“పవన్ కళ్యాణ్ నాలుగో పెళ్ళాం షీలా అర్మానీ, ఆంధ్రజ్యోతి స్టింగ్ ఆపరేషన్లో బండారం బట్టబయలు” అని ఆంధ్రజ్యోతి దిన పత్రిక వార్తా కథనం ప్రచురించిది అని చెప్తూ ఒక పేపర్ క్లిప్పింగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఈ కథనం ద్వారా ఈ పేపర్ క్లిప్పింగ్కు సంబంధించిన నిజమేంటో చూద్దాం.

క్లెయిమ్: ‘పవన్ కళ్యాణ్ నాల్గవ పెళ్ళాం షీలా అర్మానీ’ అని ఆంధ్రజ్యోతి దినపత్రిక ప్రచురించిన వార్తా కథనం క్లిప్పింగ్.
ఫాక్ట్(నిజం): ఈ వైరల్ ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ క్లిప్పింగ్ ఫేక్. ఆంధ్రజ్యోతి దినపత్రిక ఈ వార్తను ప్రచురించలేదు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.
పోస్టులో షేర్ చేసిన వార్తా కథనాన్ని ‘ఆంధ్రజ్యోతి’ పత్రిక పబ్లిష్ చేసిందా అని తగిన కీవర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్లో వెతికగా, ‘ఆంధ్రజ్యోతి’ పత్రిక అటువంటి వార్తను ప్రచురించినట్లు ఎటువంటి ఆధారాలు లభించలేదు. అలాగే, ఇదే విషయాన్ని ఇతర పత్రికలు ప్రచురించినట్లు కూడా మాకు ఆధారాలు దొరకలేదు. తదుపరి మేము మీడియా సంస్థ ‘ఆంధ్రజ్యోతి’ యొక్క అధికారిక వెబ్సైట్, సోషల్ మీడియా ఖాతాలను (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ), ఈ-పేపర్లను వెతకగా, అక్కడ కూడా ‘ఆంధ్రజ్యోతి’ ఈ కథనాన్ని ప్రచురించినట్లు ఎటువంటి ఆధారాలు లభించలేదు. అయితే వైరల్ పేపర్ క్లిప్పింగ్లో పైభాగంలో ఉన్న రెండు లైన్లను ఆధారంగా, ‘ఆంధ్రజ్యోతి’ ఈ-పేపర్లో వెతకగా, ఇవే రెండు లైన్లను కలిగి ఉన్న వార్తా ‘ఆంధ్రజ్యోతి’ పత్రిక 29 ఫిబ్రవరి 2024 ఎడిషన్లోని 2వ పేజీలో వచ్చినట్లు గుర్తించాము (ఇక్కడ). ఆ రెండు లైన్లు “దేశంలో అత్యంత ధనిక పార్టీ బీజేపీ” అనే హెడ్లైన్తో ప్రచురించిన కథనానికి సంబంధించినవి. ఈ వార్తా కథనం క్రింద వైరల్ పేపర్ క్లిప్పింగ్లో ఉన్న కథనం లేదు.

‘ఆంధ్రజ్యోతి’ దినపత్రిక 29 ఫిబ్రవరి 2024 నాటి ఎడిషన్ను పరిశీలిస్తే, ఈ ఎడిషన్ 11వ పేజీలో, 28 ఫిబ్రవరి 2024న టీడీపీ-జనసేన ఉమ్మడిగా తాడేపల్లిగూడెంలో నిర్వహించిన ‘జెండా’ సభలో పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తూ,“జగన్ దృష్టిలో పవన్ కల్యాణ్ అంటే మూడు పెళ్లిళ్లు… రెండు విడాకులు. అతడు నాలుగు పెళ్లిళ్లు అంటాడు. మరి ఆ నాలుగో పెళ్లాం ఎవరో నాకు తెలియదు. అది జగనే ఏమో మరి!” అని అన్నట్లుగా రిపోర్ట్ చేయబడింది (ఇక్కడ). ఈ సమాచారం ఆధారంగా, ఈ వైరల్ ‘ఆంధ్రజ్యోతి’ న్యూస్ పేపర్ క్లిప్పింగ్ ఫేక్ అని మనం నిర్ధారించవచ్చు.

వాస్తవంగా,28 ఫిబ్రవరి 2024న టీడీపీ-జనసేన ఉమ్మడిగా తాడేపల్లిగూడెంలో నిర్వహించిన ‘జెండా’ సభలో పవన్ కళ్యాణ్ వై.ఎస్.జగన్ తన పెళ్లిళ్ల, విడాకుల గురించి చేసిన వ్యాఖ్యల పై ఆయనను విమర్శిస్తూ పలు వ్యాఖ్యలు చేశారు (ఇక్కడ, & ఇక్కడ). ఈ నేపథ్యంలోనే ఈ ఫేక్ క్లిప్పింగ్ను కొందరు సృష్టించి అప్పట్లో అనగా ఫిబ్రవరి/మార్చి 2024లో వైరల్ చేశారు (ఇక్కడ & ఇక్కడ).
చివరగా, ‘పవన్ కళ్యాణ్ నాలుగో పెళ్ళాం షీలా అర్మానీ’ అని ఆంధ్రజ్యోతి కథనం ప్రచురించలేదు. ఈ వైరల్ న్యూస్ పేపర్ క్లిప్పింగ్ ఫేక్.