“భారత ప్రభుత్వం 15 జూన్ 2025 నుండి 60 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్ల కోసం ఉచిత ప్రయాణ పథకాన్ని ప్రారంభించింది” అని చెప్తూ ఉన్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఈ పోస్ట్ ప్రకారం, కొత్త పథకం ద్వారా, కేంద్ర ప్రభుత్వం 60 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లకు భారతీయ రైల్వేలు, దేశీయ విమానాలు, ప్రభుత్వ బస్సులు వంటి బహుళ రవాణా వ్యవస్థలలో ఉచిత ప్రయాణాన్ని అందిస్తుంది. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.
క్లెయిమ్: రైళ్లు, దేశీయ విమానాలు, ప్రభుత్వ బస్సులు వంటి బహుళ రవాణా వ్యవస్థలలో 60 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లకు ఉచిత ప్రయాణాన్ని అందించే కొత్త పథకాన్ని కేంద్ర ప్రభుత్వం 15 జూన్ 2025న ప్రారంభించింది.
ఫాక్ట్(నిజం): భారత ప్రభుత్వం 15 జూన్ 2025 నుండి 60 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లకు రైళ్లు, దేశీయ విమానాలు, ప్రభుత్వ బస్సులు వంటి బహుళ ప్రభుత్వ రంగ రవాణా వ్యవస్థలలో ఉచిత ప్రయాణాన్ని అందించడానికి ఒక కొత్త పథకాన్ని ప్రారంభించిందనే వార్తలో ఎటువంటి నిజం లేదు. కేంద్ర ప్రభుత్వం ఇలాంటి పథకం ఏది ప్రారంభించలేదు. భారత ప్రభుత్వం లేదా సంబంధిత మంత్రిత్వ శాఖలు కూడా ఇలాంటి పథకాన్ని తీసుకొచ్చే యోచనలో ఉన్నట్లు ఎటువంటి ప్రకటనలు చేయలేదు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.
ముందుగా ఈ వైరల్ పోస్టులో పేర్కొన్నట్లుగా, ఇటీవల 15 జూన్ 2025న, కేంద్ర ప్రభుత్వం 60 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లకు రైళ్లు, దేశీయ విమానాలు, ప్రభుత్వ బస్సులు వంటి బహుళ ప్రభుత్వ రంగ రవాణా వ్యవస్థలలో ఉచిత ప్రయాణాన్ని అందించడానికి ఒక కొత్త పథకాన్ని ప్రారంభించిందా? అని తెలుసుకోవడానికి తగిన కీవర్డ్స్ ఉపయోగిస్తూ ఇంటర్నెట్లో వెతకగా, ఈ వైరల్ క్లెయింను సమర్థించే ఎటువంటి విశ్వసనీయమైన రిపోర్ట్స్ మాకు లభించలేదు. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం ఇలాంటి పథకాన్ని ఇప్పటికే ప్రారంభించినా లేదా ఇలాంటి పథకాన్ని తీసుకొచ్చే యోచనలో ఉన్న, ఈ విషయాన్ని కచ్చితంగా పలు మీడియా సంస్థలు రిపోర్ట్ చేసి ఉండేవి.
సీనియర్ సిటిజన్లకు రైలు టిక్కెట్లపై 50% తగ్గింపును అందించే కొత్త విధానాన్ని భారతీయ రైల్వే ప్రకటించింది అంటూ పలు పోస్టులు కూడా సోషల్ మీడియా వైరల్ అవుతున్నాయి. అయితే, కేంద్ర ప్రభుత్వం మార్చి 2020లో కోవిడ్-19 వ్యాప్తి నివారణ చర్యలలో భాగంగా రైళ్లలో వృద్ధుల రాయితీతో సహ పలు రాయితీలను ఎత్తివేసింది (ఆర్కైవ్డ్). ఆర్థిక పరిమితుల కారణంగా సీనియర్ సిటిజన్లకు రైలు టిక్కెట్లపై రాయితీలను పునరుద్ధరించే ప్రణాళికలు లేవని కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో పలుమార్లు స్పష్టం చేసింది. అలాగే, 2025-26 కేంద్ర బడ్జెట్లో సీనియర్ సిటిజన్లకు రైలు టిక్కెట్లపై రాయితీలను పునరుద్ధరించే అంశాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం ప్రస్తావించలేదు. గతంలో కూడా సీనియర్ సిటిజన్లకు రైలు టిక్కెట్లపై రాయితీలను కేంద్రం తిరిగి ప్రారంభించింది అంటూ పలు పోస్టులు వైరల్ కాగా, అందులో నిజం లేదని చెప్తూ Factly ఫాక్ట్-చెక్ కథనాన్ని ప్రచురించింది (ఇక్కడ).
పలు ఫాక్ట్-చెక్ సంస్థలు (ఇక్కడ , ఇక్కడ) ఇదే విషయమై పలు రైల్వే జోన్ల చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్స్ (CPRO) లను సంప్రదించగా, 60 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లకు రైళ్లలో ఉచిత ప్రయాణం కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం ఎటువంటి కొత్త పథకాన్ని ప్రారంభించలేదని, ఈ వైరల్ వార్త అవాస్తవం వారు స్పష్టం చేశారు.
ఏదైనా విమానయాన సంస్థ సీనియర్ సిటిజన్లకు ఉచిత విమాన ప్రయాణాన్ని అందిస్తుందా? అని తెలుసుకోవడానికి తగిన కీవర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్లో వెతకగా, ఏ విమానయాన సంస్థ కూడా సీనియర్ సిటిజన్లకు ఉచిత విమాన ప్రయాణాన్ని అందిస్తున్నట్లు ఎటువంటి రిపోర్ట్స్ లభించలేదు. అయితే, ఎయిర్ ఇండియా, ఇండిగో మొదలైనవి సీనియర్ సిటిజన్లకు టిక్కెట్లపై స్వల్పంగా తగ్గింపును అందిస్తున్నాయని తెలిసింది.
ఇండిగో వెబ్సైట్లోని సమాచారం ప్రకారం, 60 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లు బేస్ రేటుపై 6% తగ్గింపుకు అర్హులు. ఇది దేశీయ విమానాలకు మాత్రమే వర్తిస్తుంది. ఇందుకోసం తగిన పత్రాలను ప్రయాణికులు అందించాలి.
ఎయిర్ ఇండియా వెబ్సైట్ ప్రకారం, 60 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లకు కొన్ని ఎంపిక చేసిన దేశీయ మార్గాల్లో ప్రయాణించే విమానలలో ఎకానమీ క్లాస్ ప్రయాణానికి 50% వరకు తగ్గింపు ఇవ్వబడుతుంది. ఇందుకోసం తగిన పత్రాలను ప్రయాణికులు అందించాలి. 60 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లకు ఎయిర్ ఇండియా బేస్ టికెట్ ఛార్జీలపై పౌర విమానయాన మంత్రిత్వ శాఖ 50% తగ్గింపును ప్రకటించిందని గతంలో పలు పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ కాగా, అందులో నిజం లేదని చెప్తూ Factly పబ్లిష్ చేసిన ఫాక్ట్-చెక్ కథనాన్ని ఇక్కడ చూడవచ్చు.
ప్రస్తుతం, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక వంటి పలు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ అధీనంలో నడిచే కొన్ని రకాల బస్సులలో సీనియర్ సిటిజన్లకు ఛార్జీలపై 25% రాయితీని అందిస్తున్నాయి. ఇటీవల, ఒడిశా ప్రభుత్వం ముఖ్యమంత్రి బస్ సేవ (MBS) అనే పథకాన్ని ఆమోదించింది, ఈ పథకం సీనియర్ సిటిజన్లకు AC, నాన్-AC బస్సులలో ఛార్జీలపై 50% రాయితీని అందిస్తుంది.
ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ బస్సులలో సీనియర్ సిటిజన్లకు అందిస్తున్న రాయితీలకు సంబంధించిన మరింత సమాచారాన్ని ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ చూడవచ్చు. కొన్ని రాష్ట్రాలు వయస్సుతో సంబంధం లేకుండా మహిళలకు కొన్ని తరగతులలో ఉచిత బస్సు ప్రయాణాన్ని అందిస్తున్నాయి, అందుకు సంబంధించిన సమాచారాన్ని ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ చూడవచ్చు.
ముంబై మెట్రో 2A మరియు 7 లైన్లలో ముంబై వన్ పాస్ పేరుతో 65 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లకు ఛార్జీలపై 25% రాయితీని అందిస్తోంది. కొచ్చిన్ మెట్రో 75 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లకు ఛార్జీలపై 50% రాయితీని అందిస్తోంది.
ఈ వైరల్ క్లెయిమ్ గురించి మేము తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC), హైదరాబాద్ మెట్రో అధికారులను కూడా సంప్రదించాము, వారి నుండి సమాధానం రాగానే ఈ ఆర్టికల్ అప్డేట్ చేయబడుతుంది.
చివరగా, భారత ప్రభుత్వం 15 జూన్ 2025 నుండి 60 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లకు ఉచిత ప్రయాణ పథకాన్ని ప్రారంభించిందనే వార్తలో ఎటువంటి నిజం లేదు. కేంద్ర ప్రభుత్వం అలాంటి పథకం ఏది ప్రారంభించలేదు.