శ్రీలంకకి చెందిన సైనికుడి ఫోటోను చూపిస్తూ భారత సైనికుడి పాత ఫోటో అని షేర్ చేస్తున్నారు

ఒకప్పుడు మనదేశానికి సేవ చేసిన సైనికుడు, ముష్కర మూకలతో జరిగిన పోరాటంలో ఇప్పుడు ఇలా క్షతగాత్రుడు అయ్యాడని షేర్ చేస్తున్న ఒక పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పోస్టులోని ఒక ఫోటో  ఆ సైనికుడు 2016లో సైన్యంలో ఉన్నప్పటిది అని, మరోకటి తను క్షతగాత్రుడు అయినాక తీసినది అని క్లెయిమ్ చేస్తున్నారు. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు

క్లెయిమ్: ముష్కర మూకలతో జరిగిన పోరాటంలో క్షతగాత్రుడైన భారత సైనికుడి ఫోటోలు.

ఫాక్ట్ (నిజం): ముష్కర మూకలతో జరిగిన పోరాటంలో క్షతగాత్రుడైన భారత సైనికుడి 2016 ఫోటో అని పోస్ట్ చేసిన ఫోటో శ్రీలంకకి చెందిన సైనికుడిది. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

పోస్టులో షేర్ చేసిన 2016 సంవత్సరంలోని ఆ సైనికుడి ఫోటోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, అదే ఫోటో ‘gettyimage’ వెబ్సైటులో దొరికింది. ఫోటోలో పరేడ్ చేస్తూ కనిపిస్తున్నది శ్రీలంక దేశానికి చెందిన సైనికులు అని అందులో తెలిపారు. 2008లో శ్రీలంక తమ 60వ స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకుంటున్న సందర్బంలో శ్రీలంక  స్పెషల్ ఫోర్స్ కమెండోలు మిలిటరీ పరేడ్ చేస్తున్న దృశ్యమంటూ అందులో తెలిపారు. శ్రీలంకకి చెందిన ‘Wedi Vistara’ అనే న్యూస్ వెబ్సైటు వారు కూడా ఈ ఫోటోను షేర్ చేస్తూ శ్రీలంక స్పెషల్ ఫోర్స్ కమెండోలకి సంబంధించిందని తెలిపారు. ఈ వివరాల ఆధారంగా ఫోటోలోని వ్యక్తి శ్రీలంకకి చెందిన సైనికుడని ఖచ్చితంగా చెప్పవచ్చు.

పోస్టులోని మరొక ఫోటోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ఆ ఫోటోలోని వ్యక్తికి సంబంధించి ఎలాంటి వివరాలు దొరకలేదు.

చివరగా, శ్రీలంకకి చెందిన సైనికుడి ఫోటోను చూపిస్తూ భారత సైనికుడి పాత ఫోటో అని తప్పుగా షేర్ చేస్తున్నారు.