అప్పటి తూర్పు మరియు పశ్చిమ పాకిస్తాన్ మధ్య కారిడార్ కోసం జిన్నా చేసిన ప్రతిపాదనను గాంధీ అంగీకరించినట్లు చెప్పడానికి ఎటువంటి ఆధారాలు లేవు

“నాథురాం గాడ్సే గొప్ప దేశభక్తుడు, అప్పటి తూర్పు పాకిస్తాన్(బంగ్లాదేశ్) మరియు పశ్చిమ పాకిస్తాన్ పశ్చిమ పాకిస్తాన్ (ప్రస్తుత పాకిస్థాన్) మధ్య కారిడార్ కోసం జిన్నా చేసిన ప్రతిపాదనను గాంధీ అంగీకరించాడని అందుకే గాడ్సే గాంధీని చంపాడు” అని చెప్తూ ఉన్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: అప్పటి తూర్పు పాకిస్తాన్ (ప్రస్తుత బంగ్లాదేశ్), పశ్చిమ పాకిస్తాన్ (ప్రస్తుత పాకిస్థాన్) మధ్య కారిడార్ కోసం జిన్నా చేసిన ప్రతిపాదనను గాంధీ అంగీకరించారు.

ఫాక్ట్(నిజం): అప్పటి తూర్పు పాకిస్తాన్ మరియు పశ్చిమ పాకిస్తాన్ మధ్య కారిడార్ కోసం జిన్నా చేసిన ప్రతిపాదనను గాంధీ అంగీకరించినట్లు చెప్పడానికి ఎటువంటి విశ్వసనీయమైన ఆధారాలు లేవు. అలాగే ఈ కారిడార్ డిమాండ్‌కు సంబంధించి గాంధీ ఎప్పుడూ ఎలాంటి ప్రకటన చేయలేదు. జిన్నా కారిడార్ డిమాండ్ చేసినప్పుడు, దానిని సర్దార్ పటేల్, జవహర్‌లాల్ నెహ్రూ పూర్తిగా తిరస్కరించారని పలు రిపోర్ట్స్ పేర్కొన్నాయి. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

వైరల్ పోస్టులో పేర్కొన్నట్లు బంగ్లాదేశ్ (పూర్వ తూర్పు పాకిస్తాన్) మరియు పాకిస్తాన్ (పూర్వ పశ్చిమ పాకిస్తాన్) మధ్య కారిడార్ కొరకు జిన్నా చేసిన ప్రతిపాదనను గాంధీ అంగీకరించారా? అని తెలుసుకోవడానికి తగిన కీవర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్‌లో వెతకగా, ఈ ప్రతిపాదనలకు  మహాత్మా గాంధీ అంగీకరించినట్లు తెలిపే ఎటువంటి విశ్వసనీయమైన రిపోర్ట్స్ మాకు లభించలేదు. 

ఇదే విషయమై మరింత వెతకగా, మే 1947లో Reuters పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో, భారతదేశం ద్వారా అప్పటి తూర్పు మరియు పశ్చిమ పాకిస్తాన్‌లను కలిపే కారిడార్‌ను జిన్నా కోరినట్లు తెలిసింది (ఇక్కడ). ఉత్తరప్రదేశ్ మరియు బీహార్ మీదుగా ఈ కారిడార్ కావాలని డిమాండ్ చేస్తూ జిన్నా 05 ఆగస్టు 1947న విన్‌స్టన్ చర్చిల్‌కు లేఖ కూడా రాశాడని తెలిసింది (ఇక్కడ).

అయితే, జిన్నా చేసిన ఈ ప్రతిపాదనను సర్దార్ పటేల్ మరియు జవహర్‌లాల్ నెహ్రూ పూర్తిగా తిరస్కరించారు . పటేల్ ఈ ప్రతిపాదనను, ‘అస్సలు సీరియస్‌గా తీసుకోని అద్భుతమైన నాన్సెన్స్ (a fantastic nonsense as not to be taken seriously at all)‘ అని పేర్కొన్నాడు . దీనీపై నెహ్రూ మాట్లాడుతూ , ‘ఈ కారిడార్ డిమాండ్ అసంబద్ధమైనది‘ అని పేర్కొన్నారు. అలాగే ఈ కారిడార్ డిమాండ్‌కు సంబంధించి గాంధీ ఎప్పుడూ ఎలాంటి ప్రకటన చేయలేదని DW అనే అంతర్జాతీయ మీడియా సంస్థ ఒక కథనంలో పేర్కొంది.

నాథూరామ్ గాడ్సే 30 జనవరి 1948న గాంధీని హత్య చేశాడు. గాడ్సే 05 మే 1949న పంజాబ్ హైకోర్టు ముందు ఇచ్చిన స్టేటమెంట్ లో గాంధీని చంపడానికి గల కారణాలను చెప్పాడు. ఈ స్టేటుమెంట్ లో ఎక్కడ గాడ్సే కారిడార్ ప్రతిపాదన గురించి ప్రస్తావించలేదు. కొన్ని పోస్టులు జాడ్ ఆడమ్స్ రచించిన ‘గాంధీ: నేకెడ్ ఆంబిషన్(Gandhi:Naked Ambition)’ అనే పుస్తకంలో ఈ కారిడార్ కోసం జిన్నా చేసిన ప్రతిపాదనను గాంధీ అంగీకరించారని పేర్కొన్నారు. అయితే, ఈ పుస్తకంలో కూడా జిన్నా అప్పటి తూర్పు పాకిస్తాన్ (ప్రస్తుత బంగ్లాదేశ్) మరియు పశ్చిమ పాకిస్తాన్ (ప్రస్తుత పాకిస్థాన్) మధ్య భారతదేశం గుండా ప్రతిపాదించిన కారిడార్‌కు గాంధీ తన ఆమోదం తెలిపినట్లు పేర్కొనలేదు. దీన్ని బట్టి అప్పటి తూర్పు పాకిస్తాన్ (ప్రస్తుత బంగ్లాదేశ్) మరియు పశ్చిమ పాకిస్తాన్ (ప్రస్తుత పాకిస్థాన్) మధ్య కారిడార్ కోసం జిన్నా చేసిన ప్రతిపాదనను గాంధీ అంగీకరించలేదని మనం నిర్ధారించవచ్చు.

చివరగా, అప్పటి తూర్పు పాకిస్తాన్ (ప్రస్తుత బంగ్లాదేశ్) మరియు పశ్చిమ పాకిస్తాన్ (ప్రస్తుత పాకిస్థాన్) మధ్య కారిడార్ కోసం జిన్నా చేసిన ప్రతిపాదనను గాంధీ అంగీకరించినట్లు చెప్పడానికి ఎటువంటి ఆధారాలు లేవు.