Fake News, Telugu
 

బీజేపీ జాతీయ జెండా రంగును మార్చి, ఆపరేషన్ సిందూర్ ర్యాలీ నిర్వహించిందని చెప్తూ ఒక ఎడిట్ చేసిన వీడియోని షేర్ చేస్తున్నారు

0

జాతీయ జండా రంగు మార్చేసి ,,ఆపరేషన్ సిందూర్ ర్యాలీ నిర్వహిస్తున్న బీజేపీ నాయకులు, జాతీయ జండాను అవమానించటం దేశ ద్రోహం కాదా’ అని అంటూ ఒక ర్యాలీలో ఒకతను తీసుకున్న సెల్ఫీ వీడియో (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ) ఒకటి సోషల్ మీడియాలో షేర్ చేయబడుతోంది. ఈ వీడియోలో మన దేశ జండాలో ఉండే పచ్చ రంగు డీశాచురేటెడ్‌గా (కాస్త నలుపుగా) ఉండటం మనం గమనించవచ్చు. ఈ క్లెయిముని వెరిఫై చేయమని ఫ్యాక్ట్‌లీ వాట్సాప్ టిప్‌లైన్‌కు కూడా కొందరు మెసేజ్ పంపారు. ఈ క్లెయిమ్ వెనుక ఉన్న నిజానిజాలు ఏంటో ఈ ఆర్టికల్ ద్వారా చూద్దాం.   

ఈ క్లెయిమ్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ మీరు ఇక్కడ చూడవచ్చు

క్లెయిమ్: బీజేపీ జాతీయ జెండా రంగును మార్చి, ఆపరేషన్ సిందూర్ ర్యాలీ నిర్వహించిన సంఘటన వీడియో. 

ఫ్యాక్ట్(నిజం): ఇది 17 మే 2025న హైదరాబాద్‌లోని ట్యాంక్ బండ్‌ వద్ద బీజేపీ నిర్వహించిన తిరంగా ర్యాలీ/యాత్రలో తీసిన వీడియో. ర్యాలీకి సంబంధించి బీజేపీ నేతలు, మీడియా సంస్థలు పోస్ట్ చేసిన వీడియోలలో ఎక్కడా కూడా జెండా రంగు మార్చినట్టుగా కనిపించలేదు. వైరల్ వీడియోని ముందుగా దుర్గా రావు అనే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అప్లోడ్ చేశారు. తను ఈ వీడియోని డిజిటల్ టూల్స్ ఉపయోగించి కలర్ గ్రేడ్ చేసి ఎడిట్ చేసినట్లు మనకు ఈ వీడియోను అసలు ర్యాలీ వీడియోలతో పోల్చి చూస్తే స్పష్టం అవుతుంది. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

ఈ క్లెయిమ్ వెనుక ఉన్న నిజానిజాలు తెలుసుకోవడానికి వైరల్ వీడియోలోని కొన్ని కీఫ్రేమ్స్ ఉపయోగించి ఇంటర్నెట్లో రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి చూడగా, ఈ వీడియోని ‘Tik Tok Durga Rao’ అనే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అప్లోడ్ చేశారని మాకు తెలిసింది. తను ఈ వీడియోను తన ఇన్స్టాగ్రామ్, ఫేస్‌బుక్ ప్రొఫైల్స్‌లో అప్లోడ్ చేశారు.

ఈ వీడియోను మేము సరిగ్గా చూడగా, అందులో దుర్గా రావు వెనుక ఉన్న రోడ్డుపై ఒక వాహనంలో భారత మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఉన్నారని మేము గమనించాము. 

దీని ఆధారంగా, తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల బీజేపీ నిర్వహించిన ర్యాలీలలో వెంకయ్య నాయుడు పాల్గొన్న ర్యాలీల కోసం తగిన కీవర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్లో వెతికాము. ఈ సెర్చ్ ద్వారా 17 మే 2025 ఆపరేషన్‌ సింధూర్‌ విజయాన్ని పురస్కరించుకుని సరిహద్దుల్లో దేశం కోసం పోరాడుతున్న సైనికులకు సంఘీభావం తెలుపుతూ, హైదరాబాద్‌లోని ట్యాంక్ బండ్‌ వద్ద బీజేపీ తెలంగాణ ఒక తిరంగా ర్యాలీ/యాత్రను నిర్వహించిందని మేము కనుగొన్నాము (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ).

ఈ ర్యాలీలో వెంకయ్య నాయుడు పాల్గొన్నారు, బీజేపీ తెలంగాణ తమ అధికారిక యూట్యూబ్ ఛానల్‌లో పోస్ట్ చేసిన ఈ యాత్ర వీడియోలో తను వైరల్ వీడియోలో కనిపిస్తున్న వాహనంపై ప్రయాణించడం మనం చూడవచ్చు(ఇది కూడా చూడండి). 

ఇదే ర్యాలీకు చెందిన కొన్ని ఫోటోలు వెంకయ్య నాయుడు ‘X’లో పోస్ట్ చేశారు. ఈ ఫోటోలలో కూడా మనం ఆయన వైరల్ వీడియోలో కనిపిస్తున్న వాహనంలో రావడం చూడవచ్చు.

ఈ ర్యాలీలో తీసిన మరికొన్ని వీడియోలను వైరల్ వీడియోని మొదట పోస్ట్ చేసిన దుర్గా రావు తన ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఛానల్‌లో పోస్ట్ చేశారు (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ). ఈ వీడియోల వివరణలో ఇది తిరంగా ర్యాలీకి చెందిన వీడియో అని తను పేర్కొన్నారు. దీని బట్టి వైరల్ వీడియో 17 మే 2025న జరిగిన తిరంగా ర్యాలీలో తీసిందేనని స్పష్టం అవుతుంది.

అయితే, తను అప్లోడ్ చేసిన ఈ వీడియోలలో కానీ, బీజేపీ తెలంగాణ, మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మంత్రి కిషన్ రెడ్డి తదితర బీజేపీ నాయకులు ఇంకా మీడియా సంస్థలు అప్లోడ్ చేసిన తిరంగా ర్యాలీ ఫోటోలు, వీడియోలలో (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ) ఎక్కడా కూడా జాతీయ జెండా రంగు మారినట్లు లేదు. 

వైరల్ వీడియోను మనం సరిగ్గా గమనిస్తే, జండా రంగు ఒక్కటే కాదు, చెట్లకు ఉన్న పువ్వులు, ఆకులు, వ్యక్థుల దుస్తులు ఆకాశం అన్నిటి రంగులు కొంచెం తేడాగా ఉండటం మనం గమనించవచ్చు. ముఖ్యంగా, ఇందులో ఆరెంజ్, శాఫ్రాన్, ఎరుపు రంగులు కాస్త ఎక్కువ శాచురేటెడ్‌గా ఉండటం మనం చూడవచ్చు. అదే విదంగా పచ్చ రంగు కాస్త నలుపుగా లేదా డీశాచురేటెడ్‌గా కనిపించడం కూడా మనం గమనించవచ్చు. డిజిటల్ టూల్స్ ఉపయోగించి వీడియో ఫుటేజీని కలర్ గ్రేడ్ చేసి, ఈ విధంగా కనిపించేలా ఎడిట్ చేయవచ్చు. వైరల్ వీడియోని ముందుగా అప్లోడ్ చేసిన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ దుర్గా రావు కూడా ఈ విధంగా చేసి ఉంటారు, లేదా రంగులు ఈ విధంగా కనిపించేలా చేసే డిజిటల్ ఫిల్టర్ ఏదైనా ఉపయోగించి ఉండవచ్చు. 

ఉదాహరణకు, వెంకయ్య నాయుడు ‘X’లో పోస్టు చెసిన ఈ ర్యాలీ ఫోటోను మేము ఇదే విధంగా ఎడిట్ చేయగా, జండా రంగులు వైరల్ వీడియోలో కనిపిస్తున్నట్లు గానే ఉన్నాయి.

చివరగా, బీజేపీ జాతీయ జెండా రంగును మార్చి, ఆపరేషన్ సిందూర్ ర్యాలీ నిర్వహించిందని చెప్తూ ఒక ఎడిట్ చేసిన వీడియోని షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll