09 జూన్ 2025న రాంచీలోని కథల్ మోర్ వద్ద ట్రాఫిక్ పోలీసులపై దాడి చేసిన నిందితులు ముస్లింలు కాదు

‘ఝార్ఖండ్‌లో కనీసం ఆటో డ్రైవర్ (రోహింగ్యా ముస్లిం) ని కూడా కంట్రోల్ చెయ్యలేని నిస్సహాయ స్థితిలో పోలీసులు ఉన్నారు’ అంటూ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఈ వీడియోలో ఒక వ్యక్తి యూనిఫాంలో ఉన్న పోలీసు అధికారి తలపై రాయితో కొట్టడాన్ని మనం చూడవచ్చు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: ఝార్ఖండ్‌లో ఒక ముస్లిం ఆటో డ్రైవర్ పోలీసు అధికారిపై దాడి చేస్తున్న దృశ్యాలు.

ఫాక్ట్(నిజం): ఈ వైరల్ వీడియో ఝార్ఖండ్‌ రాజధాని రాంచీలోని నగరి పోలీస్ స్టేషన్ పరిధిలో కథల్ మోర్ వద్ద 09 జూన్ 2025న ఆటో డ్రైవర్లు ట్రాఫిక్ పోలీసులపై దాడి చేసిన దృశ్యాలను చూపిస్తుంది. ఈ దాడిలో నిందితులు ముస్లింలు కాదు. నగరి పోలీస్ స్టేషన్‌లో నమోదైన FIR ప్రకారం, ఈ దాడిలో ముగ్గురు వ్యక్తులు పాల్గొన్నారు, నిందితుల పేర్లు హన్స్ కుమార్ యాదవ్ s/o రామ్ లఖన్ యాదవ్, మున్నా యాదవ్ అలియాస్ అఖిలేష్ కుమార్ s/o రామ్ లఖన్ యాదవ్, మరో వ్యక్తి పేరు తెలియదని FIRలో పేర్కొన్నారు. మూడో నిందితుడు పేరు రాజన్ యాదవ్ అలియాస్ ఎమ్మెల్యే అని, అతని కూడా పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారని 15 జూన్ 2025న ప్రచురితమైన హిందుస్థాన్ కథనం పేర్కొంది. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

ఈ వైరల్ వీడియోకు సంబంధించిన వివరాల కోసం, తగిన కీవర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్‌లో వెతకగా, వైరల్ వీడియోలోని దృశ్యాలను రిపోర్ట్ చేస్తూ ప్రచురితమైన పలు వార్తా కథనాలు లభించాయి (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఈ కథనాల ప్రకారం, ఈ వైరల్ వీడియో ఝార్ఖండ్‌ రాజధాని రాంచీలోని నగరి పోలీస్ స్టేషన్ పరిధిలో దల్దాలి ఓపీ ప్రాంతంలోని కథల్ మోర్ వద్ద 09 జూన్ 2025న ఓ ఆటో డ్రైవర్, అతని సహచరులు ట్రాఫిక్ పోలీసులపై దాడి చేస్తున్న దృశ్యాలను చూపిస్తుంది. కథల్ మోర్ వద్ద, ట్రాఫిక్ పోలీసులు రోడ్డుకు అడ్డుగా ఉన్న ఆటోను తొలగించమని కోరగా, ఆ ఆటో డ్రైవర్ ట్రాఫిక్ పోలీసులతో గొడవకు దిగాడు. ఆ తర్వాత ట్రాఫిక్ సిబ్బంది అతన్ని పట్టుకుని ట్రాఫిక్ అవుట్ పోస్ట్ వద్దకు తీసుకెళ్తున్న క్రమంలో ఆటో డ్రైవర్, అతని సహచరులు ట్రాఫిక్ పోలీసులపై దాడి చేశారు, నిందితులలో ఒకరు హోమ్ గార్డ్ రోహిత్ గంజుపై రాయితో కొట్టడంతో అతని తలకు తీవ్ర గాయమైంది. ఈ సంఘటన తర్వాత, నిందితులు పారిపోయారని, వారి కోసం పోలీసులు వెతుకుతున్నారని ఈ కథనాలు పేర్కొన్నాయి.

దీని ఆధారంగా ఈ ఘటనకు సంబంధించిన మరింత సమాచారం కోసం తగిన కీవర్డ్స్ ఉపయోగిస్తూ ఇంటర్నెట్‌లో వెతకగా, పలు వార్తా కథనాలు లభించాయి (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఈ కథనాల ప్రకారం, రాంచీలోని కథల్ మోర్ వద్ద విధుల్లో ఉన్న ట్రాఫిక్ పోలీసులపై దాడి చేసిన ఇద్దరు నిందితులను హన్స్ యాదవ్ అలియాస్ పుట్టి, మున్నా యాదవ్ అలియాస్ అఖిలేష్ యాదవ్ లను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టు తర్వాత, పోలీసులు ఇద్దరి నిందితులను కథల్ మోర్ రోడ్డుపై నడిపించారు (పరడే చేయించారు).

తదుపరి మేము ఝార్ఖండ్‌ పోలీసు వెబ్‌సైట్‌ను సందర్శించి, ఈ సంఘటనకు సంబంధించి రాంచీ నగరి పోలీస్ స్టేషన్‌లో నమోదు చేయబడిన FIR కాపీని పరిశీలించాము. FIR ప్రకారం, ఈ దాడిలో ముగ్గురు వ్యక్తులు పాల్గొన్నారు. FIRలో నిందితుల పేర్లు హన్స్ కుమార్ యాదవ్ s/o రామ్ లఖన్ యాదవ్, మున్నా యాదవ్ అలియాస్ అఖిలేష్ కుమార్ s/o రామ్ లఖన్ యాదవ్ అని మరో వ్యక్తి పేరు తెలియదని పేర్కొన్నారు. 15 జూన్ 2025న ప్రచురితమైన హిందుస్థాన్ కథనం ప్రకారం, మూడో నిందితుడు పేరు రాజన్ యాదవ్ అలియాస్ ఎమ్మెల్యే, అతని కూడా పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారు. ఈ కేసుకు సంబంధించిన FIR కాపీని ఇక్కడ చూడవచ్చు. దీన్ని బట్టి రాంచీలోని కథల్ మోర్ వద్ద ట్రాఫిక్ పోలీసులపై దాడి చేసిన ఆటో డ్రైవర్లు ముస్లింలు కాదని మనం నిర్ధారించవచ్చు.

ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకోవడం కోసం మేము రాంచీలోని నగరి పోలీసులను కూడా సంప్రదించాము, వారి నుండి సమాధానం రాగానే ఈ ఆర్టికల్ అప్డేట్ చేయబడుతుంది.

చివరగా, 09 జూన్ 2025న రాంచీలోని కథల్ మోర్ వద్ద ట్రాఫిక్ పోలీసులపై దాడి చేసిన నిందితులు ముస్లింలు కాదు.