‘బంగ్లాదేశ్లోని సునమ్గంజ్లో ముస్లింలు హిందూ యువకుడు జానీ సర్కార్ను అతని ఇంటి నుండి పిలిచి, అతన్ని చంపి, అతని మృతదేహాన్ని ఒక సంచిలో నింపి, కాలువలో పడేశారు.😪😭😡 హిందువుల ప్రాణాలకు రక్షణ లేదు.,’ అని చెప్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో షేర్ చేయబడుతుంది. అలాగే, ఈ వార్తలో ఎంత నిజముందో నిర్థారించాలని కోరుతూ మా వాట్సాప్ టిప్లైన్కు (+91 9247052470) కూడా పలు అభ్యర్ధనలు వచ్చాయి. అసలు, ఈ క్లెయిమ్ వెనుక ఎంత నిజం ఉందో ఈ ఆర్టికల్ ద్వారా చూద్దాం.

క్లెయిమ్: బంగ్లాదేశ్లో జానీ సర్కార్ అనే యువకుడిని ముస్లింలు చంపి, అతని మృతదేహాన్ని వైరల్ వీడియోలో కనిపిస్తున్న విధంగా ఒక సంచిలో పెట్టి, ఒక కాలువలో పడేశారు.
ఫ్యాక్ట్: బంగ్లాదేశ్లోని నారయణ్గంజ్లో, మాదక ద్రవ్యాలకు బానిసైన జానీ సర్కార్ అనే యువకుడిని, అతని సొంత తల్లిదండ్రులైన కరుణ రాయ్ సర్కార్, అనిత రాణి సర్కార్ హతమార్చారని ఆ దేశ పోలీసులు మీడియాకు తెలిపారు. వైరల్ క్లెయిమ్ తప్పు అని, ఇందులో ఎటువంటి మతపరమైన కోణం లేదని బంగ్లాదేశ్ ప్రభుత్వం యొక్క ఫ్యాక్ట్-చెక్ విభాగం ‘CA Press Wing Facts’ ఫేస్బుక్ ద్వారా స్పష్టం చేసింది. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.
ఈ క్లెయిమ్ వెనుక ఉన్న నిజానిజాలు తెలుసుకోవడానికి, వైరల్ వీడియోలోని కొన్ని కీఫ్రేమ్స్ ఉపయోగించి ఇంటర్నెట్లో రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతకగా, వైరల్ వీడియో గురించి ప్రస్తావిస్తూ బంగ్లాదేశ్ ప్రభుత్వ ఫ్యాక్ట్-చెక్ పేజీ ‘CA Press Wing Facts’ చేసిన పోస్ట్ ఒకటి దొరికింది.

దీని ప్రకారం, ఈ సంఘటనలో ఎటువంటి మతపరమైన కోణం లేదు. మాదక ద్రవ్యాలకు బానిసైన జానీ సర్కార్ అనే 25 ఏళ్ల యువకుడిని, తన తల్లిదండ్రులు హతమార్చారని, ఈ సంఘటన బంగ్లాదేశ్లోని నారయణ్గంజ్లోని ఫాతుల్లా మోడల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిందని ఈ పోస్టులో వారు పేర్కొన్నారు.
ఈ విషయాన్ని నిర్ధారించుకోవడానికి, తగిన కీవర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్లో వెతకగా, ఈ సంఘటనకు సంబంధించి 19 జూన్ 2025న ప్రచురించిన అనేక వార్తా కథనాలు (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ) మాకు లభించాయి.

ఈ కథనాల ప్రకారం, నారయణ్గంజ్లోని ఉన్న లాల్ఖా అనే ప్రదేశంలో జానీ సర్కార్ తన తల్లిదండ్రులతో నివసించేవాడు. జానీ డబ్బు కోసం తరచూ తన ఇంట్లో వస్తువులు పగలగొట్టేవాడు, అలాగే డబ్బు ఇవ్వలేదని తన తల్లిదండ్రులను కూడా తరచుగా కొట్టేవాడు.

దీన్ని భరించలేక 16 జూన్ 2025న జానీ సర్కార్ నిద్రపోతున్నప్పుడు అతని తండ్రి కరుణ సర్కార్ జానీ తలపై కొట్టి, గొంతు నులిమి చంపేశాడు. తర్వాత కరుణ సర్కార్ తన భార్య అనిత రాణి సర్కార్ సహాయంతో జానీ మృతదేహాన్ని ఒక సంచిలో పెట్టి ఒక కాలువలో పడేశాడు అని పోలీసులు మీడియాకు తెలిపినట్లు వార్తా కథనాలు పేర్కొన్నాయి. ఇందులో మతపరమైన కోణం ఉన్నట్లు ఈ వార్తా కథనాల్లో ఎక్కడా పేర్కొనలేదు.
ఈ సంఘటనపై ‘Channel 24’ వారు ప్రచురించిన ఒక వీడియో రిపోర్టులో, ఈ సంఘటనకు సంబంధించి పోలీసు వారు విడుదల చేసిన CCTV ఫుటేజీ ఉంది. నారయణ్గంజ్ పోలీసు వారు తమ ఫేస్బుక్ పేజీలో కూడా ఈ సంఘటనకు చెందిన వివరాలను పోస్ట్ చేశారు.

అలాగే, బాంగ్లాదేశ్ ఫ్యాక్ చెక్ సంస్థ అయిన ‘Rumour Scanner’ ఈ క్లెయిమ్ తప్పు అని, ఇందులో ఎటువంటి మతపరమైన కోణం లేదని పేర్కొంటూ 21 జూన్ 2025న ఒక ఫ్యాక్ట్-చెక్ ఆర్టికల్ను ప్రచురించింది.
చివరగా, వైరల్ క్లెయిములో చెప్తున్న విధంగా, జానీ సర్కార్ ముస్లింల చేతిలో హతమవ్వలేదు, అతని స్వంత తల్లిదండ్రులే చంపారు.