2021-22 బడ్జెట్ ద్వారా కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలు పెంచలేదు

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2021-22 బడ్జెట్ లో పెట్రోల్ ధర రూ.2.5 మరియు డీజిల్ ధర రూ.4 పెంచారని చెప్తున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2021-22 బడ్జెట్ లో పెట్రోల్ ధర రూ.2.5 మరియు డీజిల్ ధర రూ.4 పెంచారు.

ఫాక్ట్ (నిజం): కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2021-22 బడ్జెట్ లో పెట్రోల్ మరియు డీజిల్ పై Agriculture Infrastructure and Development Cess (AIDC) పేరుతో లీటర్ పెట్రోల్ పై రూ.2.5 మరియు లీటర్ డీజిల్ పై రూ.4 సెస్ విధించారు. ఐతే ఈ భారం వినియోగదారుడిపై పడకుండా సాధారణంగా పెట్రోల్ మరియు డీజిల్ పై విధించే బేసిక్ ఎక్సైజ్ Basic excise duty (BED) మరియు Special Additional Excise Duty (SAED) రేట్లను కొత్తగా విధించిన సెస్ కి అనుగుణంగా తగ్గించారు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించేలా ఉంది.

01 ఫిబ్రవరి 2021న కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో పెట్రోల్ మరియు డీజిల్ పై Agriculture Infrastructure and Development Cess (AIDC) విధించారు. ఈ సెస్ లీటర్ పెట్రోల్ పై రూ. 2.5 మరియు లీటర్ డీజిల్ పై రూ. 4 ఐతే ఈ భారం వినియోగదారుడిపై పడకుండా సాధారణంగా పెట్రోల్ మరియు డీజిల్ పై విధించే బేసిక్ ఎక్సైజ్ Basic excise duty (BED) మరియు Special Additional Excise Duty (SAED) రేట్లను కొత్తగా విధించిన సెస్ కి అనుగుణంగా తగ్గించారు.

ఇంతకుముందు లీటర్ పెట్రోల్ పై రూ. 2.98 మరియు రూ. 12.00 గా ఉన్న Basic excise duty (BED) మరియు Special Additional Excise Duty (SAED) ఇప్పటినుండి రూ. 1.4 మరియు రూ. 11.00 గా ఉండబోతోంది. అదేవిధంగా లీటర్ డీజిల్ పై రూ. 4.83 మరియు రూ. 9.00 గా ఉన్న Basic excise duty (BED) మరియు Special Additional Excise Duty (SAED) ఇప్పటినుండి రూ. 1.8 మరియు రూ. 8.00 గా ఉండబోతోంది.

బడ్జెట్ లో ప్రవేశపెట్టిన కొత్త సెస్ వల్ల వినియోగదారుడిపై ఎటువంటి భారం అదనపు భారం పడదు, కాకపోతే దీనివల్ల రాష్టాలకు వచ్చే ఆదాయంలో కొంత కోత పడుతుంది. సాధారణంగా పెట్రోల్ మరియు డీజిల్ పై కేంద్ర ప్రభుత్వం బేసిక్ ఎక్సయిజ్ డ్యూటీ + స్పెషల్ అడిషనల్ ఎక్సయిజ్ డ్యూటీ + రోడ్ & ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెస్ విధిస్తుంది, ఇప్పుడు అదనంగా అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ సెస్స్ (AIDC)ని చేర్చింది. ఐతే ఈ నాలుగింటిలో స్పెషల్ అడిషనల్ ఎక్సయిజ్ డ్యూటీ, రోడ్ & ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెస్  మరియు అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ సెస్స్ రూపంలో వసూలు చేసే పన్నులు పూర్తిగా కేంద్రానికే వెళ్తాయి, వీటిలో రాష్ట్రాలకు ఎటువంటి వాటా ఉండదు. సింపుల్ గా చెప్పాలంటే పైన టేబుల్ లో ఇచ్చిన వివరాలలో పెట్రోల్ పై వసూలు చేసే టాక్స్ లో రూ. 31.5 మరియు డీజిల్ పై వసూలు చేసే టాక్స్ లో  రూ.30 పూర్తిగా కేంద్రానికే చెందుతుంది. కేవలం బేసిక్ ఎక్సయిజ్ డ్యూటీ రూపంలో వసూలు చేసే దాంట్లో  41%  ఫైనాన్స్ కమిషన్ సిఫారసు మేరకు ఒక్కో రాష్ట్రానికి ఒక్క నిష్పత్తిలో పంచుతారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే బడ్జెట్ ప్రతిపాదనలలో ఇంతకు ముందురూ.2.98  గా ఉన్న బేసిక్ ఎక్సయిజ్ డ్యూటీని ఇప్పుడు రూ.1.4 కి తగ్గించడంతో  వీటి నుండి రాష్ట్రాలకు వచ్చే ఆదాయం కూడా తగ్గనుంది.

పెట్రోల్ పై విధించే టాక్స్ లో కేంద్ర మరియు రాష్ట్ర వాటా, ఇంకా పెట్రోల్ పై టాక్స్ లకి సంబంధించి FACTLY రాసిన కథనాలు ఇక్కడ మరియు ఇక్కడ చూడొచ్చు.

ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో పెట్రోల్ మరియు డీజిల్ పై Agriculture Infrastructure and Development Cess (AIDC) విధించిన నేపథ్యంలో ఇలాంటి తప్పుదోవ పట్టించే వార్తలు సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ చేస్తున్నారు.

చివరగా, 2021-22 బడ్జెట్ ద్వారా కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలు పెంచలేదు.

సవరణ (JULY 01, 2021): ఇంతకు ముందు ఈ ఆర్టికల్ లో పెట్రోల్ మరియు డీజిల్ పై కేంద్ర ప్రభుత్వం వసూలు చేస్తున్న బేసిక్ ఎక్సయిజ్ డ్యూటీ మరియు స్పెషల్ అడిషనల్ ఎక్సయిజ్ డ్యూటీ మొత్తం రాష్ట్ర ప్రభుత్వాలకు పంచే డివిజబుల్ పూల్ లోకి వెళ్తుంది అని తప్పుగా పేర్కొనడం జరిగింది. కానీ 2002 ఫైనాన్స్ ఆక్ట్ ద్వారా ప్రవేశపెట్టిన స్పెషల్ అడిషనల్ ఎక్సయిజ్ డ్యూటీ డివిజబుల్ పూల్ లోకి రాదు, ఇందులో రాష్ట్రాలకు ఎటువంటి వాటా ఉండదు. కావున ఈ ఆర్టికల్ లోని వివరాలన్నీ అందుకు అనుగుణంగా మార్చటం జరిగింది. ఈ పొరపాటుకు చింతిస్తున్నాం.