సంబంధం లేని పాత వీడియోని పశ్చిమ బెంగాల్ ఎన్నికల సందర్భంగా చోటుచేసుకున్న ఉద్రిక్త పరిస్థితుల దృశ్యాలని షేర్ చేస్తున్నారు

YouTube Poster

పశ్చిమ బెంగాల్ ఎన్నికల సందర్భంగా పోలింగ్ బూత్ పై దాడికి దిగిన అల్లరి మూకలని కేంద్ర బలగాలు అదుపు చేస్తున్న దృశ్యాలు, అంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో షేర్ అవుతుంది. నాలుగు బాంబులు ఎనిమిది బుల్లెట్లు లేనిదే పశ్చిమ బెంగాల్ లో ఎన్నికలు ఎలా జరుగుతాయని ఈ పోస్టులో క్లెయిమ్ చేస్తున్నారు. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ని ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: పశ్చిమ బెంగాల్ లో పోలింగ్ బూత్ పై దాడికి దిగిన అల్లరి మూకలని కేంద్ర బలగాలు అదుపు చేస్తున్న దృశ్యాలు.

ఫాక్ట్ (నిజం): వీడియోలో కనిపిస్తున్న ఈ ఘటన 2019లో మణిపూర్ రాష్ట్రంలోని ఇంఫాల్ ఈస్ట్ జిల్లాలో చోటుచేసుకుంది. ఇన్నర్ మణిపూర్ పార్లమెంట్ సీట్ కోసం 2019లో జరిగిన ఎన్నికలలో, Kyamgei Muslim Makha Leikaik  పోలింగ్ బూత్ ఎన్నికల అధికారి రిగ్గింగ్ కి సహకరిస్తున్నారనే అనుమానంతో అక్కడి వోటర్లు ఇలా పోలింగ్ బూత్ పై దాడికి దిగినట్టు తెలిసింది. ఈ వీడియో పశ్చిమ బెంగాల్ ఎన్నికలకి సంబంధించింది కాదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

పోస్టులో షేర్ చేసిన ఈ వీడియో యొక్క స్క్రీన్ షాట్లని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతికితే, ఇవే దృశ్యాలు కలిగిన వీడియోని ‘The New Indian Express’ న్యూస్ సంస్థ 18 ఏప్రిల్ 2019 నాడు తమ యూట్యూబ్ ఛానెల్లో పబ్లిష్ చేసినట్టు తెలిసింది. ‘India Elections 2019: Violence disrupts polling in Inner Manipur’ అనే టైటిల్ తో ఈ వీడియోని యూట్యూబ్ లో పబ్లిష్ చేసారు. 2019లో ఇన్నర్ మణిపూర్ పార్లమెంట్ సీట్ కోసం జరిగిన ఎన్నికలలో ఈ ఘటన చోటుచేసుకున్నట్టు వివరణలో తెలిపారు. మణిపూర్ లోని Kyamgei Muslim Makha Leikaik పోలింగ్ బూత్ పై వోటర్లు దాడికి దిగడంతో CRPF జవాన్లు వారిని అదుపు చేయడానికి బ్లాంక్ ఫైర్ చేసినట్టు ఈ వీడియోలో రిపోర్ట్ చేసారు. ఇదే విషయాన్నీ రిపోర్ట్ చేస్తూ ‘India Today’ ఈ వీడియోని తమ యూట్యూబ్ ఛానెల్లో పబ్లిష్ చేసింది.

మణిపూర్ పోలింగ్ బూత్ పై జరిగిన ఈ దాడి గురించి పూర్తి వివరాలు తెలుపుతూ NDTV 18 ఏప్రిల్ 2019 నాడు ఒక ఆర్టికల్ పబ్లిష్ చేసింది. మణిపూర్ ఇంఫాల్ ఈస్ట్ జిల్లాలోని Kyamgei High Madrassa పోలింగ్ బూత్  ఎన్నికల అధికారి రిగ్గింగ్ కి సహాయం చేస్తున్నారనే అనుమానంతో అక్కడి వోటర్లు, పోలింగ్ బూత్ పై దాడికి దిగినట్టు ఈ ఆర్టికల్ లో తెలిపారు. పోలింగ్ బూత్ లోని EVM మెషిన్లని, VVPAT మెషీన్లని, CCTV కెమెరాలని వోటర్లు ద్వంసం చేసినట్టు ఈ ఆర్టికల్ లో తెలిపారు.

పశ్చిమ బెంగాల్ కోచ్ బిహార్ జిల్లాలో 10 ఏప్రిల్ 2021 నాడు జరిగిన నాలుగో దశ ఎన్నికల పోలింగ్ లో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. సీతల్‌కూచి పోలింగ్‌ బూత్ లో అల్లర్లు సృష్టించిన గ్రామస్తులపై భద్రత బలగాలు కాల్పులు జరుపడంతో నలుగురు మృతి చెందినట్టు న్యూస్ ఆర్టికల్స్ రిపోర్ట్ చేసాయి.  కాని, పోస్టులో షేర్ చేసిన వీడియో ఈ ఘటనకి సంబంధించింది కాదు.

చివరగా, సంబంధం లేని పాత వీడియోని షేర్ చేస్తూ పశ్చిమ బెంగాల్ ఎన్నికల సందర్భంగా పోలింగ్ బూత్లలో చోటుచేసుకున్న ఉద్రిక్త పరిస్థితుల దృశ్యాలని షేర్ చేస్తున్నారు.