎన్నికలకి ఎటువంటి సంబంధంలేదు. కావున, పోస్టులో చేస్తున్న ఈ క్లెయిమ్ తప్పు.
ఫోటోలో షేర్ చేసిన ఈ ఫోటోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ఇదే ఫోటోని షేర్ చేస్తూ ఒక యూసర్ 2018లో ట్వీట్ పెట్టినట్టు తెలిసింది. తమిళనాడులో బీజేపీ పరిస్థితి ఇది, అంటూ ఆ ట్వీట్ లో ఆ యూసర్ పేర్కొన్నారు.
ఈ వివరాల ఆధారంగా ఆ ఫోటోకి సంబంధించిన పూర్తి వివరాల కోసం వెతకగా, ఇదే ఫోటోని షేర్ చేస్తూ ‘Vinavu’ అనే తమిళ న్యూస్ వెబ్ సైట్ ‘03 జూలై 2018’ నాడు పబ్లిష్ చేసిన ఆర్టికల్ దొరికింది. ఆర్టికల్ లో రాసిన సమాచారం ప్రకారం, బీజేపీ తమిళనాడు రాష్ట్రంలో నిర్వహించిన ఒక స్ట్రీట్ ర్యాలికి సంబంధించిన ఫోటో ఇది అని తెలిసింది. ప్రజలు, కార్యకర్తలు లేక ఖాళీగా ఉన్న ఆ మీటింగ్ లో బీజేపీ నాయకులు ప్రసంగిస్తున్నప్పుడు, ఒక కుక్క ఇలా దీనంగా పడుకున్నట్టు ఆ ఆర్టికల్ లో తెలిపారు. ఇదే విషయాన్నీ తెలుపుతూ ‘Savvuku’ అనే తమిళ వెబ్ సైట్ వారు కూడా ఆర్టికల్ పబ్లిష్ చేసారు. ఈ వివరాల ఆధారంగా పోస్టులో షేర్ చేసిన ఈ ఫోటో తమిళనాడు కి సంబంధించింది అని ఖచ్చితంగా చెప్పవచ్చు.
చివరగా, తమిళనాడులో బీజేపీ చేసిన పాత స్ట్రీట్ ర్యాలీకి సంబంధించిన ఫోటోని చూపిస్తూ బీహార్ రాష్ట్రంలో బీజేపీ నిర్వహించిన ఎన్నికల ర్యాలి అని తప్పుగా షేర్ చేస్తున్నారు.