12 జూన్ 2025న, ఎయిర్ ఇండియా ఫ్లైట్ AI 171, బోయింగ్ 787-8 డ్రీమ్లైనర్, అహ్మదాబాద్ నుండి లండన్ గాట్విక్కు వెళుతుండగా కూలిపోయింది. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే విమానం తన ఆల్టిట్యూడ్ కోల్పోయి, విమానాశ్రయానికి సమీపంలోని మేఘనినగర్ ప్రాంతంలో కూలిపోయింది (ఇక్కడ, ఇక్కడ). భారతదేశం, UK, పోర్చుగల్, కెనడా జాతీయులతో సహా 240 మందికి పైగా ప్రయాణికులు విమానంలో ప్రమాదం సమయంలో ఉన్నారు (ఇక్కడ).
ఈ సందర్భంలో, అహ్మదాబాద్ విమాన ప్రమాదానికి ముందు దృశ్యాలను చూపిస్తున్న వీడియో అని క్లెయిమ్ చేస్తూ, ఒక విమానంలో నుంచి ఒక ప్రయాణికుడు తీసిన వీడియో (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ) ఒకటి సోషల్ మీడియాలో షేర్ చేయబడుతోంది. అసలు ఈ క్లెయిమ్ వెనుక ఎంత నిజం ఉందో ఈ ఆర్టికల్ ద్వారా చూద్దాం.

క్లెయిమ్: 12 జూన్ 2025న అహ్మదాబాద్లో కూలిపోయిన ఎయిర్ ఇండియా విమానం క్రాష్ అవడానికి ముందు విమానంలోని ప్రయాణికుల చివరి క్షణాలను చూపిస్తున్న వీడియో.
ఫ్యాక్ట్(నిజం): ఈ వీడియో జనవరి 2023లో నేపాల్లో జరిగిన యెటి ఎయిర్లైన్స్ ప్రమాదానికి సంబంధించినది. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.
వైరల్ క్లెయిమ్ వెనుక ఉన్న నిజానిజాలు తెలుసుకోవడానికి, వైరల్ వీడియోలోని కీఫ్రేమ్లను ఉపయోగించి ఇంటర్నెట్లో రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేశాము. ఈ సెర్చ్ ద్వారా, వైరల్ వీడియోలోని ఫుటేజ్ను కలిగి ఉన్న జనవరి 2023 నాటి కొన్ని వార్తా కథనాలు మాకు లభించాయి (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ). దీన్ని బట్టి, ఈ వీడియో 12 జూన్ 2025న జరిగిన అహ్మదాబాద్ విమాన ప్రమాదానికి ముందు జరిగిన సంఘటనకు చెందిని అని మనకు స్పష్టం అవుతుంది. వార్తా కథనాల ప్రకారం, ఈ వీడియో 15 జనవరి 2023న జరిగిన యెటి ఎయిర్లైన్స్ ఫ్లైట్ 691 క్రాష్ నాటిది. ఈ విమానం ఖాట్మండు నుండి నేపాల్లోని పోఖారాకు ప్రయాణిస్తున్నప్పుడు ఈ ప్రమాదం జరిగింది.

ఈ విమానం(ATR 72) ల్యాండింగ్కు కొద్దిసేపటి ముందు, అప్పట్లో కొత్తగా ప్రారంభించబడిన పోఖారా అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో ఒక లోయలోకి కూలిపోయింది. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న 72 మంది మరణించారు. ప్రయాణీకులలో సోను జైస్వాల్ అనే భారతీయుడు కూడా ఒకడు. ఉత్తర ప్రదేశ్కు చెందిన ఆయన, ప్రమాదానికి కొన్ని క్షణాల ముందు ఫేస్బుక్లో ఒక ప్రత్యక్ష ప్రసారం (లైవ్) చేశాడు. ఈ వీడియోలో ప్రశాంతమైన క్యాబిన్ వాతావరణాన్ని ఆ తర్వాత జరిగిన ప్రమాదం మూలంగా లోపల చెలరేగిన మంటలను, ప్రజల అరుపులను గమనించవచ్చు. నేపాల్లో జరిగిన అత్యంత ఘోరమైన విమానయాన విపత్తుగా ఇది మిగిలిపోయింది.

అదనంగా, వైరల్ వీడియోని ఉద్దేశిస్తూ, అహ్మదాబాద్ విమాన ప్రమాదంతో తప్పుగా ముడిపెడుతూ, ఒక పాత వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయబడుతుందని పేర్కొంటూ PIB ఫ్యాక్ట్ చెక్ చేసిన X పోస్ట్ను మేము కనుగొన్నాము. ఈ వీడియో జనవరి 2023లో నేపాల్లో జరిగిన విమాన ప్రమాదానికి సంబంధించినదని వాళ్లు కూడా స్పష్టం చేశారు. ఖచ్చితమైన సమాచారం కోసం అధికారిక మాధ్యమాలలో మాత్రమే ఆధారపడాలని ఈ పోస్ట్ ద్వారా PIB ఫ్యాక్ట్ చెక్ ప్రజలను కోరింది.
చివరగా, 12 జూన్ 2025న అహ్మదాబాద్లో కూలిపోయిన ఎయిర్ ఇండియా విమానంలోని ప్రయాణికుల చివరి క్షణాలు అని ఒక పాత, సంబంధం లేని వీడియోను షేర్ చేస్తున్నారు