పాకిస్తాన్లో అతి పెద్ద ప్రావిన్స్ అయిన బలోచిస్తాన్ పాకిస్తాన్ నుంచి విడిపోయి స్వతంత్ర దేశంగా ఏర్పడుతున్నట్లు 09 మే 2025న బలోచిస్తాన్ వేర్పాటువాద ప్రతినిధి, రచయిత, జర్నలిస్ట్, మానవహక్కుల కార్యకర్తగా చెప్పుకున్న మీర్ యార్ బలోచ్ Xలో పోస్టు చేశారు. బలోచిస్తాన్ని స్వతంత్ర దేశంగా గుర్తించాలని ఐక్యరాజ్య సమితి, భారత్, ఇతర దేశాలకు ఆయన విజ్ఞప్తి చేశారు. బలోచిస్తాన్లో ప్రస్తుతం ఉన్న పాకిస్తాన్ ప్రభుత్వం కూలిపోతుందని, ఆ స్థానంలో స్వతంత్ర బలోచిస్తాన్ యొక్క కొత్త ప్రభుత్వం ఏర్పాటవుతుందని ఆయన చెప్పారు. అయితే, బలోచిస్తాన్ని స్వతంత్ర దేశంగా గుర్తిస్తూ భారత్, ఐక్యరాజ్య సమితి ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఈ నేపథ్యంలో, “బలోచిస్తాన్ తర్వాత, ఇప్పుడు పాకిస్తాన్లోని సింధ్ ప్రావిన్స్ ప్రజలు స్వాతంత్య్రం కోసం పోరాటం చేస్తున్నారు” అంటూ ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఈ కథనం ద్వారా ఈ వీడియోకు సంబంధించిన నిజమేంటో చూద్దాం.

క్లెయిమ్: పాకిస్తాన్లోని సింధ్ ప్రావిన్స్ ప్రజలు స్వతంత్ర సింధుదేశం ఏర్పాటు కోసం నిరసన చేస్తున్న దృశ్యాలు.
ఫాక్ట్(నిజం): ఈ వైరల్ వీడియోలోని దృశ్యాలు సింధు (Indus) నదిపై ఆరు కొత్త కాలువల నిర్మాణానికి వ్యతిరేకంగా ఫిబ్రవరి 2025లో సింధ్ ప్రావిన్స్ లో జరిగిన ఒక నిరసనను చూపిస్తుంది. అయితే, రిపోర్ట్స్ ప్రకారం సింధ్ ప్రావిన్స్ ప్రజలు స్వతంత్ర సింధుదేశం డిమాండ్ చేస్తూ పలు నిరసన ప్రదర్శనలు చేశారు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.
ఈ వైరల్ వీడియోకు సంబంధించిన సమాచారం కోసం, వైరల్ వీడియో యొక్క కీఫ్రేములను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ఇవే దృశ్యాలు కలిగిన అధిక నిడివి గల వీడియోను ఫిబ్రవరి 2025లో పలువురు సోషల్ మీడియాలో షేర్ చేసినట్లు మేము కనుగొన్నాము (ఇక్కడ, ఇక్కడ). ఈ పోస్టులో ఒకదాని వివరణ బట్టి ఈ వైరల్ వీడియోలోని దృశ్యాలు సింధు (Indus) నదిపై ఆరు కొత్త కాలువల నిర్మాణానికి వ్యతిరేకంగా ఫిబ్రవరి 2025లో సింధ్ ప్రావిన్స్ లో జరిగిన ఒక నిరసనను చూపిస్తుంది అని తెలిసింది.
వార్త కథనాల ప్రకారం, (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ) ప్రకారం, 23 ఫిబ్రవరి 2025న, సింధు నదిపై కొత్త కాలువల నిర్మాణ ప్రాజెక్టు వ్యతిరేకంగా సింధ్లో పలు నిరసనలు జరిగాయి, అలాగే ఈ నిరసనల్లో భాగంగా పలు రహదారులు కూడా బ్లాక్ చేయబడ్డాయి. సింధు నదిపై ఆరు కొత్త కాలువల నిర్మాణం వల్ల సింధ్ ప్రావిన్స్ నీటి వనరులకు ముప్పు ఉందని పేర్కొంటూ సింధ్ జాతీయవాద పార్టీలు ఈ నిరసనలు చేపట్టాయి. ఇదే సమయంలో కనిపించకుండా పోయిన న్యాయవాది అమీర్ అలీ ఉమ్రానీని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ, జై సింధ్ మహాజ్ షహీద్ బెనజీరాబాద్లోని జాతీయ రహదారిని దిగ్బంధించింది అని ఈ రిపోర్ట్స్ పేర్కొన్నాయి.

ఈ వార్త కథనాల్లో కనిపిస్తున్న భవనం అలాగే వైరల్ వీడియోలో కనిపిస్తున్న భవనం ఒకేలా ఉండటం మనం గమనించవచ్చు. అలాగే వైరల్ వీడియోలో అడ్వకేట్ అమీర్ ఉమ్రానీని విడుదల చేయాలి (Release Advocate Aamir Umrani) అనే బ్యానర్ ప్రదర్శించడం మనం చూడవచ్చు. దీన్ని బట్టి ఈ వైరల్ వీడియో పాకిస్తాన్లోని సింధ్ ప్రావిన్స్ ప్రజలు స్వతంత్ర సింధుదేశం ఏర్పాటు కోసం నిరసన చేస్తున్న దృశ్యాలను చూపించడం లేదని మనం నిర్ధారించవచ్చు.

వార్తా కథనాల ప్రకారం (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ), సింధ్ ప్రావిన్స్ లో స్వతంత్ర సింధుదేశం ఏర్పాటును డిమాండ్ చేస్తూ పలు నిరసన ప్రదర్శనలు జరిగాయి.
చివరగా, పాకిస్తాన్లోని సింధ్ ప్రావిన్స్ ప్రజలు స్వతంత్ర సింధుదేశం కోసం నిరసన చేస్తున్న దృశ్యాలంటూ సంబంధంలేని ఫిబ్రవరి 2025 నాటి వీడియోను షేర్ చేస్తున్నారు.