12 జూన్ 2025న అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం AI 171 టేకాఫ్ అయిన కొద్ది క్షణాలకే సమీపంలో ఉన్న బీజే మెడికల్ కాలేజీ హాస్టల్ పై కూలిపోయింది. ఈ ఘటనలో విమానంలోని 241 మందితో పాటు హాస్టల్ బిల్డింగ్లో ఉంటున్న మరికొందరు చనిపోయారు. ఈ నేపథ్యంలో విమానం కూలిపోతున్నప్పటి సీసీటీవీ దృశ్యాలంటూ ఒక వీడియో (ఇక్కడ, ఇక్కడ & ఇక్కడ) సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. దీంట్లో ఎంత నిజముందో ఇప్పుడు చూద్దాం.

క్లెయిమ్: 12 జూన్ 2025న అహ్మదాబాద్లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదాన్ని చూపుతున్న వీడియో.
ఫాక్ట్: ఈ వీడియో 2024 అక్టోబర్లో లెబనాన్ దేశంలోని ఉన్న షేక్ రాఘెబ్ హర్బ్ ఆసుపత్రిపై ఇజ్రాయెల్ చేసిన దాడులను చూపుతుంది. ఈ వీడియోకి 12 జూన్ 2025న జరిగిన అహ్మదాబాద్ విమాన ప్రమాదానికి ఎటువంటి సంబంధం లేదు. కావున పోస్టులో చేయబడ్డ క్లెయిమ్ తప్పు.
ముందుగా వైరల్ వీడియోలోని దృశ్యాలను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ఇవే దృశ్యాలు కలిగి ఉన్న పూర్తి వీడియో లభించింది. ఈ వీడియోని లెబనాన్ దేశంలో ఉన్న షేక్ రాఘెబ్ హర్బ్ ఆసుపత్రి వారు తమ సోషల్ మీడియా ఖాతాల్లో (ఇక్కడ & ఇక్కడ) 05 ఫిబ్రవరి 2025లో షేర్ చేశారు.

తమ ఆసుపత్రిపై జరిగిన దాడి తర్వాత ఆసుపత్రిని పునరుద్ధరించుకొని మళ్లీ సేవలు ప్రారంభించామని ఈ వీడియోలో పేర్కొన్నారు. స్థానిక మీడియా కథనాల (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ) ప్రకారం ఈ ఆసుపత్రి, పరిసర ప్రాంతాలపై ఇజ్రాయెల్ అక్టోబర్ 2024లో పలుమార్లు దాడి చేసింది. పూర్తి వీడియోలో ఆసుపత్రి పేరుని కూడా చూడవచ్చు. ఇది లెబనాన్లోని టౌల్ అనే పట్టణంలో ఉంది.

పై ఆధారాలను బట్టి వైరల్ వీడియో 12 జూన్ 2025లో జరిగిన అహ్మదాబాద్ విమాన ప్రమాదానికి సంబంధించినది కాదని నిర్ధారించవచ్చు. అహ్మదాబాద్ విమాన ప్రమాద దృశ్యాలంటూ మరికొన్ని సంబంధం లేని ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. వాటికి సంబంధించిన ఫాక్ట్- చెక్ కథనాలను ఇక్కడ చూడవచ్చు.
చివరిగా, అహ్మబాబాద్ విమాన ప్రమాద దృశ్యాలంటూ లెబనాన్ దేశపు పాత వీడియోని షేర్ చేస్తున్నారు.